Skip to main content

ముఖ్యమంత్రి నివాసం, వాస్తు.

పొద్దున్నే వార్త. ముఖ్యమంత్రి గారు క్యాంపు ఆఫీసు లోకి మార బోతున్నారు. శుభం. కాని పూర్తిగా కాదట. నివాసం ఇప్పుడు అమీర్ పేటలో ఉన్న స్వంత భవనం లోనేనట. కేవలం కార్యాలయం మాత్రమే క్యాంపు ఆఫీసు నుండి నడిపిస్తారట. ఇంతోటి దానికి అరవై లక్షల ప్రజా ధనం తగలేసి వాస్తు ప్రకారం మార్పు, చేర్పులు చేయించారు.

గతించిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కన్నా ముందు ముఖ్యమంత్రులు తమ నివాసాల నుండే పరిపాలన సాగించే వారు. లోపాయికారీగా ప్రభుత్వ డబ్బులతో తమ ఇళ్ళను కావలసిన విధంగా రిపేర్లు కూడా చేయించు కునేవారనుకోండి, అది వేరే సంగతి. చంద్రబాబు నాయుడు, యన్టీయార్ కూడా దీనికి మినహాయింపు కాదు.

రాజశేఖర రెడ్డి మాత్రం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్క క్షణం కూడా ఇంటికివెళ్ళ లేదు. ఏకాఎకి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మకాం పెట్టేసారు. యుద్ధ ప్రాతిపదిక పై ముఖ్యమంత్రి అధికార నివాస నిర్మాణం ప్రారంభించారు. దీనికోసం దాదాపు పది కోట్లవరకు ఖర్చు పెట్టారు. దీని ఖర్చు పైన కొన్నివిమర్శలు వచ్చినా ముఖ్యమంత్రి భద్రత, పాలనా సౌలభ్యం మొదలైన వాటి దృష్ట్యా ఎవరూ పెద్దగా వ్యతిరేకించలేదు.

కాని ఇప్పుడు రోశయ్య గారు స్వంత ఇంటిలో నివాసముంటూ అధికార గృహం నుంచి పరిపాలన సాగిస్తే, గతంలో ముఖ్యమంత్రి అధికార నివాసం ఆవశ్యకత గురించిన వివరణపై హేతుబద్ధత ఏమిటి? ఇది కోట్ల రూపాయల దుర్వినియోగం కాదా? ఈ డబ్బుని ఇతర కార్య క్రమాల కోసం వాడేవారు కాదా?

ఇప్పుడు ఈయన ప్రతిరోజూ ఇంటినుండి క్యాంపు ఆఫీసుకి, అక్కడి నుండి సెక్రెటేరియట్ కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా ఇల్లు, ఆఫీసు వేరు వేరుగా వాడు తుంటే రోజూ ఈ రెండిటి మధ్య తిరగ డానికి బోలెడంత ట్రాఫిక్ జాము అవుతుంది. ఈ అసౌకర్యాన్ని భారించాల్సింది ప్రజలే. ఈ ట్రాఫిక్ ని కంట్రోలు చేయడానికి ప్రతిరోజూ పోలీసులు అవస్థ పడాలి. ఇటు ఇంటికి, అటు క్యాంపు ఆఫీసుకి సెక్యూరిటీ కల్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం అదనపు బలగాలు కావాలి. ముఖ్యమంత్రి అంటే ఇరవై నాలుగ్గంటల ఉద్యోగం కాబట్టి వీడియో కాన్ఫరెన్సింగ్, కమ్యూనికేషన్ వసతులు ఆఫీసులో సరేసరి, ఇంటిలో కూడా కల్పించాల్సి ఉంటుంది. వీటి కోసం అదనపు ఖర్చు.

ఇవన్నీ ఒక ఎత్తయితే ముఖ్యమంత్రి మూఢ విశ్వాసాల కొరకై అరవై లక్షలు తగలేసి వాస్తు పేరిట రిపేర్లు చేయించడం ఇంకో ఎత్తు. పైగా ఈ భవనం కట్టి ఐదు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. ఒక వైపు రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందంటారు. ఆదాయం తగ్గిందంటారు. ఇలాంటి ఖర్చులకు మాత్రం నిధులు ఎలా ఊడి పడతాయో మరి! ఈ అరవై లక్షలు పెడితే అరవై మంది నిరు పేదలకు ఇందిరమ్మ గృహాలు ఇప్పించ వచ్చు. ఇరవై మంది పసికూనల గుండెలు ఆగిపోకుండా నివారించ వచ్చు.

