Skip to main content

ICICI బ్యాంకులో నా అనుభవం

క్రమంగా ప్రైవేటు రంగ సంస్థలు భారత దేశంలో ముందంజ వేస్తుంటే సంతోషించిన వాళ్ళలో నేను ఒకడిని. ఒకప్పుడు జాతీయ బ్యాంకులో DD తీయాలంటే గంటలకొద్దీ సమయం పట్టేది. అదే నిమిషాల్లో ప్రైవేటు బ్యాంకుల్లో ఇచ్చేస్తుంటే ముచ్చటేసేది. అయితే ఈ ప్రైవేటు బ్యాంకులు ఎంత ఘరానా గా దోపిడీ చేయ గలవో అనుభవం మీద తెలిసింది.

మూడు సంవత్సరాల క్రితం నేను 9 లక్షలు గృహ ఋణం తీసుకున్నాను మారే వడ్డీ విధానం పై. అప్పుడు వడ్డీ 9.00 శాతంగా వుండేది. ఈ మూడు సంవత్సరాల్లో వాయువేగ మనో వేగాలతో వడ్డీ రేటు 13.00 శాతానికి పెంచారు. సరే రేపో రేటు పెరిగింది కాబట్టి పెంచారులే అనుకుంటే మిగతా బ్యాంకుల కన్నా చాలా ఎక్కువగా. ఇక వాయిదాలను చూస్తే జీవితాంతం కట్టినా ఇంకా మిగిలేలా పెంచేశారు, అలాగే వాయిదా మొత్తం కూడా. రేపో రేటు తగ్గిన తర్వాత కుడా చాలా కాలం మిన్నకుండి కేవలం అర శాతం తగ్గించి 12.5 శాతం చేసారు.

ఇక ఇలా కాదని కొంత మొత్తం తీర్చేద్దామని రెండున్నర లక్షలు పట్టుకుని బ్యాంకుకి వెళ్లాను. బేగంపేటలో వీరికి ఒక కస్టమర్ రిలేషన్ సెంటరు ఒకటి వుంది. అక్కడికే వెళ్లాను. మామూలుగా నైతే అన్ని లావా దేవీలు counter లోనే జరుపుతారు. కాని ఆశ్చర్యకరంగా నన్ను లోపలి గదిలోకి తీసుకెళ్ళారు. అక్కడ మొదలయింది అసలు కథ.

నేను ఇప్పుడు ఉన్న రేటుకి part payment చేస్తే ఎంత నష్టపోతానో వివరించారు. దానికి మార్గాంతరం కూడా ఉపదేశించారు. నేను ఒకవేళ ICICI Prudential లో 30000 ల రూపాయలు జమచేస్తే నేను ఇప్పుడున్న రేపో రేటుకి మారడానికి సహాయం చేస్తారు. అది కూడా రూపాయలు 16200 అదనంగా చెల్లిస్తే. అప్పుడు నా వాయిదాలు గణనీయంగా తగ్గుతాయి. నేను ICICI Prudential లో చేరను, కాని స్విచింగ్ కోసమై 16200 చెల్లిస్తాను, వడ్డీ తగ్గించండి అని అడిగాను. అది వీలు కాదు అని చెప్పారు.

నాకు బ్యాంకింగు వ్యవహారాలు అంతగా తెలియవు. బహుశ ICICI వారు అంతా సరిగానే చేస్తుండ వచ్చు. కాని నాకు ఇందులో నచ్చని విషయం ఒకటే. గృహ రుణానికి సంబధించిన వడ్డీని ఇన్స్యురెన్సుతో ముడి పెట్టడం ఏమిటి? చుట్టూ చూస్తే ఇలా గృహ రుణ కబంధ హస్తాల నుండి తప్పించు కోవడానికి అక్కడ నాలా చాలా మందే కనిపించారు. అంతా ICICI బ్యాంకుని తిట్టుకుంటూ ఇన్స్యురెన్సు చేస్తున్నారు. చివరకు నేను కుడా విధి లేక అదే పని చేశాను.

ఎందుకు ఇలా చేశాను అని ఆలోచిస్తే... బ్యాంకుల నిబంధనలు పరిశోధించే ఓపిక లేదు. బ్యాంకు చుట్టూ మళ్ళీ మళ్ళీ తిరిగే తీరిక లేదు. అయినా ఇన్సురెన్సె కదా మన డబ్బులు మనకే ఉంటాయిలే, చేస్తే ఏం పోతుంది అన్నా భరోసా. సరిగ్గా ఇలాంటి సైకాలజీయే కావాలేమో మన బ్యాంకర్లకి!

Comments

  1. "గృహ రుణానికి సంబంధించిన వడ్డీని ఇన్స్యురెన్సుతో ముడి పెట్టడం ఏమిటి? " -ఇది మీరు సరిగా అర్థం చేసుకుని రాసిన విషయమేనా? మీ అప్పుకి Collateral security మీరు కొన్న గృహమైతే, ఆ ఇంటికి చేస్తున్న ఇన్సూరన్స్ కావచ్చు అది.

    ReplyDelete
  2. దీనికి గృహ భీమాతో సంబంధం లేదు. నాకు అంట గట్టింది Life stage pension అనబడే ఒక పథకం.

    ReplyDelete
  3. వారు తమ భీమా పథకాల గురించి మార్కెట్ చేసుకోవడం పై నాకెలాంటి అభ్యతరం లేదు. ఎటొచ్చి పాత గృహ రుణానికి సంబధించిన వడ్డీ రేటు సవరించడానికి, భీమాలో చేరటానికి లంకె పెట్టడమే నాకు తప్పుగా తోచింది. ఈ విధంగా వడ్డీ సవరించు కోవాలని వెళ్ళే రుణ గ్రహీతలు తప్పని సరి పరిస్థితులలో భీమా ఖాతాలు కుడా తెరవాల్సి వస్తుంది. నా పాయింటు ఏమంటే ఒక వేల వడ్డీ సవరింపు మాములుగా సాధ్య పడనప్పుడు భీమా పథకం లో చేరిన తర్వాత ఎలా సాధ్యపడుతుంది? ఇది ఒక రకమైన blackmail తప్ప మరోటి కాదు.

    తిడితే మాత్రం ప్రయోజనం ఏముంటుంది, అక్కడ ఉండేది ఉద్యోగస్తులేకదా?

    ReplyDelete
  4. Bankers say that since we have already paid so much in the past years as interest, we lose the previously paid interest if we do part payment. But it is not true. What ever we pay as part payment will be exactly equivalant to the sum of the present values of our future payments for the same principal.

    Either you deposit 2 laks at once or you deposit all the futue EMIs every month(for that 2 laks) with same interest rate, after the tenure it should be same.

    However public sector banks are much better than private banks in many aspects. Private banks minimum balance requirement is too high that poor people cannot afford. Private banks would charge a lot for services like Demand Draft. Private banks would not open branches in rural areas and offer loans for farmers etc. However due to private banks, compitition increased and services in public sector banks improved.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...