Skip to main content

జూనియర్ డాక్టర్ల సమ్మె - ఒక దీర్ఘ కాలిక పరిష్కారం


జూనియర్ డాక్టర్ల సమ్మె మళ్ళీ మొదలైంది.  ప్రతి సంవత్సరం వీరి సమ్మె ఒక తంతుగా జరుగుతూ వస్తుంటుంది, మనం చూస్తుంటాం.  నిబంధనల ప్రకారం చదువు పూర్తయ్యాక వీరు తప్పని సరిగా గ్రామాల్లో ఒక సంవత్సరం పాటు చేయవలసి వుంటుంది. వీరి సమ్మె జరిగిన ప్రతిసారీ ఆ నిబంధనను తీసివేయడమే పరమావధిగా ఉంటుంది. గ్రామాల్లో డాక్టర్ల లభ్యత లేక పోవడం వల్ల ప్రభుత్వం కూడా ఆ విషయంలో సడలింపు ఇవ్వలేక పోతుంది.

అవసరాలకు సరిపడా డాక్టర్లు లేకపోవడమే సమస్యకు మొత్తం మూలకారణంగా కనిపిస్తోంది. నగరాల్లో అధిక మొత్తంలో వేతనాలతో అవకాశాలు లభిస్తున్నప్పుడు ఊళ్లల్లోకి వెళ్లి స్టైపెండ్ పైనే ఉద్యోగం చెయ్యమంటే సహజంగానే వారికి నిరాశ కలుగుతుంది కదా. గొప్ప ఆశయాలతో, కొంత సేవా దృక్పథంతో వారు కూడా గ్రామాల్లో సర్వీస్ చేస్తే బాగుంటుంది. కానీ ఈ పోటీ సమాజంతో అంతటి దేశభక్తి కాని, మానవతా దృక్పథం కాని కలిగిన వారు పూర్తిగా తగ్గిపోయిన నేపథ్యంలో జుడాలు మాత్రం అందుకు అతీతంగా ఉండాలని కోరుకోవడం అత్యాశే అవుతుందేమో.

వారు కోరుతున్నట్టు అధిక వేతనాలు ఇచ్చి ఊళ్లకు పంపవచ్చు, కాని దానివల్ల అనేక ఇతర ఇబ్బందులు, ఉద్యోగుల కేడర్ల వేతనాల సమతుల్యత దెబ్బతిని మరిన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. నిజానికి నగరాల్లో కన్నా గ్రామాల్లో వారికి కర్చు చాలా తక్కువ. ఆ విధంగా ఎక్కువ మొత్తం మిగులుతుంది. కాబట్టి వారి అభ్యంతరాలకు డబ్బు సమస్య కారణం కాదని తెలిసి పోతూనే వుంది. నగరాల్లో ఉండే తళుకు బెళుకుల వల్లో, మరే ఇతర కారణాల వల్లనో కానీ వారు ఒళ్లకు వెళ్ళడానికే ఇష్టపడడం లేదు.  అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎక్కువ వేతనాలు చెల్లించడానికి ముందుకు వచ్చినా కూడా ఫలితం ఉండేటట్లు అనిపించడం లేదు.

ఆవశ్యకత, లభ్యత మధ్య అంతరం తగ్గనంత వరకూ ఈ సమస్య కొనసాగుతూనే వుంటుంది. కాబట్టి డాక్టర్ల సంఖ్యను పెంచడమే సి సమస్యకు ఉన్న ఒకే ఒక పరిష్కారం. ఒకవైపు నగరాల్లో అడుగడుగునా డాక్టర్లు కనపడితే గ్రామాల్లో మండలానికి ఒక్కరు కూడా ఉండడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులకు హాజరు కారు, ప్రైవేటు ప్రాక్టీషనర్లు అసలే ఉండరు.  ఇక మిగిలింది RMP డాక్టర్లే.  గ్రామాల్లో 90% వైద్యావసరాలు వీరివల్లనే తీరుతున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు.  కాని వీరికి సరియైన శిక్షణ లేక పోవడం వల్ల ఎన్నోఇబ్బందులు కొన్ని సార్లు ప్రాణనష్టం కూడా సంభవిస్తున్నాయి.

కాబట్టి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పెంచడానికి దీర్ఘ కాలిక ప్రణాళికను రూపొందించు కోవాలి. మెడికల్ కాలేజీల స్థాపన అంత సులభం కాదు, అంతేకాక కేవలం మరికొన్ని మెడికల్ కాలేజీలు అదనంగా స్థాపించినంత మాత్రాన కూడా ఈ సమస్య పరిష్కారం కాదు.

పూర్తిగా MBBS పట్టభద్రుల పైనే ఆధార పడకుండా వైద్యంలో డిప్లొమా పట్టభద్రులను కూడా తయారు చేసుకోగలిగితే ఈ సమస్యకు దీర్ఘ కాలిక పరిష్కారం లభిస్తుందేమో నని అనిపిస్తుంది. అస్సలు శిక్షణ లేని RMP డాక్టరు కన్నా కొంతమేరకు శాస్త్రీయ శిక్షణ పొందిన డిప్లొమా డాక్టరు అన్ని రకాలుగా ఉత్తమ సేవలు అందించ గలడు. డిప్లమా డాక్టరుకు నగరాల్లోని కార్పోరేట్ ఆస్పత్రుల్లో అవకాశాలు లభించవు కాబట్టి వారు తప్పనిసరిగా ఊళ్లల్లోకి వెళ్లి సేవలు అందించే అవకాశం ఎక్కువ.

