Skip to main content

దోపిడీ స్వభావం

మనిషి నాగరికత నేర్చుకుంటున్న కాలం నించీ అనివార్యంగా సాగుతున్న కార్యక్రమం దోపిడీ. కాలానుగుణంగా దోపిడీ స్వభావం మారింది కాని దోపిడీ అలాగే ఉంది.

అసలు దోపిడీ అంటే ఏమిటి? ఒకడి కష్టార్జితాన్ని ఇంకోడు కొల్లగొట్టడం. ఇక్కడ ఇంకో ప్రశ్న ఉదయిస్తుంది, కష్టార్జితం కాకపొతే కొల్లగొట్ట వచ్చునా, అని. ఇవన్నీ నిర్ణయించడానికి, లెక్కగట్టడానికి కారల్ మార్క్స్ ఒక పెద్ద పుస్తకమే రాశాడు. ఇప్పుడు ఆవివరాలలోకి పోవడం నా ఉద్దేశం కాదు.

ఆసలు ఈ దోపిడీ ఎలా పుట్టింది అని ఆలోచిస్తే, ఆదిమ సమాజంలోనే దీనికి బీజాలు పడి ఉంటాయి అని చెప్పక తప్పదు. మనిషి జంతువులా జీవించిన కాలంలో దోపిడీ అంతగా ఉండే అవకాశం లేదు. అయితే గియితే కుటుంబంలోనే బలవంతుడు బలహీనుడు నోటి దగ్గరి కూడు లాక్కునివుంటాడు. అది కూడా దోపిడీయే! కాని వ్యవస్థీకృతం కాదు.

నాగరికత పెరుగుతున్న కొద్దీ జనం జానపదాలుగా (గ్రామాలు) గుమికూడడం మొదలు పెట్టారు. వ్యవసాయం చేసి కొంత అదనపు ధాన్యమో, పనిముట్లో కూడబెట్టుకోనే అవకాశం కలిగింది. ఇలా మొదలైంది ప్రైవేటు ఆస్తి. అయితే వ్యవస్థ పై నియంత్రణ లేక పోవడం వలన కొంత మంది బలవంతులు సహజంగానే బలహీనులను బెదిరించి ఇలా కూడబెట్టిన ఆస్తులను కొల్లగొడుతూ ఉంటారు. మొదటిసారిగా ఇలా మొదలైవుంటుంది దోపిడీ.

ఇలాంటి దోపిడీని ఎదిరించడానికి ప్రజల్లోంచే నాయకత్వం తప్పకుండా బయట పడుతుంది. ప్రభావశీలురైన మనుషులు మిగతా ప్రజలకు నాయకత్వం వహించి దోపిడీని ఎదిరించడం సహజ సిద్ధంగా జరిగే పరిణామం. మన పురాణాలలో కనబడే పాత్రలు ఇలాంటి నాయకత్వానికి ప్రతీకలుగా భావించవచ్చు. దోపిడీని ఎదిరించడంలో సఫలీకృతుడైన నాయకుడు అక్కడితో ఆగడు. అతడు నేతగా, చివరికి రాజుగా రూపాంతరం చెందుతాడు.

ఆ విధంగా వచ్చిందే రాజరిక వ్యవస్థ. ఈ విధంగా రాజరిక వ్యవస్థ కూడా దోపిడీని ఎదిరించడానికి పుట్టిందే కాని, దోపిడీ కోసం పుట్టింది కాదు.

చరిత్రని గమనిస్తే అది నిత్యం మార్పు చెందుతూ ఉంటుంది. అది మార్పు చెందకుండా జడంగా ఉండడం మొదలు పెడుతుందో, అప్పుడు మళ్ళీ డానికి రోగాలు పెరుగుతాయి. అలాగే రాజరిక వ్యవస్థ ముదిరిన కొద్దీ దాని రోగాలు కూడా అనివార్యంగా పెరగ సాగాయి. అలా వేళ్ళూనుకున్నదే  ఫ్యూడల్ వ్యవస్థ.

ఏ దోపిడీకి వ్యతిరేకంగా రాజరిక వ్యవస్థ మొదలైందో, ఆ దోపిడీనే వేళ సంవత్సరాల పాటు నిరాటంకంగా కొనసాగించింది రాజరిక/ఫ్యూడల్ వ్యవస్థ. దోపిడీ కొనసాగిన కొద్దీ, అనివార్యంగా దోచుకోబడే వారి సంఖ్య పెరగడం, దోచుకునే వారి సంఖ్య తగ్గడం జరుగురుంది. దోపిడీకి గురయ్యే వారు సంఘటితం కావడం కూడా తప్పనిసరిగా జరిగే పరిణామం.

విప్లవాలు వచ్చాయి, రాజ్యాలు కూలాయి. 'ప్రజాస్వామ్యం' అనే ఆలోచనలకు బీజాలు పడ్డాయి.

