Skip to main content

సత్యాన్వేషణ, రాగ ద్వేషాలు

'వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్, చెప్పగలవాడు పుట్టలేదురా...' అన్నాడో సినీ గేయ కవి. ఎంత నిజం!

గుడ్ అంటే ఏమిటి?
సత్యం.

సత్యం అంటే?
నిజం.

నిజం అంటే?
...

మళ్ళీ సత్యానికొద్దాం. సంస్కృతంలో 'సత్' అంటే మంచి అనే అర్థం ఉంది. అంటే మంచి చేసేదే సత్యం, నిజమూను. మళ్ళీ మొదటికోచ్చామా? ఏది మంచి? ఏది చెడు?

మంచి పని అంటే ఏమిటి? మనకు లాభం జరిగితే మంచా? నష్టం జరిగితే చెడా? మనకు నష్టం జరిగినా ఇతరులకు లాభం జరిగితే? దాన్నేమనాలి? ప్రజాస్వామ్య సిద్ధాంతం ప్రకారం ఎక్కువమందికి ఏది లాభం జరిగితే అదే మంచా? మరి తక్కువ మంది విషయమో?

ఉదాహరణకు శ్రీలంకలో తమిళులు తక్కువ శాతం ఉన్నారు. అక్కడి చట్టాలు సింహళులకు మంచి చేసేవిగా ఉన్నాయి. అది మంచేనా?

అంతెందుకు? మనం ఆఫీసులో ఎక్కువ గంటలు పనిచేస్తే ఆఫీసరుకు మంచి. ఇంట్లో ఎక్కువ గంటలు గడిపితే కుటుంబ సభ్యులకు మంచి.

ఇలా ఆలోచించుకుంటూ పోతే... మంచి, చెడుల మధ్యన ఎంత అస్పష్టత దాగి వుందో తెలుస్తుంది. ఈ మంచి, చెడుల గురించిన ఆలోచనలు మనిషి ఆలోచించడం మొదలు పెట్టినప్పటి నుంచి ఉన్నాయనిపిస్తుంది. అన్ని మతాలు, అన్ని ఇజాలు తాము చెప్పేదే మంచి అని బోధిస్తాయి. నిజానికి ఈ మతాలు, ఇజాలు అన్నీ కుడా మంచిని అన్వేషించడం తోటే మొదలయ్యాయి. సమాజంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్న ప్రతి సారి, సత్యం కోసం అన్వేషణ జరిపినవారు గొప్ప ప్రవక్తలుగా మారారు. వారి వారి కాలాలకు, అప్పుడున్న సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంలో సఫలీకృతులయ్యారు. తాము కనుగొన్న 'సత్యాలను' భావి తరాల కోసం విపులంగా క్రోడీకరించారు. తదనుగుణంగానే ఇప్పుడు సమాజం నడుస్తుంది.

విచిత్రమేమంటే సత్యాన్వేషణలో అందరి గమ్యం ఒకటే. కాని మార్గాలు వేరయ్యాయి. ఎవరికి వారు మాదే సత్యం అంటే మాదే సత్యం అని కలహించు కున్నారు. సంగ్రామాలు, మహా సంగ్రామాలు, ప్రపంచ మహా సంగ్రామాలు సహితం జరిగాయి. కేవలం మాదే సత్యం అని నిరూపించు కోవటానికి! తనకు తెలిసిన సత్యాన్నే ప్రపంచ సత్యంగా మార్చ టానికి. దీంట్లో ఎంతమంది సఫలీకృత మయ్యారో చరిత్ర చదివిన ప్రతి ఒక్కరికీ అర్థమౌతుంది.

నేను చెప్పేదే సత్యం అని ఎవరైనా అంటే అది ఎంత నిరర్థక మైన మాటో ఇప్పుడు గమనించారా? మహా మహులైన ప్రవక్తలు, జ్ఞానుల మాటాలు కుడా నిరంతర సత్యాలు కావని గ్రహించాం. అలాంటప్పుడు మన మాటలు ఎంత? మనం చెప్పే మాటల్లో ఎంత శాతం సత్యం ఉంది? అలాగే ఇతరులు చెప్పే దాంట్లో ఎంతో కొంత సత్యం ఉంటుందని ఎందుకు భావించం?

అలా భావించిన నాడు మన చర్చలు ఎంత అర్థ వంతంగా, గౌరవ పూరితంగా ఉంటాయి? అలాంటి చర్చల వల్ల మాత్రమే విజ్ఞానం పెంపొందడానికి అవకాశం ఉంది తప్ప రాగ ద్వేషాలతో కూడిన చర్చల వల్ల పెద్దగా ఉపయోగం ఉండబోదు.

