Skip to main content

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు.

అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు.

నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న రాజకీయ శూన్యాన్ని పూడ్చగలిగి ఉండే వారేమో.

2009 ఎన్నికలలో పరిస్థితి వేరుగా ఉంది. అప్పటికే రాజశేఖర్ రెడ్డి తన ప్రభుత్వంలో రకరకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఇంకోవైపు ప్రభుత్వ అవినీతిని ఎండగడుతూ, గతంలో తాను చేసిన అభివృద్ధి పనులను ఉటంకిస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా బలం పుంజుకున్నారు. ఈ పరిస్థితులలో వచ్చిన చిరంజీవి వారి వారి వోటు బ్యాంకులను చీల్చడం తప్ప పెద్దగా సాధించ గలిగింది ఏమీ లేదు.

రాజకీయ నాయకుడనే వాడికి ఒక సిద్ధాంతం ఉండాలి. తన సిద్ధాంతాన్ని ప్రజలకు బలంగా చెప్పగలిగి ఉండాలి. కానీ చిరంజీవి విషయంలో ఇవేవీ కనపడవు. మొదట మిత్రా తో కలిసి ప్రజారాజ్యం స్థాపించి నప్పుడు మార్క్సిస్టు వాసన కనిపించింది. అప్పుడు అందరూ మార్క్సిస్టు భావాలు కలిగిన పార్టీ అని భావించారు. తన మామ అల్లురామలింగయ్య మార్క్సిస్టు భావాలు కలిగి ఉండడం కూడా కొంత కారణం. కమ్యూనిస్టులు చిరంజీవి వర్గాలతో చర్చలు జరపడం కూడా కనిపించింది.

తర్వాత కత్తి పద్మారావు లాంటి వారు ప్రవేశించడంతో ఆ పార్టీ సామాజిక న్యాయం వాసనలు కొట్టడం ప్రారంభించింది. ఆ తర్వాత దేవేందర్ గౌడ్ పార్టీ విలీనం చెందడంతో అది 'సామాజిక తెలంగాణా' గా మారింది. డిసెంబరు 10 2009 తర్వాత అది 'జై సమైఖ్యాంధ్ర' గా మారింది. చివరికి నిన్న సోనియా గాంధీని కలిసిన తర్వాత అది 'అమ్మ మాట శిరోధార్యం' క్రింద మారింది. కాకలు తీరిన నేతలే తమ దిశను మార్చుకోవడానికి పదిసార్లు ఆలోచిస్తారు, ప్రజలు గమనిస్తారేమోనని. అలాంటిది క్రొత్తగా రాజకీయాలలోకి వచ్చిన చిరంజీవి ఇన్నిరకాలుగా సిద్ధాంతాలలో మార్పు చేర్పులు చేయడం ప్రజలు గమనిస్తూనే ఉంటారు.

వాస్తవానికి చిరంజీవికి తన పార్టీని కాంగ్రేసులో విలీనం చేయడం తప్ప వేరే మార్గం లేదు. ఇప్పటికే తెలంగాణా లో ప్రాభవం కోల్పోయారు. ఇద్దరు తెలంగాణా ఎమ్మెల్యేలు అంటీ  ముత్తనట్టుగా ఉన్నారు. ఇంకొందరు జగన్ వెంట వెళ్ళే పనిలో ఉన్నారు. ఈ పరిస్థితులలో ఇంకా మూడు సంవత్సరాలు అధికారంలో పాలు పంచుకోకుండా పార్టీని నడపడం దాదాపు అసాధ్యం. మూడు సంవత్సరాల తర్వాత కూడా తన పార్టీ ద్వారా CM పదవి సాధించే మార్గం కానరావడం లేదు. ముందు ముందు పదవులు వచ్చినా, రాకపోయినా, పార్టీని నడపాల్సిన బృహత్తర బాధ్యత నుండి విముక్తి లభిస్తుంది.

కాంగ్రేసు పార్టీ వారికి మాత్రం తక్షణ ప్రయోజనాలు సిద్ధించడం ఇప్పటికే కనపడుతుంది. కాంగ్రెస్ బాలహీన పడి ఉప ఎన్నికలు వస్తాయేమోనని జగన్ వెంట ఉన్నవారు తాజా పరిణామాలతో ఒక్కక్కరే మాయం కావడం మొదలు పెట్టారు. ఈ లెక్క కాంగ్రెస్ వ్యూహం ఫలించి నట్టే. తర్వాత్తర్వాత కాంగ్రెస్ వారు కూరలో కరివేపాకులా చిరంజీవిని పక్కకు పెడతారా, పెద్దపీట వేసి కూర్చోబెడతారా అన్నది వేచి చూడాల్సిందే.

Comments

  1. నాకు తెలిసి ప్రజారాజ్యం పార్టీని సిద్ధాంతాల పునాదుల మీద స్థాపించలేదు. సినిమా గ్లామర్ పునాదుల మీద స్థాపించిన పార్టీ అది. సిద్ధాంతాల పునాదుల మీద స్థాపించబడిన మార్క్సిస్ట్, మావోయిస్ట్ పార్టీలలో అంతర్గత విభేదాల వల్ల చీలికలు వచ్చినా సిద్ధాంతాల మీద నమ్మకంతో వాటిలో పని చేసేవాళ్లు ఉంటారు. గురు గోల్వాల్కర్ సిద్ధాంతాలని నమ్మే RSSలోనైనా సరే చీలిక వచ్చినా అందులో సభ్యులు కొనసాగుతారు. కానీ ఇతర పార్టీలలో అలా కాదు. కేవలం పదవుల కోసం పార్టీలో చేరుతారు. పదవి రాకపోతే పార్టీ నుంచి వెళ్లిపోతారు. ప్రజారాజ్యం పార్టీలో అలాగే జరిగింది.

    ReplyDelete
  2. ప్రవీణ్ శర్మ గారు,

    లోపల ఉన్నది అధికార సిధ్ధాంతమే అయినా, పైకి మాత్రం సిధ్ధాంతాలు చెప్పారుగా! వారు అధికారమే మా సిధ్ధాంతం అని చెప్పి వస్తే గొడవే లేదు.

    ధన్యవాదాలు.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

తెలుగును పునరుజ్జీవింప జేద్దాం

భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం. ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి క్లిష్టమైన సంస్కృత సమాసాలను వాడుతున్నారు. దీనివల్ల ఒక భాష నుండి వేరొక భాషకు దాసోహం చెప్పడం తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. సంస్కృతం తన సహజరూపం లోనే మన లేక హిందీగా మారి ఉత్తర భారతంలో బ్రతుకుతుంది. అలాంటి సంస్కృత పదాలను అరువుతెచ్చుకుని తెలుగులో వ్యాప్తిలోకి తీసుకు రావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అవసరం లేదు కూడా. మన భాష ప్రస్తుత పరిస్థితికి ప్రబంధ సాహిత్యం తప్ప, సాంకేతిక పరమైన సాహిత్యం మనకు లేకపొవడం కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. పైగా మన పూర్వ కవులకు సంస్కృతం పై ఉన్న ఎనలేని మోజు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణం. అర్జునుడికి వంద పేర్లు ఉంటాయి. irrigation అనే పదానికి ఒక్క తెలుగు ...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...