Skip to main content

ఓటు ఎవరికి వేయాలి?

ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రాజకీయ నాయకులు వాగ్దానాల మీద వాగ్దానాలు చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ నగదు బదిలీ, కలర్ టీవీలతో అగ్ర భాగాన నిలిచింది. మొదట వంద రూపాయలకే ఇంటి సరుకులు వగైరా హామీలతో ముందుకొచ్చిన ప్రజా రాజ్యం పార్టీ వెనుక బడింది. కాంగ్రెస్ అయితే ఇందిరమ్మ గృహాలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రెండు రూపాయలకు కిలో బియ్యం, ఉచిత కరెంటు పథకాలు, జలయజ్ఞం ఇప్పటికే ఆచరించి చూపాం అంటుంది. ఇప్పుడు బీజేపీ కొత్తగా సెల్ ఫోనులు, పదివేలకే లాప్ టాపులు, బ్రాడ్ బ్యాండ్ వగైరాలతో బయలు దేరింది. మిగతా వారితో పోల్చి చుస్తే ఇది కొంచెం హైటెక్ గా కనపడుతుంది.. ప్రజలు ఎంత వరకు స్వీకరిస్తారో మరి!

నిజానికి ఇవన్నీ కూడా చాలా మంచి పథకాలే. ప్రజోపయోగమైనవే. అయితే ముఖ్య మైన ప్రశ్న ఏమిటంటే ఇవి ఎంత వరకు ఆచరణ సాధ్యాలు? రైతులు, చేనేత కార్మికులు ఆత్మ హత్యలు చేసుకునే తరుణంలో కలర్ టీవీలు అవసరమా? రెండువేల రూపాయలు ఎవరికి ఇస్తారు? లబ్ది దారులను గుర్తించటానికి ప్రాతిపదిక ఏమిటి? నిజంగా గర్భ దరిద్రులకే ఆ సొమ్ము చేరుతుందని భరోసా ఏమిటి? గతంలో తెదేపా హయాములో పనికి ఆహార పథకం బియ్యం నాయకుల ఇళ్ళలోకి పోయాయన్న విషయం జగమెరిగిన సత్యం. ఇప్పుడు ఆ నాయకులే జోక్యం చేసుకుని అనుచర గణానికి సంతర్పణ చేయరని గ్యారంటీ ఏమిటి?

ఇక అధికార పార్టీ అవినీతి చరిత్ర కనీ వివీ ఎరుగ నటువంటిది. ప్రాజెక్టులలో, గృహ నిర్మాణం పనులలో అవినీతి ఏరులై పారిన వైనం ఇంకో యాభై ఏండ్లకైనా మరపుకు రాదు. సూక్ష్మం లోంచి మోక్షం సృష్టించి నట్టుగా సాక్షి పత్రిక, ఛానెల్ ఎలా పుట్టాయో చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. వీరికి మరోసారి ఓటు వేయమని ఎలా అడగాలనిపిస్తుందో మరి!

ఇక ప్రజా రాజ్యం విషయానికొస్తే... ఇంతవరకు పరిపాలించిన రికార్డు లేదు కాబట్టి ఏ రికార్డైనా బజాయించు కునే సావకాశం ఉంది వారికి. దానికి తగ్గట్టుగానే అవినీతి రహిత, సామాజిక న్యాయం మొదలైన సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇప్పుడు ప్రజా రాజ్యం లోని ముఖ్య నాయకుల్లో ఎంతమంది సామాజికంగా అట్టడుగు వర్గాల వారు ఉన్నారో చిన్న పిల్లవాడికి కూడా తెలుసు. పైగా పార్టీ పురిట్లోనే ఒక బంధువుల సముహంలా మారింది.

ఇలాంటి తరుణంలో నిజమైన మార్పు కావాలంటే నిశ్శబ్ద విప్లవమొక్కటే మార్గం. నిశ్శబ్ద విప్లవమెందుకంటే... మన దేశం ఇప్పటికీ ఫ్యూడల్ వ్యవస్థ దాటి ముందుకు వెల్ల లేదు. ముఖ్యంగా గ్రామాలలో తమ వానిని ధైర్యంగా వినిపించే పరిస్థితి లేదు. ఏదో ఒక బలిసిన రాజకీయ పక్షానికి కొమ్ము కాయాల్సిన పరిస్థితి. అందుకే నిశ్శబ్ద విప్లవం.

కష్టాలకోర్చి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చుకున్న రోజు ప్రజలో కనపడ్డ చైతన్యం తర్వాత తర్వాత తాము నమ్మిన నాయకుల కుహనా చేష్టల వల్ల పూర్తిగా అణగారి పోయింది. అప్పుడు బ్రిటిష్ వారి నుండి విముక్తి లభిస్తుందని ప్రతి ఒక్కరు నమ్మారు. ఎందుకంటే నమ్మకమే కార్య దీక్షకు పునాది. కాని ఇప్పుడు ఈ స్వదేశీ అవినీతి పాలకుల నుండి తమకు విముక్తి లభిస్తుందని ఇంకా ప్రజలకు నమ్మకం కలగటం లేదు. దీన్ని బట్టి ప్రజలను ఈ అరవై ఏళ్ళలో ఎంతగా దిగజార్చారో అర్థం కావటం లేదూ?

