Skip to main content

నిర్వీర్య మవుతున్న పోలీసు వ్యవస్థ

"దుండగులు ఎంతటి వారైనా వదిలిపెట్ట వద్దని డీజీపీకి స్పష్టమైన ఆదేశాలిచ్చాం"

ఇవి శాంతి భద్రతల సమస్యలు వచ్చినప్పుడల్లా మన ముఖ్య మంత్రి గారు, లేక హోం మంత్రి గారు చెప్పే పడికట్టు పదాలు. అంటే ఏమిటి వీరి ఉద్దేశం? మామూలు పరిస్థితులలో ఎంతో కొంతటి వారైతే వదిలి పెడతారా? ఇప్పుడు మాత్రమే 'ఎంతటి వారైనా' వదిలి పెట్టకుండా శిక్షిస్తారా?

అసలు ఎవరిని విడిచి పెట్టాలి, ఎవరిని విడిచి పెట్టొద్దు అని డీజీపీకి వీరు చెప్పే అవసరం ఏమిటి? వీరు చెపితే కాని డీజీపీకి ఈవిషయాలు తెలియవా? ఈ ఒక్క వాక్యం చాలదూ ప్రతి విషయంలో రాజకీయులు పోలీసుల వ్యవహారాలలో ఎంత జోక్యం కలిగించు కుంటున్నారో తెలుసుకోవా డానికి!

"తప్పుచేసిన వారందరికీ  కఠినాతి కఠినమైన శిక్షలు విధించేలా చూస్తాం" 

ఇది నాయకులు ఎప్పుడూ ఉపయోగించే మరొక వాక్యం. అసలు పోలీసు శాఖ విధి ఏమిటి? తప్పు చేసిన వారిని పట్టుకొని కోర్టులకు నివేదించడం. కోర్టులో వారి తప్పులను నివేదించడం. కొందరికి కఠినాతి కఠినమైన శిక్షలు, కొందరికి మామూలు మామూలు శిక్షలు విధించ డానికి వెసులుబాటు ఏమైనా ఉందా? లేక తప్పును బట్టి అందరికీ ఒకే రకమైన శిక్షలు ఉంటాయా? వీరు మాట్లాడే మాటలతో ఇలాంటి అనుమానాలు వస్తుంటాయి.

నిజానికి వీరు మాట్లాడే దాంట్లో తప్పేమీ లేదు. వీరు ఏం చేస్తారో అవే మాట్లాడుతున్నారు. రాజ శేఖర్ రెడ్డి రెండో సారి అధికారం లోకి రాగానే మొహంతిని డీజీపీ పదవినుండి ఊడ బీకేసి యాదవ్ ని నియమించడం, రోశయ్య రాగానే ఆయనను పీకేసి ప్రస్తుత డీజీపీని నియమించడం అనే సంఘటనలు చాలు, పోలీసు విభాగంలో ఎన్ని రాజకీయాలు నడుస్తున్నాయనే విషయం తెలుసుకోవడానికి.

ఇక పోలీసులు కూడా తమ విధి నిర్వహణలో కాకుండా రాజకీయ నాయకుల మెప్పు ఎలా పొందాలా అనే విషయం లో ఎక్కువ చురుకుదనం చూపిస్తున్నారని అనిపిస్తుంది. పాత బస్తీలో రెండు వర్గాల వారు రాళ్ళు రువ్వుకున్న సంఘటన జరిగినా కూడా రెండు రోజుల వరకు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించారు. ఎలాంటి కవ్వింపు చర్యా లేకుండానే ఉస్మానియాలో రెండు వేల మంది పోలీసులను మొహరించి అత్యుత్సాహం చూపించిన డీజీపీ, కమీషనర్లు, ఈ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేసారో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదు. మొహంతి ఉండ వలసిన హోదాలో వీరు ఎందుకు ఉన్నారో అర్థమైతే చాలు, ఇది అర్థం చేసుకోవడానికి.

