Skip to main content

అశ్వత్థామ, కుంజర న్యాయం

ధర్మరాజు మనకు ఒక గొప్ప న్యాయాన్ని అందించి వెళ్ళాడు. అదే అశ్వత్థామ, కుంజర న్యాయం. కురుక్షేత్ర సంగ్రామంలో అప్రతిహతంగా ముందుకు వెళ్ళుతున్న ద్రోణుడు, తన కుమారుడైన అశ్వత్థామ మరణిస్తే కానీ క్రుంగిపోయి ఓటమి చెందడని భావించిన ధర్మరాజు ఇలా అరుస్తాడు.

'అశ్వత్థామ హతః'

కాని ఆయన ధర్మాత్ముడని పేరు. అబద్ధం చెప్పకూడదు. కాబట్టి వ్రతానికి భంగం కలగకుండా 'కుంజరః' అని మెల్లిగా అంటాడు. అప్పుడే అశ్వత్థామ అనే పేరుగల ఏనుగు మరణించడం కొసమెరుపు. ఆ విధంగా పుత్రుని మరణ వార్త తప్పుగా వినడం వలన అశక్తుడు గా మారిన ద్రోణున్ని పాండవవర్గం వారు సులభంగా చంపివేశారన్నది మిగతా కథ.

ఇలా ధర్మరాజు చేత కనిపెట్టబడిన ఈ న్యాయాన్ని ఈనాడు మీడియా గొప్పగా ఉపయోగిస్తుంది. ఎలాగంటే, తమకు అనుకూలంగా ఉండే విషయం ఎంత చిన్నదైనా బాకా ఊది, బానరు కట్టి మరీ చెప్పడం. అలాగే తమకు ప్రతికూలంగా ఉండే విషయం ఎంత ముఖ్యమైనదైనా చెప్పీ చెప్పనట్టు వెనక పేజీలో చిన్నగా వేయడం. తద్వారా తమ వ్యతిరేకులను పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ తర్వాత అంతం చేయడం. శ్రీకృష్ణ కమిటీ ఎనిమిదో అధ్యాయంలో పేర్కొన్న మీడియా మేనేజిమెంటు ఇలాంటిదే అని భావించ వచ్చు.

ఇక పోతే ఒక మహానాయకుడి పేరు పెట్టుకొని, తన ప్రసంగాలలో గొప్ప గొప్ప మేధావుల వ్యాఖ్యలను చేరుస్తూ మోతాదుకు మించిన ఉదాత్తతను ప్రదర్శించే జయప్రకాష్ నారాయణ గారు మరో మెట్టు పైకి ఎదిగారు.

ఈయనకి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న తెరాస ఎమ్మెల్యేల తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా కనిపించింది. ఆఘమేఘాల మీద మీడియా పాయింటుకి వచ్చి తన ఆవేదనను అత్యంత ఉద్వేగాన్ని రంగరించి మరీ వ్యక్తపరిచారు. కానీ తెలంగాణా ఎమ్మెల్యేలు బహిష్కరించిన సీమాంధ్ర అసెంబ్లీలో తెలుగుదేశం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముష్టి యుద్ధానికి దిగడంపై మాత్రం చాకచక్యంగా ముఖం చాటేశారు. ఇది రాసేవరకు ఆయన స్పందన పూజ్యం. ఇక ముందు స్పందించినా అది తూతూ మంత్రంగా ఉంటుందనే విషయంలో ఏమాత్రం అనుమానం అవసరం లేదు.

ఒక విద్యాగంధం లేని ఒక మామూలు డ్రైవరు శాసన సభా ప్రాంగణంలో కేవలం తనని తోసినందుకే నలభై రోజుల శిక్ష విధిస్తే, మరి ఘనత వహించిన శాసన సభ్యులు, మంత్రులు సభ లోపలే ముష్టి యుద్ధానికి దిగితే, వారికి ఎలాంటి శిక్ష విధించాలో ఆయన వివరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే 'కుంజర' అని కూడా అనలేని అధర్మరాజుగా చరిత్రలో మిగిలి పోతారు.

