Skip to main content

మతం మంచిదా, చెడ్డదా?

మతం మంచిదా, చెడ్డదా అనే విషయం మీద రక రకాల చర్చలు జరుగుతున్నాయి. మంచి, చెడుల స్వభావం గూర్చి గతం లోనే ఒక వ్యాసం వ్రాసి ఉన్నాను. మంచి, లేదా చెడు అనేవి విశ్వంలో ముందే నిర్ణయించ బడి లేవు. అవి దేశ కాల పరిస్థితుల కనుగుణంగా మారుతుంటాయి. ఒక దృష్టి కోణం లోంచి మంచిగా కనపడిన విషయం మరో దృష్టి కోణం నుంచి చెడుగా కనపడేందుకు ఎంతైనా అవకాశం ఉంది.

ఇంతకీ మతమంటే ఏమిటి? మతమంటే ఒక మార్గం. ఒక జీవన విధానం. ఇప్పటి వరకు ఎన్నో మతాలు ఉద్భవించాయి, కొన్ని మతాలు స్థాపించ బడ్డాయి. చాలా మంది పుట్టుకతో మతాన్ని వారసత్వంగా పొందుతున్నారు. కొంతమంది ఇష్ట పడి మతాన్ని స్వీకరిస్తున్నారు.

దార్శనికులైన వ్యక్తులు తాము చూసిన ప్రపంచం లోని రకరకాల అవకరాల గురించి తీవ్రంగా ఆలోచించి కొన్ని నియమాలను ప్రతిపాదిస్తారు. ఈ నియమాలనే జనానికి ప్రభోధిస్తారు. ఎక్కువ మంది జనం ఈ నియమాలు నిజంగా తమ సమస్యలని పరిష్కరిస్తాయని భావించినప్పుడు వారంతా ఒక మతంగా మారటం మనం చరిత్ర ద్వారా తెలుసుకున్నాం. ఇలా ఏర్పడ్డ మతంలోని అనుయాయులు తరువాత తరంలో తమ మత సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేక దిశలో పయనించడం కూడా చూశాం. ఉదాహరణలు కోకొల్లలు. క్రీస్తు, 'తప్పు చేయని వాడు మొదటి రాయి విసరాల్సింది'గా తన అనుయాయులను కోరాడు. కాని తరువాత తరాల క్రిస్టియన్లు అన్య మతస్తులను రాళ్ళతో కొట్టి, సజీవ దహనాలకు పాల్పడి ఎలా హింసించారో మనం చూశాం.  

ఈవిధంగా మతం మహాపురుషుల సదాశాయాలతో ప్రారంభమైనప్పటికీ ఎలాంటి వికృత రూపలోకి మార్పు చెందగలదో చరిత్రను పరికిస్తే అర్థమౌతుంది. మతం సమూహశక్తిగా మారినప్పుడు, ఆ శక్తి అసాంఘిక శక్తుల నేత్రుత్వంలోకి వచ్చినప్పుడు దాని అసలు విధ్వంసక శక్తి బయట పడుతుంది. మతం అంటే మార్గంగా ముందే నిర్వచించు కున్నాం. నా దృష్టిలో ఆలోచనా రహిత సమూహశక్తిగా మారిన కమ్యూనిజం కూడా ఒక మతమే. సిద్ధాంతాలను తుంగలో తొక్కి అది పాల్పడిన దురాగతాలు కూడా మనం చరిత్రలో చూశాం.

ఇక పోతే ప్రతి మతం లోనూ కొన్ని నియమాలు ఉంటాయి. ఈ నియమాలు మతం పుట్టిన కాలంలో ఉన్న పరిస్థితుల వలన అప్పటి మేదావులైన ప్రవక్తలు హేతుబద్ధంగా ఆలోచించి నిర్ణయించినవిగా ఉంటాయి. ఆ కాలంలో ఆయా నిర్ణయాలు, నియమాలు మంచివి గా భావించి ఉండవచ్చు. అంత మాత్రాన అవి సార్వకాలీన సత్యాలుగా భావించ వలసిన అవసరం కనిపించదు. ఉదాహరణకి ఇస్లాం మతం లో నలుగురు భార్యలను పెళ్లి చెసుకోవడానికి అనుమతి ఉంది. బహుశా ఆ కాలంలో విపరీతమైన యుద్ధాల వలన పురుషులు మహిళల కన్నా తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు, సామాజిక సంబంధాలను కాపాడడానికి ఇలాంటి వెసులు బాటు కల్పించి ఉంటారు. ఆ కాలంలో మహిళలకు వెసులుబాటుగా ఉన్న ఈ అవకాశం, ఈనాడు వారి హక్కులకు భంగకరం కావడం చూస్తున్నాం. అలాగే పూర్వ కాలంలో మన దేశంలోని రాజులు, పరపతి గలవారు అధిక సంఖ్యలో భార్యలు కలిగి ఉండడం, ఆ కారణంగా కొందరికి వధువులు దొరక్క పోవడం వలన, దాన్ని కట్టడి చేయడానికి హిందూ మతంలో ఏక పత్నీవ్రతం విధించి ఉంటారు.   

అలాగే మనం అన్ని  మతాల లోనూ ఎన్నో రకాలైన ఆచారాలను చూస్తుంటాం. ఇవన్నీ సంబధిత కాలంలో ఎంతో అవసరమైనవీ, హేతుబద్ధంగా అలోచించి నిర్ణయించినవీ కావచ్చు. కానీ ప్రస్తుత కాలంలో ఆ ఆచారాలు కాని, సాంప్రదాయాలు కాని యదాతధంగా అనుసరించడం మంచిది కాక పోవచ్చు. ఎందుకంటే ముందే అనుకున్నాం మంచి లేదా సత్యం అనేది కాలాన్ని, పరిస్థితులను బట్టి మారుతుందని.