అసలు వాస్తు విషయంలో మన రోడ్లు భవనాల శాఖ పాలసీ ఏమిటో ఎవరికీ అర్థం కాదు. ఈ శాఖ గృహ నిర్మాణాల విషయంలో వాస్తు నియమాలు పాటిస్తుందా, పాటించదా? ఒక వేళ పాటిస్తే, ఇప్పుడు ఈ మార్పులు ఎందుకు అవసర మయ్యాయి? కాల క్రమేణా వాస్తులో కూడా మార్పులు వస్తుంటాయా? ఒక వేళ వాస్తు పాటించదు అనుకుందాం. మరి ఏ నిబంధనల ప్రకారం ఈ మార్పులు చేశారు? ఇవన్నీ సమాధానాలు లేని ప్రశ్నలు.

Comments

  1. మంచి పాయింట్ ఫోకస్ చేసారు.

    ReplyDelete
  2. అమ్మ ఒడి గారు, ధన్యవాదాలు.

    ReplyDelete
  3. హరి దోర్నాల గారికి
    చాల మంచి వ్యాసం రాసారు. దీని సారంశాన్ని నా బ్లాగులో కుడా ఉంచుతాను.

    ReplyDelete
  4. కొడాలి గారు, ధన్యవాదాలు

    ReplyDelete
  5. బాగా అడిగారు. అసలు ముఖ్యమంత్రికి అధికార నివాసం ఉండగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఎక్కడెక్కడో ఉండి, అందుకు గాను ఈ అనవసరమైన ఖర్చులను మన నెత్తిన రుద్దుతున్నారు.

    ReplyDelete
  6. చదువరి గారు, ధన్యవాదాలు

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

తెలుగును పునరుజ్జీవింప జేద్దాం

భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం. ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి క్లిష్టమైన సంస్కృత సమాసాలను వాడుతున్నారు. దీనివల్ల ఒక భాష నుండి వేరొక భాషకు దాసోహం చెప్పడం తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. సంస్కృతం తన సహజరూపం లోనే మన లేక హిందీగా మారి ఉత్తర భారతంలో బ్రతుకుతుంది. అలాంటి సంస్కృత పదాలను అరువుతెచ్చుకుని తెలుగులో వ్యాప్తిలోకి తీసుకు రావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అవసరం లేదు కూడా. మన భాష ప్రస్తుత పరిస్థితికి ప్రబంధ సాహిత్యం తప్ప, సాంకేతిక పరమైన సాహిత్యం మనకు లేకపొవడం కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. పైగా మన పూర్వ కవులకు సంస్కృతం పై ఉన్న ఎనలేని మోజు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణం. అర్జునుడికి వంద పేర్లు ఉంటాయి. irrigation అనే పదానికి ఒక్క తెలుగు ...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...

కడప ఎన్నికలతో రాష్ట్ర భవితం తేలనుందా?

కడప పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాలలో జరుగుతున్న ఎన్నికలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును తేల్చేవిగా కనబడుతున్నాయి. అందుకే ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్రులు సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నారు. ఒక వైపు రాజశేఖర్ రెడ్డికి పెట్టని కోట లాంటిదైన జిల్లా. పైగా జగన్ కున్న ధనబలం, అంగబలం. కాంగ్రెస్ ధనబలం, అధికారబలం. వీటి మధ్య ఎంత తీవ్రమైన పోరు జరిగినా కూడా, జగన్ కే విజయావాకాశాలు లభించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఎలక్షన్ లో ఓటమి గాని సంభవిస్తే జగన్ పార్టీకి అది సమాధిగా మారుతుంది. ప్రజారాజ్యం పార్టీలా ఇతర పార్టీల్లో కలవడం తప్ప, మళ్ళీ కుదురుకోవడం కష్టం కావచ్చు. ఆ పక్షంలో కాంగ్రెస్ జగన్ని మరింత అణగదొక్కడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి BJP లో కలవ వచ్చు. కడపలో గెలిస్తే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం 2014 వరకు తిరుగుండదు.  ఒక వేళ ఈ ఎన్నికల్లో జగన్ గనక గెలిచినట్టయితే అది రాష్ట్ర ప్రభుత్వానికే కాక, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కూడా గొడ్డలి పెట్టుగా మారుటింది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చడానికి జగన్ ఒక్క నిముషం కూడా వృధా చేయడు. కాంగ్రెస్, తెలుగుదేశాల నుండి జగన్ పార్టీకి జోరుగా వలసలు ప...