Skip to main content

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ.

"హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది. 

"నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక.

"మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్".

భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు.

"అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?"

"మీరు లోపలికి ఎలా వచ్చారు?"

"అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం."

"మరి వాళ్ళెలా వచ్చారు?"

"వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ.

"ఎలా వెళ్ళారు?"

"చేతులూపుకుంటూ".

"అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ వాళ్ళకూ".

చేసేదేం లేక ఎంపీలు చేతులు నలుపుకో సాగారు. 

"పోనీ మేం సూట్ కేసులు ఇవ్వకుండా వచ్చే ఎన్నికల్లో గెలవగలరా?"

"ఎలా గెలవగలం సార్? ఇప్పటికే జనం చీకొడుతున్నారు, చవట సన్నాసులమని తిడుతున్నారు".

"మరయితే అన్నీ మూసుకొని వెళ్ళిపొండి".

"వెళ్లలేం సార్" అందరూ ఒకే మారు చెప్పారు. "జనం మమ్మల్ని చూస్తే వాయగొట్టేలా వున్నారు. మీరే ఏదో ఓ మార్గం చెప్పాలి."

"ఆ కాగితంలో ప్రకటన రాసి ఉంది, బయటికి వెళ్లి ప్రెస్ వారి ముందు చదవండి".

---౦౦౦---

మేం అధిష్టానం దగ్గర తెలంగాణా వాదాన్ని బలంగా వినిపించాం. 
ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం తప్ప వేరే ఏ వికల్పానికి కూడా తెలంగాణా ప్రజలు అంగీకరించరని ఖరా ఖండీగా అధిష్టానానికి తేల్చి చెప్పాం. 

అధిష్టానం మామాటలు సావధానంగా ఆలకించింది. 
తెలంగాణాపై సరైన సమయంలో సరయిన నిర్ణయం తీసుకుంటామని వారు తేల్చి చెప్పారు. 
తెలంగాణా తెచ్చేదీ ఇచ్చేదీ మా పార్టీయేనని ఈ సందర్భంగా ప్రజలకి మీ ద్వారా తెలియజేసు కుంటున్నాం. 

జై తెలంగాణా!

Comments

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

తెలుగును పునరుజ్జీవింప జేద్దాం

భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం. ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి క్లిష్టమైన సంస్కృత సమాసాలను వాడుతున్నారు. దీనివల్ల ఒక భాష నుండి వేరొక భాషకు దాసోహం చెప్పడం తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. సంస్కృతం తన సహజరూపం లోనే మన లేక హిందీగా మారి ఉత్తర భారతంలో బ్రతుకుతుంది. అలాంటి సంస్కృత పదాలను అరువుతెచ్చుకుని తెలుగులో వ్యాప్తిలోకి తీసుకు రావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అవసరం లేదు కూడా. మన భాష ప్రస్తుత పరిస్థితికి ప్రబంధ సాహిత్యం తప్ప, సాంకేతిక పరమైన సాహిత్యం మనకు లేకపొవడం కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. పైగా మన పూర్వ కవులకు సంస్కృతం పై ఉన్న ఎనలేని మోజు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణం. అర్జునుడికి వంద పేర్లు ఉంటాయి. irrigation అనే పదానికి ఒక్క తెలుగు ...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...

కేసీయార్ అనుచిత వ్యాఖ్యలు

చంద్రశేఖర రావు ఆంధ్రా బిర్యానీని పరిహసిస్తూ వ్యాఖ్యలు చేయడం ప్రతి తెలంగాణా పౌరుడు ఖండించ దగిన విషయం. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయాలలో కొత్త కాక పోయినా ఒక ఉదాత్తమైన ప్రజా ఉద్యమానికి శోభ నివ్వవు. నిజానికి హైదరాబాదీ బిర్యానీకి దేశ వ్యాప్తంగా మంచి పేరు ఉంది. దేశ ప్రధాని, రాష్ట్రపతి విదేశీ ప్రతినిధులకు ఎప్పుడు విందులు చేసినా తప్పనిసరిగా ఉండే వంటకం హైదరాబాదీ బిర్యానీ. ప్రక్క వారి వంటకాలను తిట్టడం ద్వారా దీనికి కొత్తగా గొప్పదనం ఆపాదించవలసిన అవసరం లేదు, ఇతరులను హేళన చేయడం తప్ప. ఈ వ్యాఖ్యలు చంద్రశేఖర రావు చేయడంలో ఆశ్చర్యం లేదు. చంద్రశేఖర రావు ఒక ఫక్తు రాజకీయ నాయకుడు. అతనికి ప్రజల్లో ఉన్న తెలంగాణా ఆకాంక్షని స్వలాభాపేక్షగా మార్చుకోవాలనే తపన ఉంది తప్ప తెలంగాణాలో ఉన్న నిజమైన పీడిత తాడిత శక్తులకు ఆయన ప్రాతినిధ్యం వహించడం లేదు. అయితే నిద్రాణంగా ఉన్న తెలంగాణా వాదాన్ని తట్టిలేపి బలంగా వినిపించిన ఘనత కేసీయార్ కే దక్కుతుంది. కాంగ్రెస్, తెలుగుదేశం కలిసికట్టుగా తెలంగాణా వాదాన్ని చావు దెబ్బ తీయడానికి ప్రయత్నించిన నేపథ్యంలో నిఖార్సైన తెలంగాణా వాదిగా కేసీయార్ మాత్రమే తెలంగాణా ప్రజల సంపూర్ణ మద్ద...