తెలంగాణా ఏర్పడితే ప్రజల జీవితాలెలా బాగు పడతాయి? ఇది కొంతమంది సమైక్య వాదులు, మరికొంత మంది తెలంగాణా సమస్యను సానుకూలంగా అర్థం చేసుకోవాలనుకునే వారికి ఉదయించే ప్రశ్న.
దీనికి సులభంగా చెప్ప గలిగే సమాధానం 'అవును, ఇక్కడి నాలుగు కోట్ల మంది ప్రజలు విడిపోతే అభివృద్ధి చెందుతామని భావిస్తున్నారు'. నిజమే భవిష్యత్తును ఇంతకన్నా కచ్చితంగా చెప్పడం కుదరదేమో.
ఒకప్పుడు బ్రిటిష్ వారినుండి భారత స్వాతంత్ర్యాన్ని కోరినప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నలే వెలుగు చూసాయి. అభివృద్ధి కన్నా ముఖ్యమైనది ప్రజల స్వాభిమానం, స్వాతంత్ర్యం.
ఇప్పుడు స్వాతంత్ర్యం లేదా?
గత ఇరవై సంవత్సరాలనుండి తెలంగాణాకి చెందిన ఒక్క వ్యక్తి కూడా ముఖ్యమంత్రి కాలేదు. మనది పార్లమెంటరీ తరహా పాలన. ఎక్కువ ఎమ్మెల్యేలు ఎవరిని బలపరిస్తే వారే అధినాయకులు. జనాభాలో తక్కువ శాతంగా ఉన్న తెలంగాణాలో తక్కువ శాతం మందే ఎమ్మెల్యేలు ఉంటారు. పెద్ద పెద్ద వర్గాలను సమకూర్చ గలిగిన నాయకులు సీమాంధ్రలో ఉంటారు. సహజంగా పెద్ద వర్గంగా ఉన్నవారికే అధికారం దక్కుతుంది. ప్రస్తుత దేశ రాజకీయాలలో ముఖ్యమంత్రి అంటే సర్వాధికారాలు చెలాయించ గలిగిన నియంతతో సమానం. గతంలో పరిపాలించిన ఎన్టీయార్, చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి ఈ విషయం బాగా నిరూపించారు. వీరు ఏం చెప్పితే అదే జరుగుతుంది. వీరి పరిపాలన సీమాంధ్ర ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటుందనే విషయం చారిత్రాత్మకంగా పలు విషయాలలో రుజువు చేయబడింది. ఒకవేళ తప్పిజారి తెలంగాణా నాయకుడు ముఖ్యమంత్రిగా వచ్చినా, అతడు కూడా సీమాంధ్ర వర్గాల బలంతోనే పని చేయాల్సి ఉంటుంది. అంటే వారి ప్రయోజనాలను కాపాడే వరకే అతడు ముఖ్యమంత్రిగా ఉండ గలుగుతాడు. స్వీయ నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టిన మరుక్షణం పదవి కోల్పోవడం చారిత్రకంగా నిరూపితం.
అదే తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే, తెలంగాణా ముఖ్యమంత్రిగా ఎవరున్నా, తెలంగాణా మాత్రమే అతని పరిపాలనా విభాగం అవుతుంది. ఆ ముఖ్యమంత్రి కరడుగట్టిన సమైక్యవాది అయిన చంద్రబాబైనా, లగడపాటి రాజగోపాలైనా తెలంగాణాకి మాత్రమే పని చేయవలసి ఉంటుంది. నిధులను తెలంగాణాకి మాత్రమే ఖర్చు పెట్టవలసి ఉంటుంది. నేతల ప్రాతీయ పక్షపాత ధోరణి పై నిరంతర చర్చలకు ఆస్కారం గానీ, అవసరం గానీ ఉండదు. ప్రాంతీయ పక్షపాతం ఉందా లేదా అన్న విషయం మీద నిఘా పెట్టడానికి ప్రభుత్వానికి సమాంతరంగా మరిన్ని మండళ్లు పెట్టాల్సిన అవసరం ఉండదు.
