Skip to main content

ముఖ్యమంత్రి నివాసం, వాస్తు.

పొద్దున్నే వార్త. ముఖ్యమంత్రి గారు క్యాంపు ఆఫీసు లోకి మార బోతున్నారు. శుభం. కాని పూర్తిగా కాదట. నివాసం ఇప్పుడు అమీర్ పేటలో ఉన్న స్వంత భవనం లోనేనట. కేవలం కార్యాలయం మాత్రమే క్యాంపు ఆఫీసు నుండి నడిపిస్తారట. ఇంతోటి దానికి అరవై లక్షల ప్రజా ధనం తగలేసి వాస్తు ప్రకారం మార్పు, చేర్పులు చేయించారు.

గతించిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కన్నా ముందు ముఖ్యమంత్రులు తమ నివాసాల నుండే పరిపాలన సాగించే వారు. లోపాయికారీగా ప్రభుత్వ డబ్బులతో తమ ఇళ్ళను కావలసిన విధంగా రిపేర్లు కూడా చేయించు కునేవారనుకోండి, అది వేరే సంగతి. చంద్రబాబు నాయుడు, యన్టీయార్ కూడా దీనికి మినహాయింపు కాదు.

రాజశేఖర రెడ్డి మాత్రం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్క క్షణం కూడా ఇంటికివెళ్ళ లేదు. ఏకాఎకి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మకాం పెట్టేసారు. యుద్ధ ప్రాతిపదిక పై ముఖ్యమంత్రి అధికార నివాస నిర్మాణం ప్రారంభించారు. దీనికోసం దాదాపు పది కోట్లవరకు ఖర్చు పెట్టారు. దీని ఖర్చు పైన కొన్నివిమర్శలు వచ్చినా ముఖ్యమంత్రి భద్రత, పాలనా సౌలభ్యం మొదలైన వాటి దృష్ట్యా ఎవరూ పెద్దగా వ్యతిరేకించలేదు.

కాని ఇప్పుడు రోశయ్య గారు స్వంత ఇంటిలో నివాసముంటూ అధికార గృహం నుంచి పరిపాలన సాగిస్తే, గతంలో ముఖ్యమంత్రి అధికార నివాసం ఆవశ్యకత గురించిన వివరణపై హేతుబద్ధత ఏమిటి? ఇది కోట్ల రూపాయల దుర్వినియోగం కాదా? ఈ డబ్బుని ఇతర కార్య క్రమాల కోసం వాడేవారు కాదా?

ఇప్పుడు ఈయన ప్రతిరోజూ ఇంటినుండి క్యాంపు ఆఫీసుకి, అక్కడి నుండి సెక్రెటేరియట్ కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా ఇల్లు, ఆఫీసు వేరు వేరుగా వాడు తుంటే రోజూ ఈ రెండిటి మధ్య తిరగ డానికి బోలెడంత ట్రాఫిక్ జాము అవుతుంది. ఈ అసౌకర్యాన్ని భారించాల్సింది ప్రజలే. ఈ ట్రాఫిక్ ని కంట్రోలు చేయడానికి ప్రతిరోజూ పోలీసులు అవస్థ పడాలి. ఇటు ఇంటికి, అటు క్యాంపు ఆఫీసుకి సెక్యూరిటీ కల్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం అదనపు బలగాలు కావాలి. ముఖ్యమంత్రి అంటే ఇరవై నాలుగ్గంటల ఉద్యోగం కాబట్టి వీడియో కాన్ఫరెన్సింగ్, కమ్యూనికేషన్ వసతులు ఆఫీసులో సరేసరి, ఇంటిలో కూడా కల్పించాల్సి ఉంటుంది. వీటి కోసం అదనపు ఖర్చు.

ఇవన్నీ ఒక ఎత్తయితే ముఖ్యమంత్రి మూఢ విశ్వాసాల కొరకై అరవై లక్షలు తగలేసి వాస్తు పేరిట రిపేర్లు చేయించడం ఇంకో ఎత్తు. పైగా ఈ భవనం కట్టి ఐదు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. ఒక వైపు రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందంటారు. ఆదాయం తగ్గిందంటారు. ఇలాంటి ఖర్చులకు మాత్రం నిధులు ఎలా ఊడి పడతాయో మరి! ఈ అరవై లక్షలు పెడితే అరవై మంది నిరు పేదలకు ఇందిరమ్మ గృహాలు ఇప్పించ వచ్చు. ఇరవై మంది పసికూనల గుండెలు ఆగిపోకుండా నివారించ వచ్చు.

అసలు వాస్తు విషయంలో మన రోడ్లు భవనాల శాఖ పాలసీ ఏమిటో ఎవరికీ అర్థం కాదు. ఈ శాఖ గృహ నిర్మాణాల విషయంలో వాస్తు నియమాలు పాటిస్తుందా, పాటించదా? ఒక వేళ పాటిస్తే, ఇప్పుడు ఈ మార్పులు ఎందుకు అవసర మయ్యాయి? కాల క్రమేణా వాస్తులో కూడా మార్పులు వస్తుంటాయా? ఒక వేళ వాస్తు పాటించదు అనుకుందాం. మరి ఏ నిబంధనల ప్రకారం ఈ మార్పులు చేశారు? ఇవన్నీ సమాధానాలు లేని ప్రశ్నలు.

Comments

  1. మంచి పాయింట్ ఫోకస్ చేసారు.

    ReplyDelete
  2. అమ్మ ఒడి గారు, ధన్యవాదాలు.

    ReplyDelete
  3. హరి దోర్నాల గారికి
    చాల మంచి వ్యాసం రాసారు. దీని సారంశాన్ని నా బ్లాగులో కుడా ఉంచుతాను.

    ReplyDelete
  4. కొడాలి గారు, ధన్యవాదాలు

    ReplyDelete
  5. బాగా అడిగారు. అసలు ముఖ్యమంత్రికి అధికార నివాసం ఉండగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఎక్కడెక్కడో ఉండి, అందుకు గాను ఈ అనవసరమైన ఖర్చులను మన నెత్తిన రుద్దుతున్నారు.

    ReplyDelete
  6. చదువరి గారు, ధన్యవాదాలు

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...