జూనియర్ డాక్టర్ల సమ్మె మళ్ళీ మొదలైంది. ప్రతి సంవత్సరం వీరి సమ్మె ఒక తంతుగా జరుగుతూ వస్తుంటుంది, మనం చూస్తుంటాం. నిబంధనల ప్రకారం చదువు పూర్తయ్యాక వీరు తప్పని సరిగా గ్రామాల్లో ఒక సంవత్సరం పాటు చేయవలసి వుంటుంది. వీరి సమ్మె జరిగిన ప్రతిసారీ ఆ నిబంధనను తీసివేయడమే పరమావధిగా ఉంటుంది. గ్రామాల్లో డాక్టర్ల లభ్యత లేక పోవడం వల్ల ప్రభుత్వం కూడా ఆ విషయంలో సడలింపు ఇవ్వలేక పోతుంది.
అవసరాలకు సరిపడా డాక్టర్లు లేకపోవడమే సమస్యకు మొత్తం మూలకారణంగా కనిపిస్తోంది. నగరాల్లో అధిక మొత్తంలో వేతనాలతో అవకాశాలు లభిస్తున్నప్పుడు ఊళ్లల్లోకి వెళ్లి స్టైపెండ్ పైనే ఉద్యోగం చెయ్యమంటే సహజంగానే వారికి నిరాశ కలుగుతుంది కదా. గొప్ప ఆశయాలతో, కొంత సేవా దృక్పథంతో వారు కూడా గ్రామాల్లో సర్వీస్ చేస్తే బాగుంటుంది. కానీ ఈ పోటీ సమాజంతో అంతటి దేశభక్తి కాని, మానవతా దృక్పథం కాని కలిగిన వారు పూర్తిగా తగ్గిపోయిన నేపథ్యంలో జుడాలు మాత్రం అందుకు అతీతంగా ఉండాలని కోరుకోవడం అత్యాశే అవుతుందేమో.
వారు కోరుతున్నట్టు అధిక వేతనాలు ఇచ్చి ఊళ్లకు పంపవచ్చు, కాని దానివల్ల అనేక ఇతర ఇబ్బందులు, ఉద్యోగుల కేడర్ల వేతనాల సమతుల్యత దెబ్బతిని మరిన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. నిజానికి నగరాల్లో కన్నా గ్రామాల్లో వారికి కర్చు చాలా తక్కువ. ఆ విధంగా ఎక్కువ మొత్తం మిగులుతుంది. కాబట్టి వారి అభ్యంతరాలకు డబ్బు సమస్య కారణం కాదని తెలిసి పోతూనే వుంది. నగరాల్లో ఉండే తళుకు బెళుకుల వల్లో, మరే ఇతర కారణాల వల్లనో కానీ వారు ఒళ్లకు వెళ్ళడానికే ఇష్టపడడం లేదు. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎక్కువ వేతనాలు చెల్లించడానికి ముందుకు వచ్చినా కూడా ఫలితం ఉండేటట్లు అనిపించడం లేదు.
ఆవశ్యకత, లభ్యత మధ్య అంతరం తగ్గనంత వరకూ ఈ సమస్య కొనసాగుతూనే వుంటుంది. కాబట్టి డాక్టర్ల సంఖ్యను పెంచడమే సి సమస్యకు ఉన్న ఒకే ఒక పరిష్కారం. ఒకవైపు నగరాల్లో అడుగడుగునా డాక్టర్లు కనపడితే గ్రామాల్లో మండలానికి ఒక్కరు కూడా ఉండడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులకు హాజరు కారు, ప్రైవేటు ప్రాక్టీషనర్లు అసలే ఉండరు. ఇక మిగిలింది RMP డాక్టర్లే. గ్రామాల్లో 90% వైద్యావసరాలు వీరివల్లనే తీరుతున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. కాని వీరికి సరియైన శిక్షణ లేక పోవడం వల్ల ఎన్నోఇబ్బందులు కొన్ని సార్లు ప్రాణనష్టం కూడా సంభవిస్తున్నాయి.
కాబట్టి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పెంచడానికి దీర్ఘ కాలిక ప్రణాళికను రూపొందించు కోవాలి. మెడికల్ కాలేజీల స్థాపన అంత సులభం కాదు, అంతేకాక కేవలం మరికొన్ని మెడికల్ కాలేజీలు అదనంగా స్థాపించినంత మాత్రాన కూడా ఈ సమస్య పరిష్కారం కాదు.
పూర్తిగా MBBS పట్టభద్రుల పైనే ఆధార పడకుండా వైద్యంలో డిప్లొమా పట్టభద్రులను కూడా తయారు చేసుకోగలిగితే ఈ సమస్యకు దీర్ఘ కాలిక పరిష్కారం లభిస్తుందేమో నని అనిపిస్తుంది. అస్సలు శిక్షణ లేని RMP డాక్టరు కన్నా కొంతమేరకు శాస్త్రీయ శిక్షణ పొందిన డిప్లొమా డాక్టరు అన్ని రకాలుగా ఉత్తమ సేవలు అందించ గలడు. డిప్లమా డాక్టరుకు నగరాల్లోని కార్పోరేట్ ఆస్పత్రుల్లో అవకాశాలు లభించవు కాబట్టి వారు తప్పనిసరిగా ఊళ్లల్లోకి వెళ్లి సేవలు అందించే అవకాశం ఎక్కువ.
ఈ డిప్లమా డాక్టరు కోర్సులను మూడేళ్ళకు పరిమితం చెయ్యాలి. ప్రతి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానించి వీరికి కళాశాలను స్థాపించాలి. రోజులో సగం తరగతి గది శిక్షణ, మిగతా సగం ఆస్పత్రిలో పనితో కూడిన శిక్షణ ఉండాలి. నాకు మెడికల్ విషయాలపై అంత అవగాహన లేదు, కాని మూడు సంవత్సరాల నిష్ణాతుల శిక్షణ, ఆస్పతులలో ప్రత్యక్ష అనుభవం వాళ్ళ ఒకింత మేరకు వారు మంచి వైద్య సహాయం అందించ గలరని అనిపిస్తోంది. ఏది చేయాలో, ఏది చేయగూదదో కూడా వారికి శిక్షణలో భాగంగా అవగాహన కల్పించ బడుతుంది. కాబట్టి వారు దుస్సాహసాలు చేసి ప్రాణాల మీదకు తీసుకు వచ్చే అవకాశం తక్కువ. వీరివల్ల తప్పకుండా డివిజనల్, జిల్లా ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గుతుంది. ప్రైమరీ హెల్త్ సెంటర్లలో MBBS డాక్టర్లకు బదులుగా వీరిని నియమించవచ్చు. ఇది కేవలం నాకు కలుగుతున్న ఒక ఆలొచన. దీని సాధ్యాసాధ్యాలను గురించి నిష్ణాతులైన వారు ఎవరైనా స్పందిస్తే బాగుంటుంది.
Comments
Post a Comment
బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.