ఇక పై ప్రశ్నకు వివరంగా సమాధానం చెప్పాలంటే ఈ వ్యాసం పరిధి మించి పోతుంది. మచ్చుకు కొన్ని విషయాలు చర్చిద్దాం.
నాలుక్కోట్లమంది ఉన్న తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డా పెద్ద రాష్ట్రమే అవుతుంది కాని చిన్న రాష్ట్రం కాదు. అంటే ఇప్పుడు రెండు పెద్ద పెద్ద రాష్ట్రాలు కలిసి ఒకే రాష్ట్రంగా ఉన్నాయన్న మాట. ఇంత పెద్ద రాష్ట్రంలో పరిపాలన సజావుగా జరగడం లేదు అనేదానికి ప్రతీ రోజూ పేపర్లో చూస్తున్న కుంభకోణాలు, అవకతవకలే రుజువులు. రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సీమాంధ్రకి చెందిన వారే పరిపాలనలో ప్రభావం చూపే అవకాశాన్ని పైన చర్చించాం. వీరికి తెలంగాణా పరిస్థితులపై అవగాహన ఉండడం లేదు.
తెలంగాణాలో వ్యవసాయం ముఖ్యంగా చెరువులపై ఆధారపడి సాగుతుంది. కాకతీయుల కాలం లోనూ, నిజాంల కాలంలోనూ ఎన్నో చెరువులు తొవ్వించి, సక్రమంగా నిర్వహించే వారు. కాని గత యాభై సంవత్సరాల్లో చెరువుల వ్యవస్తను పూర్తిగా నాశనం చేశారు. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. నీటికోసం బోర్లు వేయడం వల్ల మరింత దిగజారి పోయాయి. ఇల్లూ వాకిలీ కుదువ బెట్టి బోర్లకోసం పెట్టుబడి పెట్టి, నీరు రాక, పదెకరాల ఆసాములై ఉండి కూడా హైదరాబాదులో కూలీ పని చేసుకుని బ్రతికే రైతులు తెలంగాణలో ప్రతి ఊళ్ళోనూ ఉన్నారు.
చెరువుల వ్యవస్థ ఇలాగ మారితే రావలసిన ప్రాజెక్టులు ఎన్నటికీ పూర్తి కాలేదు. ముప్పై సంవత్సరాలనుండి శ్రీరాంసాగర్ కాలువలు పూర్తి కాలేదు. శ్రీశైలం కుడి కాలువ చెన్నై చేరింది కాని, ఎడమ కాలువ ఇంకా అతీగతీ లేదు.
రాజకీయ నాయకులు పనులు చేసేదే కమీషన్ల కోసం అన్నది బహిరంగ రహస్యం. అలాగే తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డా కూడా వారు కమీషన్ల కక్కుర్తి తోనే పనులు చేపడతారు. అయితే ఆ పనులు తెలంగాణలో తప్ప బయట చేపట్టే అవకాశం ఉండదు.
ఇక నీటి వినియోగం విషయానికి వస్తే అంతర్రాష్ట్రీయ ట్రిబ్యునల్ల పరిధిలో పంపకాలు జరుగుతాయి. వాటి ప్రకారంగా వినియోగం జరుగుతుంది. ఎవరికీ ఎంత వాడుకునే అర్హత ఉందో అంతే మొత్తం వాడుకోవడానికి వీలు ఉంటుంది. ఎక్కువ వాడడానికి వీలు ఉండదు. ఉంటే గింటే దిగువన ఉన్న రాష్ట్రానికే మిగులు జలాలు అధికంగా వాడుకొనే అవకాశం ఉంటుంది.