Comments

  1. సత్యానికి ప్రయోజనానికి ముడిపెట్టడం అర్ధం కాకుండా ఉంది. సత్యం మంచి చెడులకు అతీతమైనదని నేను అనుకొంటున్నాను.

    యేమైనా మంచి విషయం రాసినందుకు అభినందనలు.

    ReplyDelete
  2. సీతారాంరెడ్డి గారు

    శాశ్వత మైన సత్యమేది లేదనేదే నా అభిప్రాయం. దీని గురించి నా అభిప్రాయాలు మరికొన్ని వ్యాసాల ద్వారా వివరించడానికి ప్రయత్నిస్తాను.

    వ్యాఖ్య చేసినందుకు కృతఙ్ఞతలు.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

నల్ల జీవో

ప్రభుత్వం తాజాగా GO నెంబర్ 177 విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన తెలుపడానికి అనుసరించే పద్ధతులైన సమ్మె, టూల్ డౌన్, పెన్ డౌన్ తదితర ప్రక్రియల నిషేధిస్తూ నో వర్క్, నో పే అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక సందేహమేమిటంటే, ఇప్పటివరకూ పనిచేయక పోతే కూడా జీతాలిస్తున్నారా అని. పని చేయక పోటే ఎక్కడా జీతాలు ఉండవ్. అయితే సదరు ఉద్యోగి పనిచేయలేదని నిర్ధారించవలసి ఉంటుంది. దానికి కొంత ప్రక్రియ ఉంటుంది.  పని చేయకుండా వేతనం తీసుకోవాలని ఎవరూ అనుకోరు. అనుకున్నా అది ఇప్పటికే ఉన్న నిబంధనల వాళ్ళ సాధ్యం కాదు. కాని ప్రభుత్వం పై నిరసన తెలియజేయడానికి మాత్రం ఉద్యోగులు ఇలాంటి ప్రక్రియలను ఉపయోగించడం మామూలే. ఇలాంటి జీవోలవల్ల ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం  తీసుకోవచ్చు. ఉద్యోగుల జీతాలు ఆపి వేయవచ్చు. ఇదేమని ఎవరైనా అడిగితే జీవో కాపీలు చూపిస్తారు. ఇకపై ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, జీతాలు పెంచక పోయినా నిరసనలు తెలప కూడదన్న మాట. కేవలం విఙ్ఞప్తులు మాత్రమే చేసుకోవాలి. వింటే వింటారు, లేకపోతే లేదు. నిజమే, ప్రైవేటు ఉద్యోగాల్లో సమ్మెలకు ఎక్కువ వెసులు...

మనిషి దేవుడెలా అవుతున్నాడు?

మనిషి సంఘ జీవి. రాను రాను సంఘ జీవనానికి కొన్ని నియమాలు అవసరమయ్యాయి. అవే నియమాలు సమస్యలనూ సృష్టించాయి. ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కునే వారు కొందరు, ఇతరుల సహాయం కోరే వారు కొందరు. ఇలా ఉపదేశాలు తీసుకోవడం మొదలైంది. మనుషులలో కొందరు తెలివైన వారు ఉంటారు. వీరు తమ విజ్ఞానంతోనో, అనుభవంతోనో, మాటకారితనంతోనో ఇతరులను ప్రభావితం చేయ గలరు. అలాంటి వారు ఇతరులకి ఉపదేశాలివ్వడం మొదలు పెట్టారు. ఇలాంటి గురువులు మనకు పురాణాల్లో కొల్లలుగా కనబడతారు. మన పురాణాల్లో మహా మహిమాన్వితులు, గొప్పవారైన గురువులు లేదా ఋషుల గురించి చర్చించడం జరిగింది. చాలా సార్లు వారు దేవతలనే శపించగల శక్తివంతులుగా చిత్రింప బడ్డారు. కాని ఎక్కడా వారే దేవతలని చెప్పబడలేదు. వారు అలా ప్రకటించుకోలేదు కూడా. కానీ ఈరోజుల్లో వీధికొక బాబా నేనే భగవంతున్నని ప్రకటించుకోవడం లేదా తన శిష్య బృందంతో అన్యాపదేశంగా అనిపించుకోవడం సర్వ సామాన్యంగా మారి, మనకందరికీ దాదాపుగా అలవాటై పోయింది. ఒకప్పటి సప్తర్షులు, వారి శిష్య ప్రశిష్యులు కూడా భగవస్వరూపులు కాలేనప్పుడు, మరి ఈనాటి వీధి బాబాలు ఎలా ప్రత్యక్ష దైవాలు కాగలుగు తున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం. ఆలోచిస్తే...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...