Skip to main content

దోపిడీ స్వభావం

మనిషి నాగరికత నేర్చుకుంటున్న కాలం నించీ అనివార్యంగా సాగుతున్న కార్యక్రమం దోపిడీ. కాలానుగుణంగా దోపిడీ స్వభావం మారింది కాని దోపిడీ అలాగే ఉంది.

అసలు దోపిడీ అంటే ఏమిటి? ఒకడి కష్టార్జితాన్ని ఇంకోడు కొల్లగొట్టడం. ఇక్కడ ఇంకో ప్రశ్న ఉదయిస్తుంది, కష్టార్జితం కాకపొతే కొల్లగొట్ట వచ్చునా, అని. ఇవన్నీ నిర్ణయించడానికి, లెక్కగట్టడానికి కారల్ మార్క్స్ ఒక పెద్ద పుస్తకమే రాశాడు. ఇప్పుడు ఆవివరాలలోకి పోవడం నా ఉద్దేశం కాదు.

ఆసలు ఈ దోపిడీ ఎలా పుట్టింది అని ఆలోచిస్తే, ఆదిమ సమాజంలోనే దీనికి బీజాలు పడి ఉంటాయి అని చెప్పక తప్పదు. మనిషి జంతువులా జీవించిన కాలంలో దోపిడీ అంతగా ఉండే అవకాశం లేదు. అయితే గియితే కుటుంబంలోనే బలవంతుడు బలహీనుడు నోటి దగ్గరి కూడు లాక్కునివుంటాడు. అది కూడా దోపిడీయే! కాని వ్యవస్థీకృతం కాదు.

నాగరికత పెరుగుతున్న కొద్దీ జనం జానపదాలుగా (గ్రామాలు) గుమికూడడం మొదలు పెట్టారు. వ్యవసాయం చేసి కొంత అదనపు ధాన్యమో, పనిముట్లో కూడబెట్టుకోనే అవకాశం కలిగింది. ఇలా మొదలైంది ప్రైవేటు ఆస్తి. అయితే వ్యవస్థ పై నియంత్రణ లేక పోవడం వలన కొంత మంది బలవంతులు సహజంగానే బలహీనులను బెదిరించి ఇలా కూడబెట్టిన ఆస్తులను కొల్లగొడుతూ ఉంటారు. మొదటిసారిగా ఇలా మొదలైవుంటుంది దోపిడీ.

ఇలాంటి దోపిడీని ఎదిరించడానికి ప్రజల్లోంచే నాయకత్వం తప్పకుండా బయట పడుతుంది. ప్రభావశీలురైన మనుషులు మిగతా ప్రజలకు నాయకత్వం వహించి దోపిడీని ఎదిరించడం సహజ సిద్ధంగా జరిగే పరిణామం. మన పురాణాలలో కనబడే పాత్రలు ఇలాంటి నాయకత్వానికి ప్రతీకలుగా భావించవచ్చు. దోపిడీని ఎదిరించడంలో సఫలీకృతుడైన నాయకుడు అక్కడితో ఆగడు. అతడు నేతగా, చివరికి రాజుగా రూపాంతరం చెందుతాడు.

ఆ విధంగా వచ్చిందే రాజరిక వ్యవస్థ. ఈ విధంగా రాజరిక వ్యవస్థ కూడా దోపిడీని ఎదిరించడానికి పుట్టిందే కాని, దోపిడీ కోసం పుట్టింది కాదు.

చరిత్రని గమనిస్తే అది నిత్యం మార్పు చెందుతూ ఉంటుంది. అది మార్పు చెందకుండా జడంగా ఉండడం మొదలు పెడుతుందో, అప్పుడు మళ్ళీ డానికి రోగాలు పెరుగుతాయి. అలాగే రాజరిక వ్యవస్థ ముదిరిన కొద్దీ దాని రోగాలు కూడా అనివార్యంగా పెరగ సాగాయి. అలా వేళ్ళూనుకున్నదే  ఫ్యూడల్ వ్యవస్థ.

ఏ దోపిడీకి వ్యతిరేకంగా రాజరిక వ్యవస్థ మొదలైందో, ఆ దోపిడీనే వేళ సంవత్సరాల పాటు నిరాటంకంగా కొనసాగించింది రాజరిక/ఫ్యూడల్ వ్యవస్థ. దోపిడీ కొనసాగిన కొద్దీ, అనివార్యంగా దోచుకోబడే వారి సంఖ్య పెరగడం, దోచుకునే వారి సంఖ్య తగ్గడం జరుగురుంది. దోపిడీకి గురయ్యే వారు సంఘటితం కావడం కూడా తప్పనిసరిగా జరిగే పరిణామం.

విప్లవాలు వచ్చాయి, రాజ్యాలు కూలాయి. 'ప్రజాస్వామ్యం' అనే ఆలోచనలకు బీజాలు పడ్డాయి.

సరిగ్గా ఈదశలో రెండురకాల ఆలోచనా విధానానికి అంకురార్పణ జరిగింది. పెట్టుబడిదారీ వ్యవస్థ, కమ్యూనిస్టు వ్యవస్థ. ఇక్కడ గమనించాల్సింది ఈ రెండు రకాల వ్యవస్థలు కూడా దోపిడీ వ్యతిరేక ఉద్యమాలు లేదా విప్లవాల మూలంగానే ఏర్పడ్డాయి. చరిత్ర తనను తాను సవరించు కోవడంలో భాగంగానే ఈ పరిణామాలు సంభవించాయి.

అయితే కాలానుగుణంగా ఈ రెండురకాల వ్యవస్థలలోనూ లోపాలు బయటపడ్డాయి.

