Skip to main content

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు.

అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు.

నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న రాజకీయ శూన్యాన్ని పూడ్చగలిగి ఉండే వారేమో.

2009 ఎన్నికలలో పరిస్థితి వేరుగా ఉంది. అప్పటికే రాజశేఖర్ రెడ్డి తన ప్రభుత్వంలో రకరకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఇంకోవైపు ప్రభుత్వ అవినీతిని ఎండగడుతూ, గతంలో తాను చేసిన అభివృద్ధి పనులను ఉటంకిస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా బలం పుంజుకున్నారు. ఈ పరిస్థితులలో వచ్చిన చిరంజీవి వారి వారి వోటు బ్యాంకులను చీల్చడం తప్ప పెద్దగా సాధించ గలిగింది ఏమీ లేదు.

రాజకీయ నాయకుడనే వాడికి ఒక సిద్ధాంతం ఉండాలి. తన సిద్ధాంతాన్ని ప్రజలకు బలంగా చెప్పగలిగి ఉండాలి. కానీ చిరంజీవి విషయంలో ఇవేవీ కనపడవు. మొదట మిత్రా తో కలిసి ప్రజారాజ్యం స్థాపించి నప్పుడు మార్క్సిస్టు వాసన కనిపించింది. అప్పుడు అందరూ మార్క్సిస్టు భావాలు కలిగిన పార్టీ అని భావించారు. తన మామ అల్లురామలింగయ్య మార్క్సిస్టు భావాలు కలిగి ఉండడం కూడా కొంత కారణం. కమ్యూనిస్టులు చిరంజీవి వర్గాలతో చర్చలు జరపడం కూడా కనిపించింది.

తర్వాత కత్తి పద్మారావు లాంటి వారు ప్రవేశించడంతో ఆ పార్టీ సామాజిక న్యాయం వాసనలు కొట్టడం ప్రారంభించింది. ఆ తర్వాత దేవేందర్ గౌడ్ పార్టీ విలీనం చెందడంతో అది 'సామాజిక తెలంగాణా' గా మారింది. డిసెంబరు 10 2009 తర్వాత అది 'జై సమైఖ్యాంధ్ర' గా మారింది. చివరికి నిన్న సోనియా గాంధీని కలిసిన తర్వాత అది 'అమ్మ మాట శిరోధార్యం' క్రింద మారింది. కాకలు తీరిన నేతలే తమ దిశను మార్చుకోవడానికి పదిసార్లు ఆలోచిస్తారు, ప్రజలు గమనిస్తారేమోనని. అలాంటిది క్రొత్తగా రాజకీయాలలోకి వచ్చిన చిరంజీవి ఇన్నిరకాలుగా సిద్ధాంతాలలో మార్పు చేర్పులు చేయడం ప్రజలు గమనిస్తూనే ఉంటారు.

వాస్తవానికి చిరంజీవికి తన పార్టీని కాంగ్రేసులో విలీనం చేయడం తప్ప వేరే మార్గం లేదు. ఇప్పటికే తెలంగాణా లో ప్రాభవం కోల్పోయారు. ఇద్దరు తెలంగాణా ఎమ్మెల్యేలు అంటీ  ముత్తనట్టుగా ఉన్నారు. ఇంకొందరు జగన్ వెంట వెళ్ళే పనిలో ఉన్నారు. ఈ పరిస్థితులలో ఇంకా మూడు సంవత్సరాలు అధికారంలో పాలు పంచుకోకుండా పార్టీని నడపడం దాదాపు అసాధ్యం. మూడు సంవత్సరాల తర్వాత కూడా తన పార్టీ ద్వారా CM పదవి సాధించే మార్గం కానరావడం లేదు. ముందు ముందు పదవులు వచ్చినా, రాకపోయినా, పార్టీని నడపాల్సిన బృహత్తర బాధ్యత నుండి విముక్తి లభిస్తుంది.

కాంగ్రేసు పార్టీ వారికి మాత్రం తక్షణ ప్రయోజనాలు సిద్ధించడం ఇప్పటికే కనపడుతుంది. కాంగ్రెస్ బాలహీన పడి ఉప ఎన్నికలు వస్తాయేమోనని జగన్ వెంట ఉన్నవారు తాజా పరిణామాలతో ఒక్కక్కరే మాయం కావడం మొదలు పెట్టారు. ఈ లెక్క కాంగ్రెస్ వ్యూహం ఫలించి నట్టే. తర్వాత్తర్వాత కాంగ్రెస్ వారు కూరలో కరివేపాకులా చిరంజీవిని పక్కకు పెడతారా, పెద్దపీట వేసి కూర్చోబెడతారా అన్నది వేచి చూడాల్సిందే.