 ఈ డిప్లమా డాక్టరు కోర్సులను మూడేళ్ళకు పరిమితం చెయ్యాలి. ప్రతి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానించి వీరికి కళాశాలను స్థాపించాలి. రోజులో సగం తరగతి గది శిక్షణ, మిగతా సగం ఆస్పత్రిలో పనితో కూడిన శిక్షణ ఉండాలి. నాకు మెడికల్ విషయాలపై అంత అవగాహన లేదు, కాని మూడు సంవత్సరాల నిష్ణాతుల శిక్షణ, ఆస్పతులలో ప్రత్యక్ష అనుభవం వాళ్ళ ఒకింత మేరకు వారు మంచి వైద్య సహాయం అందించ గలరని అనిపిస్తోంది. ఏది చేయాలో, ఏది చేయగూదదో కూడా వారికి శిక్షణలో భాగంగా అవగాహన కల్పించ బడుతుంది. కాబట్టి వారు దుస్సాహసాలు చేసి ప్రాణాల మీదకు తీసుకు వచ్చే అవకాశం తక్కువ. వీరివల్ల తప్పకుండా డివిజనల్, జిల్లా ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గుతుంది. ప్రైమరీ హెల్త్ సెంటర్లలో MBBS డాక్టర్లకు బదులుగా వీరిని నియమించవచ్చు.  ఇది కేవలం నాకు కలుగుతున్న ఒక ఆలొచన. దీని సాధ్యాసాధ్యాలను గురించి నిష్ణాతులైన వారు ఎవరైనా స్పందిస్తే బాగుంటుంది.

Comments

Popular posts from this blog

నల్ల జీవో

ప్రభుత్వం తాజాగా GO నెంబర్ 177 విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన తెలుపడానికి అనుసరించే పద్ధతులైన సమ్మె, టూల్ డౌన్, పెన్ డౌన్ తదితర ప్రక్రియల నిషేధిస్తూ నో వర్క్, నో పే అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక సందేహమేమిటంటే, ఇప్పటివరకూ పనిచేయక పోతే కూడా జీతాలిస్తున్నారా అని. పని చేయక పోటే ఎక్కడా జీతాలు ఉండవ్. అయితే సదరు ఉద్యోగి పనిచేయలేదని నిర్ధారించవలసి ఉంటుంది. దానికి కొంత ప్రక్రియ ఉంటుంది.  పని చేయకుండా వేతనం తీసుకోవాలని ఎవరూ అనుకోరు. అనుకున్నా అది ఇప్పటికే ఉన్న నిబంధనల వాళ్ళ సాధ్యం కాదు. కాని ప్రభుత్వం పై నిరసన తెలియజేయడానికి మాత్రం ఉద్యోగులు ఇలాంటి ప్రక్రియలను ఉపయోగించడం మామూలే. ఇలాంటి జీవోలవల్ల ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం  తీసుకోవచ్చు. ఉద్యోగుల జీతాలు ఆపి వేయవచ్చు. ఇదేమని ఎవరైనా అడిగితే జీవో కాపీలు చూపిస్తారు. ఇకపై ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, జీతాలు పెంచక పోయినా నిరసనలు తెలప కూడదన్న మాట. కేవలం విఙ్ఞప్తులు మాత్రమే చేసుకోవాలి. వింటే వింటారు, లేకపోతే లేదు. నిజమే, ప్రైవేటు ఉద్యోగాల్లో సమ్మెలకు ఎక్కువ వెసులు...

మనిషి దేవుడెలా అవుతున్నాడు?

మనిషి సంఘ జీవి. రాను రాను సంఘ జీవనానికి కొన్ని నియమాలు అవసరమయ్యాయి. అవే నియమాలు సమస్యలనూ సృష్టించాయి. ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కునే వారు కొందరు, ఇతరుల సహాయం కోరే వారు కొందరు. ఇలా ఉపదేశాలు తీసుకోవడం మొదలైంది. మనుషులలో కొందరు తెలివైన వారు ఉంటారు. వీరు తమ విజ్ఞానంతోనో, అనుభవంతోనో, మాటకారితనంతోనో ఇతరులను ప్రభావితం చేయ గలరు. అలాంటి వారు ఇతరులకి ఉపదేశాలివ్వడం మొదలు పెట్టారు. ఇలాంటి గురువులు మనకు పురాణాల్లో కొల్లలుగా కనబడతారు. మన పురాణాల్లో మహా మహిమాన్వితులు, గొప్పవారైన గురువులు లేదా ఋషుల గురించి చర్చించడం జరిగింది. చాలా సార్లు వారు దేవతలనే శపించగల శక్తివంతులుగా చిత్రింప బడ్డారు. కాని ఎక్కడా వారే దేవతలని చెప్పబడలేదు. వారు అలా ప్రకటించుకోలేదు కూడా. కానీ ఈరోజుల్లో వీధికొక బాబా నేనే భగవంతున్నని ప్రకటించుకోవడం లేదా తన శిష్య బృందంతో అన్యాపదేశంగా అనిపించుకోవడం సర్వ సామాన్యంగా మారి, మనకందరికీ దాదాపుగా అలవాటై పోయింది. ఒకప్పటి సప్తర్షులు, వారి శిష్య ప్రశిష్యులు కూడా భగవస్వరూపులు కాలేనప్పుడు, మరి ఈనాటి వీధి బాబాలు ఎలా ప్రత్యక్ష దైవాలు కాగలుగు తున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం. ఆలోచిస్తే...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...