Skip to main content

ఎన్నికలు, ఓటు విలువ

ఎన్నికల నోటిసు వచ్చిన తరువాత రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కు తున్నాయి. ఎవరికి వారు తామే గెలుస్తామనే ధీమాతో వున్నారు. చిరంజీవి గ్లామర్ మరియు సంతర్పణ హామీలు, చంద్రబాబు ఎల్లలు దాటిన సంతర్పణ, రాజశేఖర్ రెడ్డి ఇదివరకే చేసివున్న సంతర్పణ లపై నమ్మకం పెట్టుకున్నారు. వీళ్ళ మాటల వరస చూస్తుంటే వీళ్ళకు ప్రజలు తమ కాళ్ళమీద తామే నిలబడడం కంటే బిచ్చగాళ్ళ లాగా అడుక్కుంటే ఎక్కువ సంతోష పడతారేమో అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని చెపుతుంటారు. వీళ్ళు ఎక్కడినుంచి తెచ్చి ఇస్తారు? ప్రజల డబ్బేగా?

మనం ఇంకా జమీందారీ వ్యవస్థ లో నుంచి బయటికి రాలేదని అనిపిస్తోంది. ఎంత సేపూ ఎవరో రావాలి, ఏదో ఇవ్వాలి అని కోరుకుంటాం. నిన్న ఓ టీవీ ఛానల్ లో చూపించారు... ఒకరు ఫ్రిజ్ ఇస్తే వోటేస్తాం అంటున్నారు, ఇంకొకరు మరోటి ఇస్తే వోటేస్తాం అంటున్నారు. జయప్రకాష్ నారాయణ గారి మాటలలో చెప్పాలంటే ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ని రాబోయే ఐదేళ్ళలో ప్రవేశ పెట్ట బోతుంది. మూడు కోట్ల మంది వోటేస్తే చాలు గెలవడానికి. అంటే ప్రతి ఓటు విలువ రెండు లక్షల ముప్పై వేల పైమాటే. తమ వోటుకు ఇంత విలువ ఉందని సామాన్యులకు తెలువడం లేదు. అందుకే తమ వోటుని వందకి, రెందొందలకి అమ్ముకోవడానికి వెనుకాడడం లేదు.

విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే చదువుకున్న ఆలోచనా విధానం కూడా ఏ మాత్రం ఆశా జనకంగా లేదు, కొద్ది శాతం మినహాయిస్తే. ఎమ్మెల్సీ ఎలెక్షన్లలో గ్రాడ్యుయేట్ మరియు టీచర్ల నియోజక వర్గాల్లో నిర్లజ్జగా తమ వోట్లను, డబ్బులకు, సెల్ ఫోన్లకు అమ్ముకోవడం నేను చూసాను. వోటుపై, ఎన్నికలపై ప్రతి ఒక్కరి, కనీసం మెజారిటీ ప్రజల దృక్పథం లో మార్పు వస్తే తప్ప నిజమైన ప్రజాస్వామ్యం ఏర్పడే అవకాశం లేదు. ఆ రోజు త్వరలోనే వస్తుందని కోరుకుందాం.

Comments

Popular posts from this blog

తెలుగును పునరుజ్జీవింప జేద్దాం

భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం. ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి క్లిష్టమైన సంస్కృత సమాసాలను వాడుతున్నారు. దీనివల్ల ఒక భాష నుండి వేరొక భాషకు దాసోహం చెప్పడం తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. సంస్కృతం తన సహజరూపం లోనే మన లేక హిందీగా మారి ఉత్తర భారతంలో బ్రతుకుతుంది. అలాంటి సంస్కృత పదాలను అరువుతెచ్చుకుని తెలుగులో వ్యాప్తిలోకి తీసుకు రావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అవసరం లేదు కూడా. మన భాష ప్రస్తుత పరిస్థితికి ప్రబంధ సాహిత్యం తప్ప, సాంకేతిక పరమైన సాహిత్యం మనకు లేకపొవడం కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. పైగా మన పూర్వ కవులకు సంస్కృతం పై ఉన్న ఎనలేని మోజు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణం. అర్జునుడికి వంద పేర్లు ఉంటాయి. irrigation అనే పదానికి ఒక్క తెలుగు ...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...

కేసీయార్ అనుచిత వ్యాఖ్యలు

చంద్రశేఖర రావు ఆంధ్రా బిర్యానీని పరిహసిస్తూ వ్యాఖ్యలు చేయడం ప్రతి తెలంగాణా పౌరుడు ఖండించ దగిన విషయం. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయాలలో కొత్త కాక పోయినా ఒక ఉదాత్తమైన ప్రజా ఉద్యమానికి శోభ నివ్వవు. నిజానికి హైదరాబాదీ బిర్యానీకి దేశ వ్యాప్తంగా మంచి పేరు ఉంది. దేశ ప్రధాని, రాష్ట్రపతి విదేశీ ప్రతినిధులకు ఎప్పుడు విందులు చేసినా తప్పనిసరిగా ఉండే వంటకం హైదరాబాదీ బిర్యానీ. ప్రక్క వారి వంటకాలను తిట్టడం ద్వారా దీనికి కొత్తగా గొప్పదనం ఆపాదించవలసిన అవసరం లేదు, ఇతరులను హేళన చేయడం తప్ప. ఈ వ్యాఖ్యలు చంద్రశేఖర రావు చేయడంలో ఆశ్చర్యం లేదు. చంద్రశేఖర రావు ఒక ఫక్తు రాజకీయ నాయకుడు. అతనికి ప్రజల్లో ఉన్న తెలంగాణా ఆకాంక్షని స్వలాభాపేక్షగా మార్చుకోవాలనే తపన ఉంది తప్ప తెలంగాణాలో ఉన్న నిజమైన పీడిత తాడిత శక్తులకు ఆయన ప్రాతినిధ్యం వహించడం లేదు. అయితే నిద్రాణంగా ఉన్న తెలంగాణా వాదాన్ని తట్టిలేపి బలంగా వినిపించిన ఘనత కేసీయార్ కే దక్కుతుంది. కాంగ్రెస్, తెలుగుదేశం కలిసికట్టుగా తెలంగాణా వాదాన్ని చావు దెబ్బ తీయడానికి ప్రయత్నించిన నేపథ్యంలో నిఖార్సైన తెలంగాణా వాదిగా కేసీయార్ మాత్రమే తెలంగాణా ప్రజల సంపూర్ణ మద్ద...