Skip to main content

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు. 

కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే.

అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా వ్యతిరేకతను తీవ్రవాదంగా మారుస్తూ విధ్వంసాలు సృష్టిస్తూనే ఉంటారు.

అమెరికాలో కనీ వినీ ఎరుగని పెను విధ్వంసం సృష్టించడానికి లాడెన్ కి కేవలం ముగ్గురు పైలట్లు సరిపోయారు. ఒక అగ్ర రాజ్యాన్ని భయకంపితం  చేయడం ఇంత సులువా అని ప్రపంచం మొత్తం ముక్కుమీద వేలు వేసుకున్నారు. కానీ దురదృష్ట వశాత్తూ ఆ సంఘటనతో అమెరికా పాఠాలేవీ నేర్చుకున్నట్టు కనిపించడం లేదు. తన విశృంఖల సామ్రాజ్యవాద, వలసవాద మానవహననాన్ని విచ్చలవిడిగా కొనసాగిస్తూనే ఉంది.

లాడెన్ పాకిస్తాన్లోనే ఉన్నాడని, పాకిస్తాన్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని ఇండియా ఎంత గోడుపెట్టినా అమెరికా చెవులకు ఆన లేదు. మనమాటలు విననట్టు నటిస్తూ పాకిస్తాన్ తో అంటకాగిన అమెరికా ఇప్పుడు ఆ దేశ రాజధానికి కూతవేటు దూరంలో లాడెన్ ని మట్టు బెట్టామని సిగ్గులేకుండా ప్రకటించు కొంటుంది. గత పదిసంవత్సరాలుగా లాడెన్ పాకిస్తాన్ ఆశ్రయంలో ఉన్న సంగతి అమెరికాకు తెలియదనుకోవాలా? దావూద్ ఇబ్రహీం వంటి తీవ్రవాద బ్రోకర్లకు ఆశ్త్రయం కల్పిస్తున్న పాకిస్తాన్ తో స్నేహం చేస్తున్న  అమెరికా తాను తీవ్ర వాదానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నానని ప్రపంచాన్ని నమ్మించ జూడడం పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగిన చందం. 

బహ్రైన్లో, బర్మాలో ప్రజా ఉద్యమాలు పట్టని అమెరికాకు లిబియా, ఈజిప్టు దేశాలలోని ప్రజాస్వామ్యాల పై ఎందుకంత ప్రేమో అక్కడి నూనె బావుల నడిగితే వివరంగా చెప్తాయి. తన అడుగులకు మడుగులొత్తే  దేశాలు మాత్రమే ప్రజాస్వామ్య దేశాలన్న కొత్త నిర్వచనాన్ని తలకెక్కించు కున్న అమెరికాకు ఆయా దేశాల్లో నడుస్తున్న ప్రజాస్వామ్య ఉద్యమాలు ఎందుకు కనబడతాయి?

దాని కళ్ళకు ఇరాన్ ప్రమోట్ చేస్తున్న తీవ్రవాదం కనబడుతుంది కానీ, ఇండియాకు పాకిస్తాన్ ప్రమోట్ చేస్తున్న తీవ్రవాదం మాత్రం కనబడదు. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలను ఇకనైనా అమెరికా వీడవలసిన అవసరం ఉంది. లేకుంటే ఒకరి తర్వాత మరొక లాడెన్ పుడుతూనే ఉంటారు, ఏదో ఒక రకంగా అమెరికాకు బుద్ధి చెప్తూనే ఉంటారు. 

తమ దేశానికి పూనిన బ్రహ్మ రాక్షసిని వదిలించ డానికి శాంతి కాముకులైన అమెరికన్ ప్రజలే పూనుకోవాలి. లేక పొతే రాక్షసులు పుడుతూనే ఉంటారు, చస్తూనే ఉంటారు.


Comments

  1. mare, aa madhya india lo religious freedom ledani tega vapoyaru vallu. vaallakee poye kalam vastundi. endukante "everythig that has a beginning..has and end"

    ReplyDelete
  2. Every weekend i used to pay a visit this web page, because i wish for enjoyment, since this this website conations actually nice funny data too.


