Skip to main content

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు.

అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు.

నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న రాజకీయ శూన్యాన్ని పూడ్చగలిగి ఉండే వారేమో.

2009 ఎన్నికలలో పరిస్థితి వేరుగా ఉంది. అప్పటికే రాజశేఖర్ రెడ్డి తన ప్రభుత్వంలో రకరకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఇంకోవైపు ప్రభుత్వ అవినీతిని ఎండగడుతూ, గతంలో తాను చేసిన అభివృద్ధి పనులను ఉటంకిస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా బలం పుంజుకున్నారు. ఈ పరిస్థితులలో వచ్చిన చిరంజీవి వారి వారి వోటు బ్యాంకులను చీల్చడం తప్ప పెద్దగా సాధించ గలిగింది ఏమీ లేదు.

రాజకీయ నాయకుడనే వాడికి ఒక సిద్ధాంతం ఉండాలి. తన సిద్ధాంతాన్ని ప్రజలకు బలంగా చెప్పగలిగి ఉండాలి. కానీ చిరంజీవి విషయంలో ఇవేవీ కనపడవు. మొదట మిత్రా తో కలిసి ప్రజారాజ్యం స్థాపించి నప్పుడు మార్క్సిస్టు వాసన కనిపించింది. అప్పుడు అందరూ మార్క్సిస్టు భావాలు కలిగిన పార్టీ అని భావించారు. తన మామ అల్లురామలింగయ్య మార్క్సిస్టు భావాలు కలిగి ఉండడం కూడా కొంత కారణం. కమ్యూనిస్టులు చిరంజీవి వర్గాలతో చర్చలు జరపడం కూడా కనిపించింది.

తర్వాత కత్తి పద్మారావు లాంటి వారు ప్రవేశించడంతో ఆ పార్టీ సామాజిక న్యాయం వాసనలు కొట్టడం ప్రారంభించింది. ఆ తర్వాత దేవేందర్ గౌడ్ పార్టీ విలీనం చెందడంతో అది 'సామాజిక తెలంగాణా' గా మారింది. డిసెంబరు 10 2009 తర్వాత అది 'జై సమైఖ్యాంధ్ర' గా మారింది. చివరికి నిన్న సోనియా గాంధీని కలిసిన తర్వాత అది 'అమ్మ మాట శిరోధార్యం' క్రింద మారింది. కాకలు తీరిన నేతలే తమ దిశను మార్చుకోవడానికి పదిసార్లు ఆలోచిస్తారు, ప్రజలు గమనిస్తారేమోనని. అలాంటిది క్రొత్తగా రాజకీయాలలోకి వచ్చిన చిరంజీవి ఇన్నిరకాలుగా సిద్ధాంతాలలో మార్పు చేర్పులు చేయడం ప్రజలు గమనిస్తూనే ఉంటారు.

వాస్తవానికి చిరంజీవికి తన పార్టీని కాంగ్రేసులో విలీనం చేయడం తప్ప వేరే మార్గం లేదు. ఇప్పటికే తెలంగాణా లో ప్రాభవం కోల్పోయారు. ఇద్దరు తెలంగాణా ఎమ్మెల్యేలు అంటీ  ముత్తనట్టుగా ఉన్నారు. ఇంకొందరు జగన్ వెంట వెళ్ళే పనిలో ఉన్నారు. ఈ పరిస్థితులలో ఇంకా మూడు సంవత్సరాలు అధికారంలో పాలు పంచుకోకుండా పార్టీని నడపడం దాదాపు అసాధ్యం. మూడు సంవత్సరాల తర్వాత కూడా తన పార్టీ ద్వారా CM పదవి సాధించే మార్గం కానరావడం లేదు. ముందు ముందు పదవులు వచ్చినా, రాకపోయినా, పార్టీని నడపాల్సిన బృహత్తర బాధ్యత నుండి విముక్తి లభిస్తుంది.

కాంగ్రేసు పార్టీ వారికి మాత్రం తక్షణ ప్రయోజనాలు సిద్ధించడం ఇప్పటికే కనపడుతుంది. కాంగ్రెస్ బాలహీన పడి ఉప ఎన్నికలు వస్తాయేమోనని జగన్ వెంట ఉన్నవారు తాజా పరిణామాలతో ఒక్కక్కరే మాయం కావడం మొదలు పెట్టారు. ఈ లెక్క కాంగ్రెస్ వ్యూహం ఫలించి నట్టే. తర్వాత్తర్వాత కాంగ్రెస్ వారు కూరలో కరివేపాకులా చిరంజీవిని పక్కకు పెడతారా, పెద్దపీట వేసి కూర్చోబెడతారా అన్నది వేచి చూడాల్సిందే.

Comments

  1. నాకు తెలిసి ప్రజారాజ్యం పార్టీని సిద్ధాంతాల పునాదుల మీద స్థాపించలేదు. సినిమా గ్లామర్ పునాదుల మీద స్థాపించిన పార్టీ అది. సిద్ధాంతాల పునాదుల మీద స్థాపించబడిన మార్క్సిస్ట్, మావోయిస్ట్ పార్టీలలో అంతర్గత విభేదాల వల్ల చీలికలు వచ్చినా సిద్ధాంతాల మీద నమ్మకంతో వాటిలో పని చేసేవాళ్లు ఉంటారు. గురు గోల్వాల్కర్ సిద్ధాంతాలని నమ్మే RSSలోనైనా సరే చీలిక వచ్చినా అందులో సభ్యులు కొనసాగుతారు. కానీ ఇతర పార్టీలలో అలా కాదు. కేవలం పదవుల కోసం పార్టీలో చేరుతారు. పదవి రాకపోతే పార్టీ నుంచి వెళ్లిపోతారు. ప్రజారాజ్యం పార్టీలో అలాగే జరిగింది.

    ReplyDelete
  2. ప్రవీణ్ శర్మ గారు,

    లోపల ఉన్నది అధికార సిధ్ధాంతమే అయినా, పైకి మాత్రం సిధ్ధాంతాలు చెప్పారుగా! వారు అధికారమే మా సిధ్ధాంతం అని చెప్పి వస్తే గొడవే లేదు.

    ధన్యవాదాలు.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...