ఫ్యాక్టరీలలో ఉండే యాంత్రిక వ్యవస్థల్లో తరచుగా కార్మికుల మానవతప్పిదాల కారణంగా ఇబ్బందులు తలెత్తు తుంటే, వాటిని నివారించడానికి, ప్రయత్నించినా కుడా తప్పు చేయలేని విధంగా వ్యవస్థలను రూపొందించడం జరుగుతుంది (ఫూల్ ప్రూఫింగ్). తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కూడా అలాంటిదే. గత యాభై సంవత్సరాలుగా తప్పులు చేయడం, ఉద్యమాలు ఊపందుకుంటే నాలిక్కరుచు కోవడం, కమిటీలు వేయడం, జీవోలు తీయడం చివరికి వాటికీ పంగనామాలు పెట్టడం పరిపాటిగా మారి పోయింది. ఈ తప్పిదాలు నివారించడానికి రాష్ట్ర విభజన తప్ప మరో మార్గం లేదు.
రాష్ట్ర విభజన వలన ఎవరి బడ్జెట్లు వారికుంటాయి, ఎవరి డబ్బులు వారికే కర్చు చేయ బడతాయి. పక్షపాతం జరుగుతుందన్న అనుమానాలకు తావు ఉండదు. పరస్పర వైషమ్యాలకు అసలే తావు ఉండదు.
ఇక పోతే ఉద్యోగుల సమస్య. గవర్నమెంటు ఉద్యోగాలే తగ్గిపోతుంటే ఇంక ఉద్యోగుల సమస్య ఏమిటీ అనవచ్చు. ఉద్యోగాలు తగ్గి, ఉద్యోగార్థులు పెరిగినప్పుడే కదా సమస్య! రాష్ట్ర విభజన జరిగాక ఎవరి ఉద్యోగాలు వారికే ఉంటాయి. మీరే అంటే మీరే అనుకోవాల్సిన అవసరం ఉండదు.
ఒక్క మాటలో చెప్పాలంటే విభజన వలన ఏర్పడే రెండు రాష్ట్రాలకీ సమ న్యాయం జరుగుతుంది. కలిసి ఉండడం వల్ల ఒక ప్రాంతానికి అన్యాయం జరుగుతుందన్న భావన ఇంకో ప్రాంతానికి ఎప్పుడూ ఉంటుంది. కలిపి ఉంచడానికి తెలంగాణాకి ప్రత్యేక రక్షణలతో కూడిన వ్యవస్థను ఏర్పరిస్తే, మరో జైఆంధ్ర ఉద్యమం రాజుకోదన్న గ్యారంటీ ఏమీ లేదు. నాడు ముల్కీరూల్స్ కి వ్యతిరేకంగా జరిగిన జైఆంధ్ర ఉద్యమం ఇందుకు ప్రబల నిదర్శనం.
ఇప్పటికైనా రెండువైపులా ప్రజల మధ్య అగాధాలు మరింత పెరగకుండా ఉండాలంటే వీలైనంత త్వరగా రాష్ట్ర విభజన చేయడం కన్నా మరో పరిష్కారం లేదు.
excellent . i am agree with you.
ReplyDeleteఇప్పటికైనా రెండువైపులా ప్రజల మధ్య అగాధాలు మరింత పెరగకుండా ఉండాలంటే వీలైనంత త్వరగా రాష్ట్ర విభజన చేయడం కన్నా మరో పరిష్కారం లేదు.
ReplyDeleteWELL SAID ..
Very nicely written and explained. Thank you.
ReplyDeleteHari garu.. depth ga vellakunda ne telangana enduku kavalo chala baga chepparu... veelaithe inkastha shasthreeyamga marikontha vishaya sekarana tho marosari post cheyandi.. maalanti telangana sodarulaki marikontha telulukune avakasham dorukuthundi.
ReplyDeleteapril fool ...manchi topic raasaru mestaru
ReplyDeleteఅందరూ ఫూల్స్ కాబట్టే కదా ఫూల్ప్రూఫింగ్ కావాలనేది.
ReplyDeleteI agree with you.
ReplyDeleteWe need separate country(Andhra) with 3 states.
Not for separate telangana.
@koti
ReplyDeleteThanks to the coalition politics, so far no sort of hegemony displayed at national level. The country is good enough.
aniata, a2z dreams, anons, and koti,
ReplyDeleteThanks for the responses.