Skip to main content

గ్రేటర్ రాయలసీమ, గ్రేటర్ తెలంగాణా

శ్రీకృష్ణ కమిటీ వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం తమ పార్టీ ఎంపీలతో జోరుగా మంతనాలు జరుపుతుంది. సమస్య కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా పరిష్కారమైతే చాలు, పరిష్కారం వచ్చినట్టే అనిపిస్తోంది. కానీ సీమాంధ్ర వారిని, తెలంగాణా వారిని ఒకే పరిష్కారం దిశగా ఒప్పించడం నిజంగా కత్తి మీద సామే. ఈ విషయంలో చిదంబరం గారు ఎలా నెట్టుకొస్తారో చూడాలి.

జస్టిస్ శ్రీకృష్ణ గారికి కర్ర విరక్కుండా, పాము చావకుండా నివేదికలు సమర్పిస్తారనే పేరు ఉంది. కానీ ఈ నివేదిక విషయంలో ఆయన పూర్తిగా సఫలం కాలేదనే చెప్పాలి. కమిటీ వారి వద్దకు వచ్చిన వివిధ రాజకీయ పక్షాలు చేసిన సూచనలు క్రోడీకరించారని మాత్రమే చెప్పాలి. అది తనంత తానుగా కొత్త పరిష్కార మార్గాలకు అన్వేషించినట్టుగా కనపడదు. కనీసం వివిధ ప్రజా సంఘాలు చేసిన గ్రేటర్ రాయలసీమ, ప్రత్యేక రాయలసీమ లాంటి కొన్ని ముఖ్యమైన సూచనలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ విషయమై TG వెంకటేష్ లాంటివారు నిరసన వ్యక్తం చేశారు కూడా.

ఏ పరిస్థితిలోను సీమాంధ్రతో యధాతథంగా కలిసి ఉండటానికి తెలంగాణా వారు ఒప్పుకోరని శ్రీకృష్ణ కమిటీయే చెప్పింది. అయితే తనంత తానుగా అలాంటి మార్గాలను అన్వేషించ డానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. బహుశా అది తన విధివిధానాలలో లేని అంశమని భావించ వచ్చు.

తెలంగాణా వారు సీమాంధ్రులతో కలిసి ఉండడం ఒప్పుకోనట్టే, రాయలసీమ వారు కూడా కోస్తా ఆంధ్రతో కలిసి ఉండడం ఒప్పుకోవటం లేదు. సమైక్యంగానైనా ఉంచండి, లేదా రాయలసీమ (వీలైతే గ్రేటర్ రాయలసీమ) రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని వారు చెపుతున్నారు.

కోస్తా పెట్టుబడిదారులపై తెలంగాణా వారు ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారో, వారికీ అలాంటి భయాలే ఉన్నాయి. ఇప్పటికే వారు  శ్రీబాఘ్ ఒప్పందం తుంగలో తొక్కారని ప్రతి వేదికపై కోస్తాంధ్ర వారిపై ఆరోపణలు చేస్తుంటారు. అయితే రాష్ట్రం సమైక్యంగా ఉన్నంత వరకు ఈ లుకలుకలు కనపడవు. విడిపోయే పరిస్థితి వచ్చినపుడు మాత్రం ఇవన్నీ తప్పక బయటికి వస్తాయి. అయితే ఇవి తెలంగాణా/ఆంధ్ర వంటి జటిలమైన సమస్యలు కాక పోయినా వీటిని పూర్తిగా త్రోసివేయలేం.

ఇటువంటి పరిస్థితిలో కోస్తాని రెండు ముక్కలు చేసి, రాయలసీమకు తెలంగాణాకు ఒక్కోటి కలిపివేసి రెండురాష్ట్రాలు గా చేసే ఆలోచన చేసిఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. తెలంగాణా రాష్ట్రంలో కోస్తా వారిపై తెలంగాణా వారిదే మెజారిటీ అవుతుంది కాబట్టి తెలంగాణా వారు ఈ ప్రతిపాదనకి ఒప్పుకునే అవకాశం ఉంది. పైగా తెలంగాణాకి ఓడ రేవుల సమస్య కూడా తీరుతుంది. హైదరాబాదుపై , నదీజలాలపై కోస్తావారికున్న భావోద్వేగాల దృష్ట్యా కోస్తా వారు కూడా ఈ ప్రతిపాదనకు ఒప్పుకునే అవకాశం ఉంది. రాయలసీమ వారు మొదటి నుండి గ్రేటర్ రాయలసీమ కావాలంటున్నారు కాబట్టి వారు కూడా సంతోషించే అవకాశం ఉంది.