    My blog :: http://www.web.e-kabza.pl

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

నల్ల జీవో

ప్రభుత్వం తాజాగా GO నెంబర్ 177 విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన తెలుపడానికి అనుసరించే పద్ధతులైన సమ్మె, టూల్ డౌన్, పెన్ డౌన్ తదితర ప్రక్రియల నిషేధిస్తూ నో వర్క్, నో పే అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక సందేహమేమిటంటే, ఇప్పటివరకూ పనిచేయక పోతే కూడా జీతాలిస్తున్నారా అని. పని చేయక పోటే ఎక్కడా జీతాలు ఉండవ్. అయితే సదరు ఉద్యోగి పనిచేయలేదని నిర్ధారించవలసి ఉంటుంది. దానికి కొంత ప్రక్రియ ఉంటుంది.  పని చేయకుండా వేతనం తీసుకోవాలని ఎవరూ అనుకోరు. అనుకున్నా అది ఇప్పటికే ఉన్న నిబంధనల వాళ్ళ సాధ్యం కాదు. కాని ప్రభుత్వం పై నిరసన తెలియజేయడానికి మాత్రం ఉద్యోగులు ఇలాంటి ప్రక్రియలను ఉపయోగించడం మామూలే. ఇలాంటి జీవోలవల్ల ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం  తీసుకోవచ్చు. ఉద్యోగుల జీతాలు ఆపి వేయవచ్చు. ఇదేమని ఎవరైనా అడిగితే జీవో కాపీలు చూపిస్తారు. ఇకపై ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, జీతాలు పెంచక పోయినా నిరసనలు తెలప కూడదన్న మాట. కేవలం విఙ్ఞప్తులు మాత్రమే చేసుకోవాలి. వింటే వింటారు, లేకపోతే లేదు. నిజమే, ప్రైవేటు ఉద్యోగాల్లో సమ్మెలకు ఎక్కువ వెసులు...

మనిషి దేవుడెలా అవుతున్నాడు?

మనిషి సంఘ జీవి. రాను రాను సంఘ జీవనానికి కొన్ని నియమాలు అవసరమయ్యాయి. అవే నియమాలు సమస్యలనూ సృష్టించాయి. ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కునే వారు కొందరు, ఇతరుల సహాయం కోరే వారు కొందరు. ఇలా ఉపదేశాలు తీసుకోవడం మొదలైంది. మనుషులలో కొందరు తెలివైన వారు ఉంటారు. వీరు తమ విజ్ఞానంతోనో, అనుభవంతోనో, మాటకారితనంతోనో ఇతరులను ప్రభావితం చేయ గలరు. అలాంటి వారు ఇతరులకి ఉపదేశాలివ్వడం మొదలు పెట్టారు. ఇలాంటి గురువులు మనకు పురాణాల్లో కొల్లలుగా కనబడతారు. మన పురాణాల్లో మహా మహిమాన్వితులు, గొప్పవారైన గురువులు లేదా ఋషుల గురించి చర్చించడం జరిగింది. చాలా సార్లు వారు దేవతలనే శపించగల శక్తివంతులుగా చిత్రింప బడ్డారు. కాని ఎక్కడా వారే దేవతలని చెప్పబడలేదు. వారు అలా ప్రకటించుకోలేదు కూడా. కానీ ఈరోజుల్లో వీధికొక బాబా నేనే భగవంతున్నని ప్రకటించుకోవడం లేదా తన శిష్య బృందంతో అన్యాపదేశంగా అనిపించుకోవడం సర్వ సామాన్యంగా మారి, మనకందరికీ దాదాపుగా అలవాటై పోయింది. ఒకప్పటి సప్తర్షులు, వారి శిష్య ప్రశిష్యులు కూడా భగవస్వరూపులు కాలేనప్పుడు, మరి ఈనాటి వీధి బాబాలు ఎలా ప్రత్యక్ష దైవాలు కాగలుగు తున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం. ఆలోచిస్తే...