కడప పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాలలో జరుగుతున్న ఎన్నికలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును తేల్చేవిగా కనబడుతున్నాయి. అందుకే ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్రులు సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నారు. ఒక వైపు రాజశేఖర్ రెడ్డికి పెట్టని కోట లాంటిదైన జిల్లా. పైగా జగన్ కున్న ధనబలం, అంగబలం. కాంగ్రెస్ ధనబలం, అధికారబలం. వీటి మధ్య ఎంత తీవ్రమైన పోరు జరిగినా కూడా, జగన్ కే విజయావాకాశాలు లభించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఈ ఎలక్షన్ లో ఓటమి గాని సంభవిస్తే జగన్ పార్టీకి అది సమాధిగా మారుతుంది. ప్రజారాజ్యం పార్టీలా ఇతర పార్టీల్లో కలవడం తప్ప, మళ్ళీ కుదురుకోవడం కష్టం కావచ్చు. ఆ పక్షంలో కాంగ్రెస్ జగన్ని మరింత అణగదొక్కడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి BJP లో కలవ వచ్చు. కడపలో గెలిస్తే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం 2014 వరకు తిరుగుండదు.
ఒక వేళ ఈ ఎన్నికల్లో జగన్ గనక గెలిచినట్టయితే అది రాష్ట్ర ప్రభుత్వానికే కాక, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కూడా గొడ్డలి పెట్టుగా మారుటింది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చడానికి జగన్ ఒక్క నిముషం కూడా వృధా చేయడు. కాంగ్రెస్, తెలుగుదేశాల నుండి జగన్ పార్టీకి జోరుగా వలసలు పెరిగుతాయి. దాంతో జగన్ బలం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది.
అయితే తెలంగాణాలో మాత్రం జగన్ కి పెద్దగా అనుకూలించే అవకాశం లేదు. తెలంగాణాలో అనుకూలించాలంటే, జగన్ తెలంగాణాపై స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంటుంది. కాని ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ అలాంటి ప్రకటన చేయడానికి సాహసించక పోవచ్చు. ఎందుకంటే, ఆయన తెలంగాణాకి మద్దతు పలికితే సీమాంధ్రలో తెలుగుదేశం గాని, కాంగ్రెస్ గాని పుంజుకోవచ్చు. పైగా తెలంగాణలో TRS బలంగా ఉండడం వలన ఆయనకీ తెలంగాణలో పెద్దగా ఒరిగేదేమీ ఉండదు.
రాష్ట్రం లో ఎన్నికలు వస్తే కాంగ్రెస్, TDP లకు సీట్లు పాతిక-ముప్పై దాటవని ORG-MARG ఇప్పటికే సర్వే చేసి చెప్పింది. జగన్ గనక కడపలో గెలిస్తే ఆ సంఖ్య మరింత కనిష్టానికి దిగజారే అవకాశం ఉంది. రాష్ట్రానికి మధ్యంతరం గనక వస్తే, జగన్ సీమాంధ్రలో, TRS తెలంగాణలో clean sweep చేసే అవకాశాలు కనబడుతున్నాయి. చంద్రబాబు నాయుడికి మరో ఐదేళ్ళ వరకూ పదవీ వియోగం తప్పక పోవచ్చు.
చంద్రశేఖరరావు తెలంగాణలో ఇప్పటికే అమలు జరుపుతున్న ఆపరేషన్ ఆకర్ష ఈ వ్యూహంతోనే జరుగుతుందని అనిపిస్తుంది. వచ్చే రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రెండు పార్టీలే భాగస్వామ్యం వహించ దానికి అన్ని అవకాశాలు కనపడుతున్నాయి. కాంగ్రెస్ ఎంత ప్రమాద నివృత్తికి ప్రయత్నించినా, అది అవినీతిలో పీకల్లోతుకి కూరుకు పోవడంతో, వచ్చే లోకసభ ఎన్నికల్లో NDA విజయం దాదాపుగా తథ్యం. ఈ పరిస్థితుల్లో 2014 లో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు జరగడానికి అన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాబట్టి కడపలో ఇప్పుడు జరుగుతున్న సంకులసమరం రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకు వస్తుందంటే అతిశయోక్తి కాబోదు.
Comments
Post a Comment
బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.