నిజానికి ఇలాంటి ప్రతిపాదనలు శ్రీకృష్ణ కమిటీకి కూడా ప్రజల వద్దనుండి వచ్చాయి. వారు చేసిన ఆరు ప్రతిపాదనలకి తోడుగా ఏడోదిగా దీన్నికూడా చేర్చి ఉంటే చర్చకు కొంత అవకాశం ఉండేది. అలాగే కేంద్రప్రభుత్వం కూడా అన్ని వర్గాలతో ఈ ప్రతిపాదనని అంగీకరింప చేసేందుకు ప్రయత్నించేదేమో. ఏదేమైనా ఇప్పుడు మాత్రం ఇలాంటి ప్రతిపాదనకి తెర పడినట్టే. 
  

Comments

Popular posts from this blog

తెలుగును పునరుజ్జీవింప జేద్దాం

భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం. ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి క్లిష్టమైన సంస్కృత సమాసాలను వాడుతున్నారు. దీనివల్ల ఒక భాష నుండి వేరొక భాషకు దాసోహం చెప్పడం తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. సంస్కృతం తన సహజరూపం లోనే మన లేక హిందీగా మారి ఉత్తర భారతంలో బ్రతుకుతుంది. అలాంటి సంస్కృత పదాలను అరువుతెచ్చుకుని తెలుగులో వ్యాప్తిలోకి తీసుకు రావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అవసరం లేదు కూడా. మన భాష ప్రస్తుత పరిస్థితికి ప్రబంధ సాహిత్యం తప్ప, సాంకేతిక పరమైన సాహిత్యం మనకు లేకపొవడం కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. పైగా మన పూర్వ కవులకు సంస్కృతం పై ఉన్న ఎనలేని మోజు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణం. అర్జునుడికి వంద పేర్లు ఉంటాయి. irrigation అనే పదానికి ఒక్క తెలుగు ...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...

కడప ఎన్నికలతో రాష్ట్ర భవితం తేలనుందా?

కడప పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాలలో జరుగుతున్న ఎన్నికలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును తేల్చేవిగా కనబడుతున్నాయి. అందుకే ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్రులు సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నారు. ఒక వైపు రాజశేఖర్ రెడ్డికి పెట్టని కోట లాంటిదైన జిల్లా. పైగా జగన్ కున్న ధనబలం, అంగబలం. కాంగ్రెస్ ధనబలం, అధికారబలం. వీటి మధ్య ఎంత తీవ్రమైన పోరు జరిగినా కూడా, జగన్ కే విజయావాకాశాలు లభించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఎలక్షన్ లో ఓటమి గాని సంభవిస్తే జగన్ పార్టీకి అది సమాధిగా మారుతుంది. ప్రజారాజ్యం పార్టీలా ఇతర పార్టీల్లో కలవడం తప్ప, మళ్ళీ కుదురుకోవడం కష్టం కావచ్చు. ఆ పక్షంలో కాంగ్రెస్ జగన్ని మరింత అణగదొక్కడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి BJP లో కలవ వచ్చు. కడపలో గెలిస్తే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం 2014 వరకు తిరుగుండదు.  ఒక వేళ ఈ ఎన్నికల్లో జగన్ గనక గెలిచినట్టయితే అది రాష్ట్ర ప్రభుత్వానికే కాక, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కూడా గొడ్డలి పెట్టుగా మారుటింది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చడానికి జగన్ ఒక్క నిముషం కూడా వృధా చేయడు. కాంగ్రెస్, తెలుగుదేశాల నుండి జగన్ పార్టీకి జోరుగా వలసలు ప...