Skip to main content

ఎవరిదీ పాపం?

కర్నూలు మహబూబ్ నగర్ జిల్లాల్లో గత ఇరవై నాలుగ్గంటలుగా జరుగుతున్న దారుణ విలయం, అలాగే విజయవాడ, కృష్ణా గుంటూరు జిల్లాల్లో పొంచి వున్న ముప్పు కేవలం ప్రకృతి విలయం కాదనే విషయం హృదయాన్ని కలచి వేస్తుంది. ఈ పరిస్థితికి కారణం అహంకార పూరిత రాజకీయం, అధికారుల నిర్లక్ష్యం అని టీవీల్లో పేపర్లో వచ్చిన వార్తలను బట్టి తెలుస్తుంది. వాటిలో కొన్ని ఇక్కడ ఉదహరిస్తాను.

  • సుంకేసుల ఆనకట్ట నిండింది. అయినా గేట్లు తెరుచు కోకుండా మొరాయించాయి. ఫలితంగా మట్టికట్ట తెగిపోయి నీరు పొంగి పొర్లింది. ముందుగా కర్నూలు మునగడానికి ఇదే కారణం. వేసవి కాలం లో గేట్లకు సరియైన నిర్వహణ, పరిశీలన జరిపి వుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో.
  • శ్రీశైలం ప్రాజెక్టు పన్నెండవ గేటు ఇప్పటి వరకు తెరుచు కోలేదు. బాగా తుప్పు పట్టి తెరుచుకోక, ఒక ఉపకరణం విరిగి పొతే వెల్డింగు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదీ మన సన్నద్ధత. కొత్త ప్రాజెక్టులకు వేల కోట్లు కేటాయించ డానికి ఉబలాట పడే ప్రభుత్వం పాత ప్రాజెక్టులు, చెరువుల మరమ్మత్తులకు పైసా విదిలించటం లేదని ఆరోపణ.
  • నాగార్జున సాగర్ నీటిని నిలువ చేయడానికి ఉద్దేశించ బడింది. శ్రీశైలం ప్రాజెక్టు నీటిని నిలువ చేయ డానికి రూపొందించిన ప్రాజెక్టు కాదు. కేవలం జలవిద్యుత్తు కొరకై నిర్మించ బడింది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు రెండు కొండల మధ్య నిర్మించ బడింది. ప్రాజెక్టు పూర్తిగా నిండితే నీటిని వదల డానికి మట్టి కట్ట లేదు. పైగా నీరు నిండితే కర్నూలు మునిగి పోతుంది.
  • మన జల నిర్వహణ అసలు ప్రణాళిక ప్రకారం నాగార్జున సాగర్ ఎప్పుడూ నిండుగా ఉంచాలి, శ్రీశైలం ఎప్పుడూ నిండ నివ్వ కూడదు. కాని జరిగేది దీనికి విరుద్ధంగా వుంది.
  • పోతిరెడ్డి పాడు నిర్మాణం జరిగిన దరిమిలా శ్రీశైలం డ్యాములో మిగులు జలాలు ఉన్నాయని చూపించుకోవ డానికి గేట్లు ఎత్తడానికి కావలసిన కావలిసిన అధికారాల్ని ముఖ్య మంత్రి కార్యాలయం లో అట్టి పెట్టుకున్నారు. అలాగే నియమిత నీటి నిలువ పరిమితిని కూడా ప్రాజెక్టు నిర్మించినప్పుడు విధించిన పరిమితి కన్నా అధికంగా పెంచి వేశారు. ఇంజనీర్లు తీసుకోవలిసిన నిర్ణయాలు రాజకీయ నిర్ణయాలుగా మారి పోయాయి.
  • అలమట్టి, నారాయణ పూర్ డ్యాం లనుండి నీటిని వదులుతున్నట్టు మూడు రోజుల నుండే సంకేతాలున్నా శ్రీశైలం డ్యాం లో నీటి నిలువను తగ్గించ డానికి చర్యలు తీసుకోలేదు. ఖాళీగా ఉన్న నాగార్జున సాగర్ లోకి నీటిని ముందుగా వదిలి వుంటే పరిస్థితి వేరుగా వుండేది.
  • తప్పి పోయిన ముఖ్య మంత్రిని వెదక డానికి ఆఘ మేఘాల మీద హెలికాప్టర్లు, వెతికే విమానాలు, చివరికి అత్యాధునిక సుఖోయ్ యుద్ధ విమానాలు కూడా వచ్చాయి. లక్షల మంది ప్రజలు ప్రమాదంలో చిక్కు కున్నప్పుడు మాత్రం కనీసం హెలికాప్టర్లు కూడా జాడ లేవు. వచ్చిన హెలికాప్టర్లను కూడా ఇంధనం లేదని ఉపయోగించుకోలేక పోవడం కన్నా సిగ్గుచేటు లేదు.
  • ఇన్ని లక్షల మంది ప్రాణాలు ప్రమాదం లో పడ్డప్పుడు కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు గా ప్రకటించి, సహాయక చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహించడం చాలా బాధాకరమైన విషయం.

Comments

  1. అంతా చచ్చినోడి దయ అంటారు.

    ReplyDelete
  2. oremuna గారు

    ఒక్క ముక్కలో తేల్చేసారు!

    ReplyDelete
  3. ఈ పనికిమాలినవాళ్ళని ఆఫ్టరాల్ రెండొందల రూపాయల పింఛన్ల కోసం ఎన్నుకున్న బౌద్ధిక బడుద్ధాయిలున్నారు గదా ! వాళ్ళకి కళ్ళు తెఱిపించగలవారెవరైనా ఉంటే....