సరిగ్గా ఈదశలో రెండురకాల ఆలోచనా విధానానికి అంకురార్పణ జరిగింది. పెట్టుబడిదారీ వ్యవస్థ, కమ్యూనిస్టు వ్యవస్థ. ఇక్కడ గమనించాల్సింది ఈ రెండు రకాల వ్యవస్థలు కూడా దోపిడీ వ్యతిరేక ఉద్యమాలు లేదా విప్లవాల మూలంగానే ఏర్పడ్డాయి. చరిత్ర తనను తాను సవరించు కోవడంలో భాగంగానే ఈ పరిణామాలు సంభవించాయి.

అయితే కాలానుగుణంగా ఈ రెండురకాల వ్యవస్థలలోనూ లోపాలు బయటపడ్డాయి.

పెట్టుబడిదారీ వ్యవస్థలో డబ్బు అధికంగా సంపాదించిన వాడు శక్తివంతుడిగా మారాడు. తద్వారా ప్రభుత్వాలను ప్రభావితం చేసి మరింత దోపిడీకి సమకట్టాడు. సంపాదనా సమరంలో వెనుక బడ్డవాడు మరింత పేదవాడుగా మారాడు, బతుకీడ్చలేక మరణించిన సందర్భాలు కూడా కోకొల్లలు.

కమ్యూనిజంలో డబ్బురూపేణా దోపిడీ జరిగే అవకాశం లేదు. అయితే అక్కడ అధికారం ఉన్నవాడే శక్తివంతుడు. అధికార వర్గాలు నానాటికి బలపడి, సాధారణ జన జీవితాన్ని దుర్భరం చేసిన సంఘటనలు జరిగాయి. అంతేకాదు, దోపిడీ అంటే ఇతరుల కష్టార్జితాన్ని దోచుకోవడమే కాదు, తాను కష్ట పడకుండా ఇతరుల కష్టఫలితాన్ని అనుభవించడం కూడా దోపిడీయే అవుతుంది. ఈరకంగా కమ్యూనిస్టు సమాజంలో కూడా దోపిడీ స్వభావం అలాగే ఉంది.

చరిత్ర పరిశీలించినప్పుడు తెలిసేది ఏమంటే, దోపిడీస్వభావం కాలానుగుణంగా గుణాత్మకమైన  మార్పులు సంతరించుకుందే తప్ప దోపిడీ మాత్రం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది.

Comments

Popular posts from this blog

తెలుగును పునరుజ్జీవింప జేద్దాం

భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం. ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి క్లిష్టమైన సంస్కృత సమాసాలను వాడుతున్నారు. దీనివల్ల ఒక భాష నుండి వేరొక భాషకు దాసోహం చెప్పడం తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. సంస్కృతం తన సహజరూపం లోనే మన లేక హిందీగా మారి ఉత్తర భారతంలో బ్రతుకుతుంది. అలాంటి సంస్కృత పదాలను అరువుతెచ్చుకుని తెలుగులో వ్యాప్తిలోకి తీసుకు రావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అవసరం లేదు కూడా. మన భాష ప్రస్తుత పరిస్థితికి ప్రబంధ సాహిత్యం తప్ప, సాంకేతిక పరమైన సాహిత్యం మనకు లేకపొవడం కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. పైగా మన పూర్వ కవులకు సంస్కృతం పై ఉన్న ఎనలేని మోజు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణం. అర్జునుడికి వంద పేర్లు ఉంటాయి. irrigation అనే పదానికి ఒక్క తెలుగు ...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...

కడప ఎన్నికలతో రాష్ట్ర భవితం తేలనుందా?

కడప పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాలలో జరుగుతున్న ఎన్నికలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును తేల్చేవిగా కనబడుతున్నాయి. అందుకే ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్రులు సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నారు. ఒక వైపు రాజశేఖర్ రెడ్డికి పెట్టని కోట లాంటిదైన జిల్లా. పైగా జగన్ కున్న ధనబలం, అంగబలం. కాంగ్రెస్ ధనబలం, అధికారబలం. వీటి మధ్య ఎంత తీవ్రమైన పోరు జరిగినా కూడా, జగన్ కే విజయావాకాశాలు లభించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఎలక్షన్ లో ఓటమి గాని సంభవిస్తే జగన్ పార్టీకి అది సమాధిగా మారుతుంది. ప్రజారాజ్యం పార్టీలా ఇతర పార్టీల్లో కలవడం తప్ప, మళ్ళీ కుదురుకోవడం కష్టం కావచ్చు. ఆ పక్షంలో కాంగ్రెస్ జగన్ని మరింత అణగదొక్కడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి BJP లో కలవ వచ్చు. కడపలో గెలిస్తే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం 2014 వరకు తిరుగుండదు.  ఒక వేళ ఈ ఎన్నికల్లో జగన్ గనక గెలిచినట్టయితే అది రాష్ట్ర ప్రభుత్వానికే కాక, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కూడా గొడ్డలి పెట్టుగా మారుటింది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చడానికి జగన్ ఒక్క నిముషం కూడా వృధా చేయడు. కాంగ్రెస్, తెలుగుదేశాల నుండి జగన్ పార్టీకి జోరుగా వలసలు ప...