Skip to main content

జయహో అన్నా హజారే

మన దేశానికి అవినీతి ఒక మానని గాయంలా తయారై సలుపుతుంది. యాభై రూపాయలకు ఆశపడి వోటు వేసే సామాన్యుడి నుండి ఐదువేల కోట్లు తీసుకుని సంతకం పెట్టే మంత్రి వరకు ఇది ఒక మహా విషవృక్షంలా తయారైంది. విత్తు ముందా, చెట్టు ముందా అన్నట్టు డబ్బు తీసుకోకుండా మార్పు ఎక్కడ మొదలు కావాలి, సామాన్యుడి లోనా, రాజకీయ నాయకుల లోనా అనేది ఒక తెగని సమస్యగా మారి పోయింది.

ఈ రోజున దాదాపు డెబ్బై అయిదు లక్షల కోట్ల డబ్బు అవినీతి పరుల చేతుల్లో పడి స్విస్స్ బ్యాంకుల్లో మూలుగుతుంది. ఈ డబ్బు గనక వినియోగంలోకి వస్తే దాదాపు ఐదు సంవత్సరాలు దేశ ప్రజలు ఎలాంటి టాక్సులు కట్టాల్సిన అవసరం ఉండదు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అవినీతిని నిర్మూలించాల్సిన ఆవశ్యకత ఎంతో.

ప్రతి ఏడూ లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపేణా వసూలు చేయ బడుతుంది. ఆపైన ఎన్నో కోట్ల రూపాయల దేశంలోని సహజవనరులకు ప్రభుత్వం ఆధిపత్యం వహిస్తుంది. ఇంతటి సంపదపై ఆధిపత్యం వహిస్తున్నపుడు, సంబధిత పాలకవర్గం ప్రలోభాలకు గురికావడం సహజమైన విషయం. అందుకనే అవినీతిని రూపు మాపడానికి అత్యంత శక్తి వంతమైన నిఘా, విచారణ సంస్థను ఏర్పాటు చేసి, సంబంధిత వ్యక్తులను శిక్షించడం తప్ప వేరే మార్గం లేదు.

అలా వచ్చిన ఆలోచనే లోక్ పాల్ వ్యవస్థ. నలభై రెండు సంవత్సరాల క్రితమే 1968 లోనే ఆమోదం పొందినా 1969 లో లోక్ సభ రద్దు కావడంతో మొదటిసారి లోక్ పాల్ బిల్లు మూలకు పడింది. ఆ తర్వాత 1971, 1977, 1985, 1989, 1996, 1998, 2001, 2005 మరియు 2008 లలో పార్లమెంటు ముందుకు వచ్చినా బలమైన లాబీలు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ఎప్పటికప్పుడు మరిన్ని మార్పులు కోరడం, బిల్లు శీతలమాలిగలోకి వెళ్ళడం యధావిధిగా జరిగి పోతుంది.


బయటికి మాత్రం అన్ని పార్టీల రాజకీయ నాయకులు లోక్ పాల్ వ్యవస్థ ఆవశ్యకతను సమర్థించే వారే. కాని లోలోపల మాత్రం రాజకీయ నాయకులెవరికీ ఈ బిల్లు అమలు కావడం ఇష్టం ఉండదన్న విషయం బహిరంగ రహస్యం. ఎవరు మాత్రం తమపై తామే నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు? అందుకనే గత నలభై రెండు సంవత్సరాలుగా బిల్లు అమలుకు నోచుకోకుండా ఉండిపోతుంది.

అసలు ఈ బిల్లు అమలు లోకి వస్తే మాత్రం ఎంతమేరకు అవినీతి అరికట్ట బడుతుంది అనేది మరో కోణం. ఇప్పుడు మన రాష్ట్రం లో ఉన్న లోకాయుక్త ఎంతమేరకు పనిచేస్తుందో చూస్తూనే ఉన్నాం. అధికారాలు లేని వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల దానిలోని సిబ్బందికి జీత భత్యాలు ఇవ్వడం తప్ప మరో ఉపయోగం ఉండదు. ఒక వేళ ప్రజల వత్తిడి ఎక్కువై బిల్లు ప్రవేశ పెట్టినా దాని కోరలు, పళ్ళూ కూడా ఊడబెరికి మన రాజకీయ నాయకులు బిల్లు ఆమోదిస్తారనే విషయంలో ఎవరికీ సందేహం అవసరం లేదు. 