ఖాకీల పై ఖద్దరు చొక్కాల పెత్తనం కొనసాగినంత కాలం ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాదు అనే మాటలో అతిశయోక్తి లేదు.

Comments

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

నల్ల జీవో

ప్రభుత్వం తాజాగా GO నెంబర్ 177 విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన తెలుపడానికి అనుసరించే పద్ధతులైన సమ్మె, టూల్ డౌన్, పెన్ డౌన్ తదితర ప్రక్రియల నిషేధిస్తూ నో వర్క్, నో పే అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక సందేహమేమిటంటే, ఇప్పటివరకూ పనిచేయక పోతే కూడా జీతాలిస్తున్నారా అని. పని చేయక పోటే ఎక్కడా జీతాలు ఉండవ్. అయితే సదరు ఉద్యోగి పనిచేయలేదని నిర్ధారించవలసి ఉంటుంది. దానికి కొంత ప్రక్రియ ఉంటుంది.  పని చేయకుండా వేతనం తీసుకోవాలని ఎవరూ అనుకోరు. అనుకున్నా అది ఇప్పటికే ఉన్న నిబంధనల వాళ్ళ సాధ్యం కాదు. కాని ప్రభుత్వం పై నిరసన తెలియజేయడానికి మాత్రం ఉద్యోగులు ఇలాంటి ప్రక్రియలను ఉపయోగించడం మామూలే. ఇలాంటి జీవోలవల్ల ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం  తీసుకోవచ్చు. ఉద్యోగుల జీతాలు ఆపి వేయవచ్చు. ఇదేమని ఎవరైనా అడిగితే జీవో కాపీలు చూపిస్తారు. ఇకపై ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, జీతాలు పెంచక పోయినా నిరసనలు తెలప కూడదన్న మాట. కేవలం విఙ్ఞప్తులు మాత్రమే చేసుకోవాలి. వింటే వింటారు, లేకపోతే లేదు. నిజమే, ప్రైవేటు ఉద్యోగాల్లో సమ్మెలకు ఎక్కువ వెసులు...

మనిషి దేవుడెలా అవుతున్నాడు?

మనిషి సంఘ జీవి. రాను రాను సంఘ జీవనానికి కొన్ని నియమాలు అవసరమయ్యాయి. అవే నియమాలు సమస్యలనూ సృష్టించాయి. ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కునే వారు కొందరు, ఇతరుల సహాయం కోరే వారు కొందరు. ఇలా ఉపదేశాలు తీసుకోవడం మొదలైంది. మనుషులలో కొందరు తెలివైన వారు ఉంటారు. వీరు తమ విజ్ఞానంతోనో, అనుభవంతోనో, మాటకారితనంతోనో ఇతరులను ప్రభావితం చేయ గలరు. అలాంటి వారు ఇతరులకి ఉపదేశాలివ్వడం మొదలు పెట్టారు. ఇలాంటి గురువులు మనకు పురాణాల్లో కొల్లలుగా కనబడతారు. మన పురాణాల్లో మహా మహిమాన్వితులు, గొప్పవారైన గురువులు లేదా ఋషుల గురించి చర్చించడం జరిగింది. చాలా సార్లు వారు దేవతలనే శపించగల శక్తివంతులుగా చిత్రింప బడ్డారు. కాని ఎక్కడా వారే దేవతలని చెప్పబడలేదు. వారు అలా ప్రకటించుకోలేదు కూడా. కానీ ఈరోజుల్లో వీధికొక బాబా నేనే భగవంతున్నని ప్రకటించుకోవడం లేదా తన శిష్య బృందంతో అన్యాపదేశంగా అనిపించుకోవడం సర్వ సామాన్యంగా మారి, మనకందరికీ దాదాపుగా అలవాటై పోయింది. ఒకప్పటి సప్తర్షులు, వారి శిష్య ప్రశిష్యులు కూడా భగవస్వరూపులు కాలేనప్పుడు, మరి ఈనాటి వీధి బాబాలు ఎలా ప్రత్యక్ష దైవాలు కాగలుగు తున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం. ఆలోచిస్తే...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...