Skip to main content

రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి

ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా ఉంది. స్వతంత్ర భారత దేశంలో బహుషా కాంగ్రెస్ పార్టీకి ఇంతటి గడ్డు పరిస్థితి ఇదివరలో ఎప్పుడూ వచ్చి ఉండదు.

ఒకవైపు జగన్ వీరంగం. మరోవైపు తెలంగాణా సమస్య. మామూలుగా అయితే అవినీతి, అధిక ధరలు, పెట్రోలు ధర పెంపు లాంటివి ఆపార్టీకి దున్నపోతు మీద నీటి బొట్ల లాంటివే అయినా ఈ పరిస్థితులలో అవి కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

జగన్ మోహన్ రెడ్డి తన వైపు ఉన్న ఎమ్మెల్యేల బలాన్ని ఏకంగా దేశ రాజధానిలోనే ప్రదర్శించి, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తన దయాదాక్షిన్యాల మీద ఆధారపడి ఉందని ప్రకటించాడు. అయినా ఏమీ చేయలేని పరిస్థితి.  

జగన్ వర్గం వారిపై కఠిన చర్యలు తీసుకుందామంటే వారు రాజీనామా చేసేలా ఉన్నారు. తరువాత జరిగే ఉప ఎన్నికలలో ఎలాగూ ఆ స్థానాల్లో కాంగ్రెస్ గెలవలేదు. కాబట్టి ప్రభుత్వం పడిపోవడం ఖాయం. పోనీ ఉపేక్షిద్దామా అంటే ప్రభుత్వం ప్రతిష్ఠ నానాటికి తీసికట్టు, నాగంభొట్లు అన్న మాదిరిగా తయారౌతుంది.

ఇక తెలంగాణా విషయానికి వస్తే గత ఆరేళ్ళుగా కాంగ్రేస్ ఆడుతున్న దొంగనాటకానికి చరమాంకం దగ్గర పడింది. అతి తొందరలో ఏదో ఒకటి తేల్చి చెప్పవలసిన పరిస్థితి. ఈవిషయంలో ఎటువేపు వెళ్ళినా ఇంకోవర్గం వారి వ్యతిరేకతను చవిచూడక తప్పదు! ఒక పాలసీ అంటూ లేకుండా తక్షణావసరాలను దృష్టిలో ఉంచుకొని నోటికి ఏదొస్తే అది మాట్లాడడం ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందో ఆ పార్టీ ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది. కానీ ఈ పార్టీకి అటువంటి అలవాట్లు లేవన్నది చారిత్రక సత్యం.  

ధరల పెరుగుదల, రైతుల ఆత్మహత్యలు, పెట్రోలు ధరలు, నీటి సమస్యలు మొదలైన అంశాలతో చంద్రబాబు నాయుడు పుంజుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఎన్నికలలో గెలవలేలనే శంకే లేకపోయి ఉండకపోతే ఆయన ఈపాటికే అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఉండేవాడు. తెలుగుదేశం పార్టీ బలహీనతలు రాష్ట్రంలో కాంగ్రెస్ కి ఒక వరంలా మారాయని చెప్పవచ్చు.

పద్ధెనిమిదిమంది ఎమ్మెల్యేలతో చక్రం తిప్పే అవకాశం ఎప్పుడు వస్తుందా అని చిరంజీవి రోజూ కాంగ్రేస్ తలుపు తట్టి వస్తున్నాడు, కాని ఎందుకో కాంగ్రేస్ వారే ఆయన్ను గడప దగ్గరే అపేస్తున్నారు. బహుశా ఈయన్ని తీసుకొని ఇంకొన్ని సమస్యలు కొనుక్కోవడం ఇష్టం లేనట్టుంది వారికి!

ఇలాంటి పరిస్థితులలో రేపు తెలంగాణా పై జరుగబోయే రెండో అఖిలపక్ష సమావేశంలో ఏదో ఒకటి తేల్చి చెప్పవలసిన పరిస్థితి ఎదురయ్యింది. వంద సంవత్సరాల చరిత్ర గలిగిన కాంగ్రెస్ పార్టీ వీటన్నిటికి ఎలాంటి సర్వరోగ నివారిణిని కనిపెడుతుందో వేచి చూడాల్సి ఉంది.

Comments

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...