పెట్టుబడిదారీ వ్యవస్థలో డబ్బు అధికంగా సంపాదించిన వాడు శక్తివంతుడిగా మారాడు. తద్వారా ప్రభుత్వాలను ప్రభావితం చేసి మరింత దోపిడీకి సమకట్టాడు. సంపాదనా సమరంలో వెనుక బడ్డవాడు మరింత పేదవాడుగా మారాడు, బతుకీడ్చలేక మరణించిన సందర్భాలు కూడా కోకొల్లలు.

కమ్యూనిజంలో డబ్బురూపేణా దోపిడీ జరిగే అవకాశం లేదు. అయితే అక్కడ అధికారం ఉన్నవాడే శక్తివంతుడు. అధికార వర్గాలు నానాటికి బలపడి, సాధారణ జన జీవితాన్ని దుర్భరం చేసిన సంఘటనలు జరిగాయి. అంతేకాదు, దోపిడీ అంటే ఇతరుల కష్టార్జితాన్ని దోచుకోవడమే కాదు, తాను కష్ట పడకుండా ఇతరుల కష్టఫలితాన్ని అనుభవించడం కూడా దోపిడీయే అవుతుంది. ఈరకంగా కమ్యూనిస్టు సమాజంలో కూడా దోపిడీ స్వభావం అలాగే ఉంది.

చరిత్ర పరిశీలించినప్పుడు తెలిసేది ఏమంటే, దోపిడీస్వభావం కాలానుగుణంగా గుణాత్మకమైన  మార్పులు సంతరించుకుందే తప్ప దోపిడీ మాత్రం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది.

Comments

Popular posts from this blog

నల్ల జీవో

ప్రభుత్వం తాజాగా GO నెంబర్ 177 విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన తెలుపడానికి అనుసరించే పద్ధతులైన సమ్మె, టూల్ డౌన్, పెన్ డౌన్ తదితర ప్రక్రియల నిషేధిస్తూ నో వర్క్, నో పే అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక సందేహమేమిటంటే, ఇప్పటివరకూ పనిచేయక పోతే కూడా జీతాలిస్తున్నారా అని. పని చేయక పోటే ఎక్కడా జీతాలు ఉండవ్. అయితే సదరు ఉద్యోగి పనిచేయలేదని నిర్ధారించవలసి ఉంటుంది. దానికి కొంత ప్రక్రియ ఉంటుంది.  పని చేయకుండా వేతనం తీసుకోవాలని ఎవరూ అనుకోరు. అనుకున్నా అది ఇప్పటికే ఉన్న నిబంధనల వాళ్ళ సాధ్యం కాదు. కాని ప్రభుత్వం పై నిరసన తెలియజేయడానికి మాత్రం ఉద్యోగులు ఇలాంటి ప్రక్రియలను ఉపయోగించడం మామూలే. ఇలాంటి జీవోలవల్ల ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం  తీసుకోవచ్చు. ఉద్యోగుల జీతాలు ఆపి వేయవచ్చు. ఇదేమని ఎవరైనా అడిగితే జీవో కాపీలు చూపిస్తారు. ఇకపై ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, జీతాలు పెంచక పోయినా నిరసనలు తెలప కూడదన్న మాట. కేవలం విఙ్ఞప్తులు మాత్రమే చేసుకోవాలి. వింటే వింటారు, లేకపోతే లేదు. నిజమే, ప్రైవేటు ఉద్యోగాల్లో సమ్మెలకు ఎక్కువ వెసులు...

మనిషి దేవుడెలా అవుతున్నాడు?

మనిషి సంఘ జీవి. రాను రాను సంఘ జీవనానికి కొన్ని నియమాలు అవసరమయ్యాయి. అవే నియమాలు సమస్యలనూ సృష్టించాయి. ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కునే వారు కొందరు, ఇతరుల సహాయం కోరే వారు కొందరు. ఇలా ఉపదేశాలు తీసుకోవడం మొదలైంది. మనుషులలో కొందరు తెలివైన వారు ఉంటారు. వీరు తమ విజ్ఞానంతోనో, అనుభవంతోనో, మాటకారితనంతోనో ఇతరులను ప్రభావితం చేయ గలరు. అలాంటి వారు ఇతరులకి ఉపదేశాలివ్వడం మొదలు పెట్టారు. ఇలాంటి గురువులు మనకు పురాణాల్లో కొల్లలుగా కనబడతారు. మన పురాణాల్లో మహా మహిమాన్వితులు, గొప్పవారైన గురువులు లేదా ఋషుల గురించి చర్చించడం జరిగింది. చాలా సార్లు వారు దేవతలనే శపించగల శక్తివంతులుగా చిత్రింప బడ్డారు. కాని ఎక్కడా వారే దేవతలని చెప్పబడలేదు. వారు అలా ప్రకటించుకోలేదు కూడా. కానీ ఈరోజుల్లో వీధికొక బాబా నేనే భగవంతున్నని ప్రకటించుకోవడం లేదా తన శిష్య బృందంతో అన్యాపదేశంగా అనిపించుకోవడం సర్వ సామాన్యంగా మారి, మనకందరికీ దాదాపుగా అలవాటై పోయింది. ఒకప్పటి సప్తర్షులు, వారి శిష్య ప్రశిష్యులు కూడా భగవస్వరూపులు కాలేనప్పుడు, మరి ఈనాటి వీధి బాబాలు ఎలా ప్రత్యక్ష దైవాలు కాగలుగు తున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం. ఆలోచిస్తే...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...