ధర్మరాజు మనకు ఒక గొప్ప న్యాయాన్ని అందించి వెళ్ళాడు. అదే అశ్వత్థామ, కుంజర న్యాయం. కురుక్షేత్ర సంగ్రామంలో అప్రతిహతంగా ముందుకు వెళ్ళుతున్న ద్రోణుడు, తన కుమారుడైన అశ్వత్థామ మరణిస్తే కానీ క్రుంగిపోయి ఓటమి చెందడని భావించిన ధర్మరాజు ఇలా అరుస్తాడు.
'అశ్వత్థామ హతః'
కాని ఆయన ధర్మాత్ముడని పేరు. అబద్ధం చెప్పకూడదు. కాబట్టి వ్రతానికి భంగం కలగకుండా 'కుంజరః' అని మెల్లిగా అంటాడు. అప్పుడే అశ్వత్థామ అనే పేరుగల ఏనుగు మరణించడం కొసమెరుపు. ఆ విధంగా పుత్రుని మరణ వార్త తప్పుగా వినడం వలన అశక్తుడు గా మారిన ద్రోణున్ని పాండవవర్గం వారు సులభంగా చంపివేశారన్నది మిగతా కథ.
ఇలా ధర్మరాజు చేత కనిపెట్టబడిన ఈ న్యాయాన్ని ఈనాడు మీడియా గొప్పగా ఉపయోగిస్తుంది. ఎలాగంటే, తమకు అనుకూలంగా ఉండే విషయం ఎంత చిన్నదైనా బాకా ఊది, బానరు కట్టి మరీ చెప్పడం. అలాగే తమకు ప్రతికూలంగా ఉండే విషయం ఎంత ముఖ్యమైనదైనా చెప్పీ చెప్పనట్టు వెనక పేజీలో చిన్నగా వేయడం. తద్వారా తమ వ్యతిరేకులను పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ తర్వాత అంతం చేయడం. శ్రీకృష్ణ కమిటీ ఎనిమిదో అధ్యాయంలో పేర్కొన్న మీడియా మేనేజిమెంటు ఇలాంటిదే అని భావించ వచ్చు.
ఇక పోతే ఒక మహానాయకుడి పేరు పెట్టుకొని, తన ప్రసంగాలలో గొప్ప గొప్ప మేధావుల వ్యాఖ్యలను చేరుస్తూ మోతాదుకు మించిన ఉదాత్తతను ప్రదర్శించే జయప్రకాష్ నారాయణ గారు మరో మెట్టు పైకి ఎదిగారు.
ఈయనకి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న తెరాస ఎమ్మెల్యేల తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా కనిపించింది. ఆఘమేఘాల మీద మీడియా పాయింటుకి వచ్చి తన ఆవేదనను అత్యంత ఉద్వేగాన్ని రంగరించి మరీ వ్యక్తపరిచారు. కానీ తెలంగాణా ఎమ్మెల్యేలు బహిష్కరించిన సీమాంధ్ర అసెంబ్లీలో తెలుగుదేశం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముష్టి యుద్ధానికి దిగడంపై మాత్రం చాకచక్యంగా ముఖం చాటేశారు. ఇది రాసేవరకు ఆయన స్పందన పూజ్యం. ఇక ముందు స్పందించినా అది తూతూ మంత్రంగా ఉంటుందనే విషయంలో ఏమాత్రం అనుమానం అవసరం లేదు.
ఒక విద్యాగంధం లేని ఒక మామూలు డ్రైవరు శాసన సభా ప్రాంగణంలో కేవలం తనని తోసినందుకే నలభై రోజుల శిక్ష విధిస్తే, మరి ఘనత వహించిన శాసన సభ్యులు, మంత్రులు సభ లోపలే ముష్టి యుద్ధానికి దిగితే, వారికి ఎలాంటి శిక్ష విధించాలో ఆయన వివరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే 'కుంజర' అని కూడా అనలేని అధర్మరాజుగా చరిత్రలో మిగిలి పోతారు.
గత చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాల హయాంలలో విచ్చల విడిగా జరిపిన అక్రమ భూపందేరాలలో పూర్తిగా కూరుకు పోయిన రెండు పార్టీలు, పైకి శాసన సభా సంఘం వేయాలని చెపుతూనే లోలోపల అలాంటి సంఘాన్ని అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలకు పరాకాష్టే ఈరోజు అసెంబ్లీలో జరిగిన ముష్టి యుద్ధం. ఇలాంటి ప్రజానాయకుల, పార్టీల దొంగ నాటకాలను చూస్తున్న ప్రజలు ఇకనైనా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.
Comments
Post a Comment
బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.