Skip to main content

అశ్వత్థామ, కుంజర న్యాయం

ధర్మరాజు మనకు ఒక గొప్ప న్యాయాన్ని అందించి వెళ్ళాడు. అదే అశ్వత్థామ, కుంజర న్యాయం. కురుక్షేత్ర సంగ్రామంలో అప్రతిహతంగా ముందుకు వెళ్ళుతున్న ద్రోణుడు, తన కుమారుడైన అశ్వత్థామ మరణిస్తే కానీ క్రుంగిపోయి ఓటమి చెందడని భావించిన ధర్మరాజు ఇలా అరుస్తాడు.

'అశ్వత్థామ హతః'

కాని ఆయన ధర్మాత్ముడని పేరు. అబద్ధం చెప్పకూడదు. కాబట్టి వ్రతానికి భంగం కలగకుండా 'కుంజరః' అని మెల్లిగా అంటాడు. అప్పుడే అశ్వత్థామ అనే పేరుగల ఏనుగు మరణించడం కొసమెరుపు. ఆ విధంగా పుత్రుని మరణ వార్త తప్పుగా వినడం వలన అశక్తుడు గా మారిన ద్రోణున్ని పాండవవర్గం వారు సులభంగా చంపివేశారన్నది మిగతా కథ.

ఇలా ధర్మరాజు చేత కనిపెట్టబడిన ఈ న్యాయాన్ని ఈనాడు మీడియా గొప్పగా ఉపయోగిస్తుంది. ఎలాగంటే, తమకు అనుకూలంగా ఉండే విషయం ఎంత చిన్నదైనా బాకా ఊది, బానరు కట్టి మరీ చెప్పడం. అలాగే తమకు ప్రతికూలంగా ఉండే విషయం ఎంత ముఖ్యమైనదైనా చెప్పీ చెప్పనట్టు వెనక పేజీలో చిన్నగా వేయడం. తద్వారా తమ వ్యతిరేకులను పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ తర్వాత అంతం చేయడం. శ్రీకృష్ణ కమిటీ ఎనిమిదో అధ్యాయంలో పేర్కొన్న మీడియా మేనేజిమెంటు ఇలాంటిదే అని భావించ వచ్చు.

ఇక పోతే ఒక మహానాయకుడి పేరు పెట్టుకొని, తన ప్రసంగాలలో గొప్ప గొప్ప మేధావుల వ్యాఖ్యలను చేరుస్తూ మోతాదుకు మించిన ఉదాత్తతను ప్రదర్శించే జయప్రకాష్ నారాయణ గారు మరో మెట్టు పైకి ఎదిగారు.

ఈయనకి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న తెరాస ఎమ్మెల్యేల తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా కనిపించింది. ఆఘమేఘాల మీద మీడియా పాయింటుకి వచ్చి తన ఆవేదనను అత్యంత ఉద్వేగాన్ని రంగరించి మరీ వ్యక్తపరిచారు. కానీ తెలంగాణా ఎమ్మెల్యేలు బహిష్కరించిన సీమాంధ్ర అసెంబ్లీలో తెలుగుదేశం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముష్టి యుద్ధానికి దిగడంపై మాత్రం చాకచక్యంగా ముఖం చాటేశారు. ఇది రాసేవరకు ఆయన స్పందన పూజ్యం. ఇక ముందు స్పందించినా అది తూతూ మంత్రంగా ఉంటుందనే విషయంలో ఏమాత్రం అనుమానం అవసరం లేదు.

ఒక విద్యాగంధం లేని ఒక మామూలు డ్రైవరు శాసన సభా ప్రాంగణంలో కేవలం తనని తోసినందుకే నలభై రోజుల శిక్ష విధిస్తే, మరి ఘనత వహించిన శాసన సభ్యులు, మంత్రులు సభ లోపలే ముష్టి యుద్ధానికి దిగితే, వారికి ఎలాంటి శిక్ష విధించాలో ఆయన వివరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే 'కుంజర' అని కూడా అనలేని అధర్మరాజుగా చరిత్రలో మిగిలి పోతారు.

గత చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాల హయాంలలో విచ్చల విడిగా జరిపిన అక్రమ భూపందేరాలలో పూర్తిగా కూరుకు పోయిన రెండు పార్టీలు, పైకి శాసన సభా సంఘం వేయాలని చెపుతూనే లోలోపల అలాంటి సంఘాన్ని అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలకు పరాకాష్టే ఈరోజు అసెంబ్లీలో జరిగిన ముష్టి యుద్ధం. ఇలాంటి ప్రజానాయకుల, పార్టీల దొంగ నాటకాలను చూస్తున్న ప్రజలు ఇకనైనా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. 

Comments

Popular posts from this blog

తెలుగును పునరుజ్జీవింప జేద్దాం

భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం. ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి క్లిష్టమైన సంస్కృత సమాసాలను వాడుతున్నారు. దీనివల్ల ఒక భాష నుండి వేరొక భాషకు దాసోహం చెప్పడం తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. సంస్కృతం తన సహజరూపం లోనే మన లేక హిందీగా మారి ఉత్తర భారతంలో బ్రతుకుతుంది. అలాంటి సంస్కృత పదాలను అరువుతెచ్చుకుని తెలుగులో వ్యాప్తిలోకి తీసుకు రావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అవసరం లేదు కూడా. మన భాష ప్రస్తుత పరిస్థితికి ప్రబంధ సాహిత్యం తప్ప, సాంకేతిక పరమైన సాహిత్యం మనకు లేకపొవడం కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. పైగా మన పూర్వ కవులకు సంస్కృతం పై ఉన్న ఎనలేని మోజు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణం. అర్జునుడికి వంద పేర్లు ఉంటాయి. irrigation అనే పదానికి ఒక్క తెలుగు ...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...

కడప ఎన్నికలతో రాష్ట్ర భవితం తేలనుందా?

కడప పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాలలో జరుగుతున్న ఎన్నికలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును తేల్చేవిగా కనబడుతున్నాయి. అందుకే ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్రులు సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నారు. ఒక వైపు రాజశేఖర్ రెడ్డికి పెట్టని కోట లాంటిదైన జిల్లా. పైగా జగన్ కున్న ధనబలం, అంగబలం. కాంగ్రెస్ ధనబలం, అధికారబలం. వీటి మధ్య ఎంత తీవ్రమైన పోరు జరిగినా కూడా, జగన్ కే విజయావాకాశాలు లభించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఎలక్షన్ లో ఓటమి గాని సంభవిస్తే జగన్ పార్టీకి అది సమాధిగా మారుతుంది. ప్రజారాజ్యం పార్టీలా ఇతర పార్టీల్లో కలవడం తప్ప, మళ్ళీ కుదురుకోవడం కష్టం కావచ్చు. ఆ పక్షంలో కాంగ్రెస్ జగన్ని మరింత అణగదొక్కడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి BJP లో కలవ వచ్చు. కడపలో గెలిస్తే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం 2014 వరకు తిరుగుండదు.  ఒక వేళ ఈ ఎన్నికల్లో జగన్ గనక గెలిచినట్టయితే అది రాష్ట్ర ప్రభుత్వానికే కాక, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కూడా గొడ్డలి పెట్టుగా మారుటింది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చడానికి జగన్ ఒక్క నిముషం కూడా వృధా చేయడు. కాంగ్రెస్, తెలుగుదేశాల నుండి జగన్ పార్టీకి జోరుగా వలసలు ప...