Skip to main content

అధికారం

దివంగత ముఖ్య మంత్రి చని పోయి రెండు రోజులు కూడా కాలేదు. సంతాప దినాలు పూర్తి కావడానికి ఇంకా ఐదు రోజులున్నాయి. ఈ లోపలే కాంగ్రెస్ వారు కామెడీ మొదలు పెట్టారు. వీరి కామెడీకి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు.

ముఖ్య మంత్రి పార్థివ శరీరాన్ని ఇంకా తీసుకు రాక ముందే కేబినేట్ మీటింగ్ ఒకటి పెట్టారు. ఒక సంతాప తీర్మానం, కడప జిల్లాని YSR జిల్లాగా మార్చాలని ఒకటి, జగన్ ని ముఖ్యమంత్రిగా నియమించాలని ఒకటి మొత్తం మూడు తీర్మానాలు చేసారు. మొదటి రెండు వరకు ఫరవా లేదు. ఒక కేబినేట్ మంత్రి వర్గం ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి కొరకై సిఫారసు చేయడం... కామెడీగా లేదూ? ఇందులో అసలు కామెడీ ఏమిటంటే ముఖ్యమంత్రి చనిపోయాక, ఆయన నియమించుకున్న ఈ మంత్రివర్గం రద్దయినట్లే నని రాజ్యాంగ నిపుణులు సెలవిచ్చారు. మరి వీరి తీర్మానాలకు చట్ట బద్ధత ఏది?

ఇక రెండోది కాంగ్రెస్ ఎమ్మెల్సీల సమావేశం. వీరంతా సమావేశమై జగన్ మాత్రమే ముఖ్యమంత్రి కావాలని తీర్మానం చేశారట. వీరి తీర్మానం నాలిక గీక్కోవడానికి కూడా పనికి రాదు. వీరెందుకు హడావిడిగా ఇప్పుడు తీర్మానం చేయడం? ఒక వైపు అధిష్టానం ఈ విషయం పై ఏమీ మాట్లాడకండి అని చెపుతుంటే?

మూడోది ఎమ్మెల్యేలు కూడా తీర్మానం చేయడానికి ప్రయత్నించడం. కాని కేంద్రం మొట్టికాయలు వేసేసరికి సంతాప సభతో సరిపెట్టారు.

అసలు వీరు ఇంత హడావిడి చేయడం ఎందుకో అర్థం కాదు. జగన్ కి ప్రజాభిమానం, ఎమ్మెల్యేల బలం ఉన్నట్టయితే ఆయనే అవుతారు ముఖ్యమంత్రి. దీనికోసం ఇంతగా తొందర పాటు చర్యలకు దిగడం ఆశ్చర్యం కలిగించడమే కాదు, అసహజంగా కూడా వుంది.

పదే పదే రఘువీరా రెడ్డి ప్రకటనలు ఇవ్వడం, బొత్స సత్యనారాయణ వెళ్లి DS పై ఒత్తిడి తేవడానికి ప్రయత్నించడం తొందరపాటు చర్యలుగా అనిపించడం లేదూ?

Comments

  1. జగన్ CM ఐతే అదే కోటరీ లో ఉండి తమ పదవులు కాపాడుకోవచ్చని మంత్రుల ఆరాటం , జగనన్న CM కావలి అని అరిసి మీడియా లో ప్రముఖం గా కనపడితే ఏదో ఒక పదవి దక్కక పోతుందా అని మిగిలిన వారి ఆరాటం. స్వార్ధం ఒక స్థాయి వరకు భరించవచ్చోమో గాని వీళ్ళని వీళ్ళ ఆరాటాన్ని చూస్తుంటే ఛీ వద్దులేండి వేరే జీవాలతో పోలిస్తే మన బ్లాగర్లు చాలా మంది బాధ పడతారు.
    ఎక్కడ పడితే అక్కడ అలా అరుస్తా ఉంటే ప్రస్తుతం ఆ పదవి నిర్వహిస్తున్న వ్యక్తి కి ఎలా ఉంటుంది అన్న కనీస జ్ఞానం కూడా లేదు ఛీ ఛీ !

    ReplyDelete
  2. >> "వీళ్ళని వీళ్ళ ఆరాటాన్ని చూస్తుంటే ఛీ వద్దులేండి వేరే జీవాలతో పోలిస్తే మన బ్లాగర్లు చాలా మంది బాధ పడతారు"

    ;-)

    ఎవరో రాశారు, బ్లాగుల్లోనే. వైఎస్ అపర గాంధీ అట! అభిమానానికీ ఓ హద్దుండాలి.

    ReplyDelete
  3. పదవి కోసం, డబ్బుల కోసం ఎన్నెన్ని డ్యాన్సులు కడతన్నారో చూడండి. అకశేరుకాలు సార్, వీళ్ళు!

    ReplyDelete
  4. శ్రావ్య, అబ్రకదబ్ర, చదువరి గార్లకు ధన్యవాదాలు.

    ఈ రోజు గాంధీ భవన్ లో జరిగిన సంతాప సభలో కూడా అదే కనపడింది. హాజరైన కార్యకర్తల్లో ఏ ఒక్కరి ముఖంలోనూ సంతాపం కనపడ లేదు, ఎంత గట్టిగా అరవాలన్న తపనే తప్ప.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...