అయితే ఏ పాలన కూడా కల కాలం సాగదనేది చరిత్ర చెప్తున్న సత్యం. మహా మహా సామ్రాజ్యాలు కూడా ప్రజల ఆగ్రహ జ్వాలలకు కూలి పోయాయి. ఈ అవినీతి సామ్రాజ్యం అందుకు మినహాయింపు కాదు. అదృష్ట వశాత్తు ఇప్పుడు మునుపటిలా త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. కేవలం విచక్షణ తో ఓటు వేయడమే కావలసినది. లోక్ సత్తా కే ఓటు వేయాలని కాదు. బరిలో నిలచిన అభ్యర్థులలో అత్యంత నీతి పరులేవరోవారికే వోటు వేయాలి. అప్పుడు మార్పు అదే వస్తుంది.

Comments

  1. మీరన్నట్టు లోక్ సత్తా పార్టీ కొన్ని గ్రామాలనైనా దత్తత తీసుకుని ప్రజలలో నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది. అయితే దీనింకి చాలా సమస్యలున్నాయి.

    ఇప్పుడు పార్టీ కేవలం పట్టణాల్లోనే వ్యాపించి వుంది. సభ్యులు కూడ విద్యావంతులైన ఉద్యోగులు మాత్రమే. వారికి ప్రత్యేకంగా సేవా కార్యక్రమాలలో పాల్గొనే సమయం లేదు. ఇతర పార్టీల కార్యకర్తలకు అధికారం వస్తే చాలు, ఎంతైనా సంపాదించులోవచ్చు అనే అలోచన వుంటుంది. అందుకని స్వంత డబ్బు, కాలం వెచ్చించైనా సరె పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. లోక్ సత్తా కి అలాంటి అవకాశాలు తక్కువ.

    ఇలాంటి తరుణంలో విద్యావంతులైన, ఆలోచననా పరులైన వారంతా స్వచ్చందంగా నడుం బిగిస్తే తాముండే, పనిచేసే ప్రదేశాల్లో తొటివారి ఆలొచనల్లో మార్పు తీసుకు రాగలరు. గత ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఓదిపోవడానికి ముఖ్య కారణం ఉద్యోగులు, మేధావి వర్గాలే. వారు తలుచుకుంటే అట్టడుగు వర్గాలలో కూడా మార్పు తీసుకు రాగలరు. అయితే ముందుగా చాలామంది విద్యావంతుల, మేధావుల ఆలోచనా ధోరణి లో మార్పు రావాలి.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

తెలుగును పునరుజ్జీవింప జేద్దాం

భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం. ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి క్లిష్టమైన సంస్కృత సమాసాలను వాడుతున్నారు. దీనివల్ల ఒక భాష నుండి వేరొక భాషకు దాసోహం చెప్పడం తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. సంస్కృతం తన సహజరూపం లోనే మన లేక హిందీగా మారి ఉత్తర భారతంలో బ్రతుకుతుంది. అలాంటి సంస్కృత పదాలను అరువుతెచ్చుకుని తెలుగులో వ్యాప్తిలోకి తీసుకు రావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అవసరం లేదు కూడా. మన భాష ప్రస్తుత పరిస్థితికి ప్రబంధ సాహిత్యం తప్ప, సాంకేతిక పరమైన సాహిత్యం మనకు లేకపొవడం కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. పైగా మన పూర్వ కవులకు సంస్కృతం పై ఉన్న ఎనలేని మోజు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణం. అర్జునుడికి వంద పేర్లు ఉంటాయి. irrigation అనే పదానికి ఒక్క తెలుగు ...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...

కడప ఎన్నికలతో రాష్ట్ర భవితం తేలనుందా?

కడప పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాలలో జరుగుతున్న ఎన్నికలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును తేల్చేవిగా కనబడుతున్నాయి. అందుకే ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్రులు సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నారు. ఒక వైపు రాజశేఖర్ రెడ్డికి పెట్టని కోట లాంటిదైన జిల్లా. పైగా జగన్ కున్న ధనబలం, అంగబలం. కాంగ్రెస్ ధనబలం, అధికారబలం. వీటి మధ్య ఎంత తీవ్రమైన పోరు జరిగినా కూడా, జగన్ కే విజయావాకాశాలు లభించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఎలక్షన్ లో ఓటమి గాని సంభవిస్తే జగన్ పార్టీకి అది సమాధిగా మారుతుంది. ప్రజారాజ్యం పార్టీలా ఇతర పార్టీల్లో కలవడం తప్ప, మళ్ళీ కుదురుకోవడం కష్టం కావచ్చు. ఆ పక్షంలో కాంగ్రెస్ జగన్ని మరింత అణగదొక్కడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి BJP లో కలవ వచ్చు. కడపలో గెలిస్తే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం 2014 వరకు తిరుగుండదు.  ఒక వేళ ఈ ఎన్నికల్లో జగన్ గనక గెలిచినట్టయితే అది రాష్ట్ర ప్రభుత్వానికే కాక, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కూడా గొడ్డలి పెట్టుగా మారుటింది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చడానికి జగన్ ఒక్క నిముషం కూడా వృధా చేయడు. కాంగ్రెస్, తెలుగుదేశాల నుండి జగన్ పార్టీకి జోరుగా వలసలు ప...