కాబట్టి ఇప్పటికైనా బిల్లు విషయంలో ప్రజలంతా అప్రమత్తం అయి ఉద్యమించవలసిన అవసరం ఉంది. ఇందుకోసం ముందడుగు వేసిన అన్నాహజారే ఎంతైనా అభినంద నీయులు.  ఆయన నిన్నటినుండి లోక్ పాల్ బిల్లు అమలు కోసం ఆమరణ నిరాహార దీక్షకు కూచున్నారు.

అన్నాహజారేతో మొదలైన స్ఫూర్తి దేశం మొత్తం పాకి పోయి ఒక దావానలంగా మారిపోయి అవినీతి భూతాన్ని దహించి వేయాలని ఆశించడం ప్రస్తుతానికి అత్యాశే అయినా, దీని వల్ల దేశంలో అవినీతి పై చర్చ జరిగి ప్రజలు కొంత మేరకైనా చైతన్యవంతం కావాలని ఆశిద్దాం.


Comments

  1. very thoughtful post, and need of the hour.
    I hope citizens realizet he importance of this hunger strike and extend their support in what ever way they can.

    Thanks for the thought provoking write-up, Hari!

    ReplyDelete
  2. >>>>>>అధికారాలు లేని వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల దానిలోని సిబ్బందికి జీత భత్యాలు ఇవ్వడం తప్ప మరో ఉపయోగం ఉండదు. ఒక వేళ ప్రజల వత్తిడి ఎక్కువై బిల్లు ప్రవేశ పెట్టినా దాని కోరలు, పళ్ళూ కూడా ఊడబెరికి మన రాజకీయ నాయకులు బిల్లు ఆమోదిస్తారనే విషయంలో ఎవరికీ సందేహం అవసరం లేదు.>>>>

    నూటికి నూరుపాళ్ళు నిజం. చాలా మంచి టపా. ఆయన ప్రయత్నం సఫలం కావాలని ఆశిద్దాం.

    ReplyDelete
  3. శిశిర గారు, ధన్యవాదాలు.

    ReplyDelete
  4. అన్నా హజారే లాంటి యువ శక్తి ఆవశ్యకత మన దేశానికి ఎంతైనా ఉంది .......

    ReplyDelete
  5. ప్రవీణ్ శర్మగారూ మీ బ్లాగులో కొన్ని పోస్ట్ లు చదివాను. ఏవో నాలుగు ఆకతాయి మాటలు, అభిప్రాయాలు రాసి బ్లాగుల్ని కూడా ఫోరమ్స్ లా మార్చేస్తున్నారు కొందరు. బ్లాగ్ సాహిత్యాన్ని నిత్యం చూస్తానే కానీ మరీ డీప్ గా తీసుకునేంత అర్హత ఇంకా వాటికి రాలేదనే అభిప్రాయం నాకుంది. కానీ మీ బ్లాగుల్లాంటివి చూసినప్పుడు నా అభిప్రాయం మార్చుకుంటున్నాను. మీ శైలి, రాయడానికి మీరు ఎంచుకుంటున్న దృక్కోణం, రాతలో నిజాయతీ ... అన్నీ బాగున్నాయి. అన్ని పోస్టులూ చదవలేదు గానీ... స్థాలీపులాకంగా చదవగానే నాకు అనిపించింది ఇదీ... మీ కృషి అభినందనీయం.
    వక్కలంక కిషోర్

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

తెలుగును పునరుజ్జీవింప జేద్దాం

భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం. ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి క్లిష్టమైన సంస్కృత సమాసాలను వాడుతున్నారు. దీనివల్ల ఒక భాష నుండి వేరొక భాషకు దాసోహం చెప్పడం తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. సంస్కృతం తన సహజరూపం లోనే మన లేక హిందీగా మారి ఉత్తర భారతంలో బ్రతుకుతుంది. అలాంటి సంస్కృత పదాలను అరువుతెచ్చుకుని తెలుగులో వ్యాప్తిలోకి తీసుకు రావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అవసరం లేదు కూడా. మన భాష ప్రస్తుత పరిస్థితికి ప్రబంధ సాహిత్యం తప్ప, సాంకేతిక పరమైన సాహిత్యం మనకు లేకపొవడం కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. పైగా మన పూర్వ కవులకు సంస్కృతం పై ఉన్న ఎనలేని మోజు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణం. అర్జునుడికి వంద పేర్లు ఉంటాయి. irrigation అనే పదానికి ఒక్క తెలుగు ...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...