    సామూహిక పాపాన్ని సామూహికంగానే అనుభవించాలి ప్రజలు. అనుభవించనివ్వండి.

    --తాడేపల్లి

    ReplyDelete
  4. అవును నిజమే, ఎవరిది ఈ పాపం? చాలా బాగా విశ్లేషించారు.

    ReplyDelete
  5. ఆయన మొదటిసారి వచ్చాక
    -కనీస మట్టాన్ని (MDDL) 836 అడుగుల నుంచి 854కు పెంచేసాడు.
    -పోతిరెడ్డీపాడు రెగ్యులేటరును 11 వేల క్యూసెక్కుల నుంచి 44వేలకు పెంచే పని మొదలెట్టాడు.
    -సొంత కర్మాగారాలు మొదలెట్టాడు.

    సొంతలాభం సుంత కూడా మానుకోలేదు.

    ReplyDelete
  6. రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాల్ని రాజశేఖర్ రెడ్డి ఎలా కాలరాశాడనేది మెల్లమెల్లగా తెలుస్తుంది. ఇది మొదటిది మాత్రమే.

    ReplyDelete
  7. oremuna, LBS, AMMA ODI, చదువరి, కత్తి మహేష్ కుమార్ గార్ల కామెంట్లకు ధన్య వాదాలు.

    ReplyDelete
  8. చదువరి గారు,

    మీరిచ్చిన వివరాలకు ధన్య వాదాలు, అవి సరిగా గుర్తు రాక నేను వ్రాయ లేదు.

    ReplyDelete
  9. అన్నిటికన్నా పెద్ద పాపం మనదే - ఎడాపెడా చెట్లు నరికెయ్యడం. దీనివల్ల ప్రవాహానికి అడ్డులేకుండా పోయి ఊహించలేని వేగంతో నదుల్లో, వాగుల్లో నీరు చేరుతోంది.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

నల్ల జీవో

ప్రభుత్వం తాజాగా GO నెంబర్ 177 విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన తెలుపడానికి అనుసరించే పద్ధతులైన సమ్మె, టూల్ డౌన్, పెన్ డౌన్ తదితర ప్రక్రియల నిషేధిస్తూ నో వర్క్, నో పే అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక సందేహమేమిటంటే, ఇప్పటివరకూ పనిచేయక పోతే కూడా జీతాలిస్తున్నారా అని. పని చేయక పోటే ఎక్కడా జీతాలు ఉండవ్. అయితే సదరు ఉద్యోగి పనిచేయలేదని నిర్ధారించవలసి ఉంటుంది. దానికి కొంత ప్రక్రియ ఉంటుంది.  పని చేయకుండా వేతనం తీసుకోవాలని ఎవరూ అనుకోరు. అనుకున్నా అది ఇప్పటికే ఉన్న నిబంధనల వాళ్ళ సాధ్యం కాదు. కాని ప్రభుత్వం పై నిరసన తెలియజేయడానికి మాత్రం ఉద్యోగులు ఇలాంటి ప్రక్రియలను ఉపయోగించడం మామూలే. ఇలాంటి జీవోలవల్ల ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం  తీసుకోవచ్చు. ఉద్యోగుల జీతాలు ఆపి వేయవచ్చు. ఇదేమని ఎవరైనా అడిగితే జీవో కాపీలు చూపిస్తారు. ఇకపై ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, జీతాలు పెంచక పోయినా నిరసనలు తెలప కూడదన్న మాట. కేవలం విఙ్ఞప్తులు మాత్రమే చేసుకోవాలి. వింటే వింటారు, లేకపోతే లేదు. నిజమే, ప్రైవేటు ఉద్యోగాల్లో సమ్మెలకు ఎక్కువ వెసులు...

మనిషి దేవుడెలా అవుతున్నాడు?

మనిషి సంఘ జీవి. రాను రాను సంఘ జీవనానికి కొన్ని నియమాలు అవసరమయ్యాయి. అవే నియమాలు సమస్యలనూ సృష్టించాయి. ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కునే వారు కొందరు, ఇతరుల సహాయం కోరే వారు కొందరు. ఇలా ఉపదేశాలు తీసుకోవడం మొదలైంది. మనుషులలో కొందరు తెలివైన వారు ఉంటారు. వీరు తమ విజ్ఞానంతోనో, అనుభవంతోనో, మాటకారితనంతోనో ఇతరులను ప్రభావితం చేయ గలరు. అలాంటి వారు ఇతరులకి ఉపదేశాలివ్వడం మొదలు పెట్టారు. ఇలాంటి గురువులు మనకు పురాణాల్లో కొల్లలుగా కనబడతారు. మన పురాణాల్లో మహా మహిమాన్వితులు, గొప్పవారైన గురువులు లేదా ఋషుల గురించి చర్చించడం జరిగింది. చాలా సార్లు వారు దేవతలనే శపించగల శక్తివంతులుగా చిత్రింప బడ్డారు. కాని ఎక్కడా వారే దేవతలని చెప్పబడలేదు. వారు అలా ప్రకటించుకోలేదు కూడా. కానీ ఈరోజుల్లో వీధికొక బాబా నేనే భగవంతున్నని ప్రకటించుకోవడం లేదా తన శిష్య బృందంతో అన్యాపదేశంగా అనిపించుకోవడం సర్వ సామాన్యంగా మారి, మనకందరికీ దాదాపుగా అలవాటై పోయింది. ఒకప్పటి సప్తర్షులు, వారి శిష్య ప్రశిష్యులు కూడా భగవస్వరూపులు కాలేనప్పుడు, మరి ఈనాటి వీధి బాబాలు ఎలా ప్రత్యక్ష దైవాలు కాగలుగు తున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం. ఆలోచిస్తే...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...