Comments

  1. నాకు తెలిసి ప్రజారాజ్యం పార్టీని సిద్ధాంతాల పునాదుల మీద స్థాపించలేదు. సినిమా గ్లామర్ పునాదుల మీద స్థాపించిన పార్టీ అది. సిద్ధాంతాల పునాదుల మీద స్థాపించబడిన మార్క్సిస్ట్, మావోయిస్ట్ పార్టీలలో అంతర్గత విభేదాల వల్ల చీలికలు వచ్చినా సిద్ధాంతాల మీద నమ్మకంతో వాటిలో పని చేసేవాళ్లు ఉంటారు. గురు గోల్వాల్కర్ సిద్ధాంతాలని నమ్మే RSSలోనైనా సరే చీలిక వచ్చినా అందులో సభ్యులు కొనసాగుతారు. కానీ ఇతర పార్టీలలో అలా కాదు. కేవలం పదవుల కోసం పార్టీలో చేరుతారు. పదవి రాకపోతే పార్టీ నుంచి వెళ్లిపోతారు. ప్రజారాజ్యం పార్టీలో అలాగే జరిగింది.

    ReplyDelete
  2. ప్రవీణ్ శర్మ గారు,

    లోపల ఉన్నది అధికార సిధ్ధాంతమే అయినా, పైకి మాత్రం సిధ్ధాంతాలు చెప్పారుగా! వారు అధికారమే మా సిధ్ధాంతం అని చెప్పి వస్తే గొడవే లేదు.

    ధన్యవాదాలు.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

నల్ల జీవో

ప్రభుత్వం తాజాగా GO నెంబర్ 177 విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన తెలుపడానికి అనుసరించే పద్ధతులైన సమ్మె, టూల్ డౌన్, పెన్ డౌన్ తదితర ప్రక్రియల నిషేధిస్తూ నో వర్క్, నో పే అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక సందేహమేమిటంటే, ఇప్పటివరకూ పనిచేయక పోతే కూడా జీతాలిస్తున్నారా అని. పని చేయక పోటే ఎక్కడా జీతాలు ఉండవ్. అయితే సదరు ఉద్యోగి పనిచేయలేదని నిర్ధారించవలసి ఉంటుంది. దానికి కొంత ప్రక్రియ ఉంటుంది.  పని చేయకుండా వేతనం తీసుకోవాలని ఎవరూ అనుకోరు. అనుకున్నా అది ఇప్పటికే ఉన్న నిబంధనల వాళ్ళ సాధ్యం కాదు. కాని ప్రభుత్వం పై నిరసన తెలియజేయడానికి మాత్రం ఉద్యోగులు ఇలాంటి ప్రక్రియలను ఉపయోగించడం మామూలే. ఇలాంటి జీవోలవల్ల ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం  తీసుకోవచ్చు. ఉద్యోగుల జీతాలు ఆపి వేయవచ్చు. ఇదేమని ఎవరైనా అడిగితే జీవో కాపీలు చూపిస్తారు. ఇకపై ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, జీతాలు పెంచక పోయినా నిరసనలు తెలప కూడదన్న మాట. కేవలం విఙ్ఞప్తులు మాత్రమే చేసుకోవాలి. వింటే వింటారు, లేకపోతే లేదు. నిజమే, ప్రైవేటు ఉద్యోగాల్లో సమ్మెలకు ఎక్కువ వెసులు...

మనిషి దేవుడెలా అవుతున్నాడు?

మనిషి సంఘ జీవి. రాను రాను సంఘ జీవనానికి కొన్ని నియమాలు అవసరమయ్యాయి. అవే నియమాలు సమస్యలనూ సృష్టించాయి. ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కునే వారు కొందరు, ఇతరుల సహాయం కోరే వారు కొందరు. ఇలా ఉపదేశాలు తీసుకోవడం మొదలైంది. మనుషులలో కొందరు తెలివైన వారు ఉంటారు. వీరు తమ విజ్ఞానంతోనో, అనుభవంతోనో, మాటకారితనంతోనో ఇతరులను ప్రభావితం చేయ గలరు. అలాంటి వారు ఇతరులకి ఉపదేశాలివ్వడం మొదలు పెట్టారు. ఇలాంటి గురువులు మనకు పురాణాల్లో కొల్లలుగా కనబడతారు. మన పురాణాల్లో మహా మహిమాన్వితులు, గొప్పవారైన గురువులు లేదా ఋషుల గురించి చర్చించడం జరిగింది. చాలా సార్లు వారు దేవతలనే శపించగల శక్తివంతులుగా చిత్రింప బడ్డారు. కాని ఎక్కడా వారే దేవతలని చెప్పబడలేదు. వారు అలా ప్రకటించుకోలేదు కూడా. కానీ ఈరోజుల్లో వీధికొక బాబా నేనే భగవంతున్నని ప్రకటించుకోవడం లేదా తన శిష్య బృందంతో అన్యాపదేశంగా అనిపించుకోవడం సర్వ సామాన్యంగా మారి, మనకందరికీ దాదాపుగా అలవాటై పోయింది. ఒకప్పటి సప్తర్షులు, వారి శిష్య ప్రశిష్యులు కూడా భగవస్వరూపులు కాలేనప్పుడు, మరి ఈనాటి వీధి బాబాలు ఎలా ప్రత్యక్ష దైవాలు కాగలుగు తున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం. ఆలోచిస్తే...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...