గత చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాల హయాంలలో విచ్చల విడిగా జరిపిన అక్రమ భూపందేరాలలో పూర్తిగా కూరుకు పోయిన రెండు పార్టీలు, పైకి శాసన సభా సంఘం వేయాలని చెపుతూనే లోలోపల అలాంటి సంఘాన్ని అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలకు పరాకాష్టే ఈరోజు అసెంబ్లీలో జరిగిన ముష్టి యుద్ధం. ఇలాంటి ప్రజానాయకుల, పార్టీల దొంగ నాటకాలను చూస్తున్న ప్రజలు ఇకనైనా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. 

Comments

Popular posts from this blog

నల్ల జీవో

ప్రభుత్వం తాజాగా GO నెంబర్ 177 విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన తెలుపడానికి అనుసరించే పద్ధతులైన సమ్మె, టూల్ డౌన్, పెన్ డౌన్ తదితర ప్రక్రియల నిషేధిస్తూ నో వర్క్, నో పే అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక సందేహమేమిటంటే, ఇప్పటివరకూ పనిచేయక పోతే కూడా జీతాలిస్తున్నారా అని. పని చేయక పోటే ఎక్కడా జీతాలు ఉండవ్. అయితే సదరు ఉద్యోగి పనిచేయలేదని నిర్ధారించవలసి ఉంటుంది. దానికి కొంత ప్రక్రియ ఉంటుంది.  పని చేయకుండా వేతనం తీసుకోవాలని ఎవరూ అనుకోరు. అనుకున్నా అది ఇప్పటికే ఉన్న నిబంధనల వాళ్ళ సాధ్యం కాదు. కాని ప్రభుత్వం పై నిరసన తెలియజేయడానికి మాత్రం ఉద్యోగులు ఇలాంటి ప్రక్రియలను ఉపయోగించడం మామూలే. ఇలాంటి జీవోలవల్ల ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం  తీసుకోవచ్చు. ఉద్యోగుల జీతాలు ఆపి వేయవచ్చు. ఇదేమని ఎవరైనా అడిగితే జీవో కాపీలు చూపిస్తారు. ఇకపై ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, జీతాలు పెంచక పోయినా నిరసనలు తెలప కూడదన్న మాట. కేవలం విఙ్ఞప్తులు మాత్రమే చేసుకోవాలి. వింటే వింటారు, లేకపోతే లేదు. నిజమే, ప్రైవేటు ఉద్యోగాల్లో సమ్మెలకు ఎక్కువ వెసులు...

మనిషి దేవుడెలా అవుతున్నాడు?

మనిషి సంఘ జీవి. రాను రాను సంఘ జీవనానికి కొన్ని నియమాలు అవసరమయ్యాయి. అవే నియమాలు సమస్యలనూ సృష్టించాయి. ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కునే వారు కొందరు, ఇతరుల సహాయం కోరే వారు కొందరు. ఇలా ఉపదేశాలు తీసుకోవడం మొదలైంది. మనుషులలో కొందరు తెలివైన వారు ఉంటారు. వీరు తమ విజ్ఞానంతోనో, అనుభవంతోనో, మాటకారితనంతోనో ఇతరులను ప్రభావితం చేయ గలరు. అలాంటి వారు ఇతరులకి ఉపదేశాలివ్వడం మొదలు పెట్టారు. ఇలాంటి గురువులు మనకు పురాణాల్లో కొల్లలుగా కనబడతారు. మన పురాణాల్లో మహా మహిమాన్వితులు, గొప్పవారైన గురువులు లేదా ఋషుల గురించి చర్చించడం జరిగింది. చాలా సార్లు వారు దేవతలనే శపించగల శక్తివంతులుగా చిత్రింప బడ్డారు. కాని ఎక్కడా వారే దేవతలని చెప్పబడలేదు. వారు అలా ప్రకటించుకోలేదు కూడా. కానీ ఈరోజుల్లో వీధికొక బాబా నేనే భగవంతున్నని ప్రకటించుకోవడం లేదా తన శిష్య బృందంతో అన్యాపదేశంగా అనిపించుకోవడం సర్వ సామాన్యంగా మారి, మనకందరికీ దాదాపుగా అలవాటై పోయింది. ఒకప్పటి సప్తర్షులు, వారి శిష్య ప్రశిష్యులు కూడా భగవస్వరూపులు కాలేనప్పుడు, మరి ఈనాటి వీధి బాబాలు ఎలా ప్రత్యక్ష దైవాలు కాగలుగు తున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం. ఆలోచిస్తే...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...