నా ఉద్దేశంలో పైన చెప్పిన అవకరాలన్నిటికీ కారణం ఒక్కటే. సత్యం లేదా మంచి అచంచల మైనదిగా (immutable) నమ్మడం. తమ ప్రవక్త, లేదా నాయకుడు చెప్పిందే సత్యమని నమ్మడం. తమ నమ్మకాలకు, విశ్వాసాలకు అతీతంగా కూడా సత్యం ఉండే అవకాశం ఉంటుందని ఒప్పుకో లేక పోవడం. తమ విశ్వాసాలకు విరుద్ధంగా ఆలోచించడం తమ పైన దాడిగా భావించడం. ఇలా నమ్మడం వలన తాము సత్యం అనుకున్న దాన్ని రక్షించ డానికి ఎంతకైనా తెగిస్తారు.

ఏ మతాధిపతి కూడా తమ 'ప్రవక్త, లేదా ఆది గురువు చెప్పింది పూర్తిగా సత్యం కాకపోవచ్చని, కేవలం సమకాలికంగానే సత్యం కావచ్చు' అనే విషయాన్ని ఒప్పుకోడు. అలా ఒప్పుకుంటే ప్రవక్తపై విశ్వాసం సన్నగిల్లి మతం మొత్తం కకావికలం అయిపోయే ప్రమాదం ఉంది.

సత్యం అచంచలమైనదిగా నమ్మడం వలన మన దృష్టిలో డానికి ఒక రకమైన పవిత్రత ఏర్పడు తుంది. అచంచల మైన దానికి విరుద్ధంగా తర్కించడం, దాన్ని ప్రశ్నించడం కూడా  దుస్సాహసంగా కనబడుతుంది. తమ విశ్వాసాలకు విరుద్ధంగా ఇతరులు  అభిప్రాయాలను వ్యక్తీకరించి నపుడు వారిపై శతృత్వ భావం కలుగు తుంది. 

ఎప్పుడైతే సత్యం జడపదార్థంగా కాక నిరంతరం మార్పు చెందే విషయంగా గుర్తిస్తామో, అప్పుడు దాని గురించి ఆలోచించగల, తర్కించ గల వెసులుబాటు కలగుతుంది. చర్చించడానికి సుహృద్భావ పూరితమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాంటి వాతావరణం అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది.   

Comments

  1. మీరు వ్రాసిన ప్రధానాంశంతో సంబంధం లేని ఒక అవాంతర విషయం గురించి నావీ రెండు పైసలు :

    హిందూ పురుషుడు ఎంతమంది స్త్రీలని చేసుకోవాలనే విషయమై హిందూ ధర్మశాస్త్రాలలో ఏ విధమైన నిర్దేశాలూ లేవు. కొద్దిమంది రామభక్తులు ఏకపత్నీవ్రతాన్ని ఒక ఆదర్శంగా ప్రచారంలోకి తెచ్చారు. కానీ రాములవారి అనంతరం చాలా యుగాలపాటు మన సమాజంలో బహుపత్నీకత్వం కొనసాగుతూనే ఉంది. మన ప్రస్తుత ఏకపత్నీవ్రత చట్టాలకు కారణం క్రైస్తవ రాజ్యాంగాల అనుసరణే తప్ప రామభక్తి కాదు. అయితే ఇప్పుడు కూడా మన హిందూసమాజంలో ఇద్దరు భార్యలతో కాపరం చేసేవాళ్ళు లక్షలాదిగా ఉన్నారు, చట్టం సంగతెలా ఉన్నా !

    ReplyDelete
  2. మతం గురించి రాసుకుంటూ మద్యలో కమ్యూనిజంపై అక్కసు వెళ్ళగక్కడం దేనికి. సమాజానికి శాస్త్రీయమైన ఆలోచననిచ్చింది కమ్యూనిజం. సమసమాజం గురించి ఆలోచించలేని వాళ్ళకు అలానే కనిపించవచ్చు.

    ReplyDelete
  3. ఓబుల్ రెడ్డి గారు,

    బహు భార్యత్వం పై మీరిచ్చిన సమాచారానికి ధన్యవాదాలు. సమకాలీన పరిస్థితుల కనుగుణంగానే మాట నియమాలు ఉంటాయి అని చెప్పడమే నా ఉద్దేశం.


    కేక్యూబ్ వర్మ గారు,

    కమ్యూనిజం పై నా కెలాంటి ద్వేషం లేదు. ఆలోచనారహిత సమూహశక్తిగా మారిన కమ్యూనిజంపై మాత్రమే నా అభ్యంతరం. కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చిన కొన్ని దేశాలలో జరిగిన మితిమీరిన వ్యక్తిపూజ, సామూహిక జనహననం వాస్తవాలు కాదంటారా?

    ReplyDelete
  4. ఇస్లాము నలుగురు భార్యలు అనుమతించడం పై నాకో సందేహం.
    నాలుగే ఎందుకు, ఆరో పదిహేడో ఎందుకు కాకూడదు? ఇస్లాము కొంత గమ్మతు గా చాలా సార్లు అంకెను quantify చేస్తుంది. జిహాదు చేస్తే 42 మంది కన్యలతో స్వర్గం లో గడపవచ్చు అని .
    ఈ అంకెలు బేరం జరిగి ఒక ఒప్పందానికి వచ్చినట్లు అనిపిస్తుంది.

    మతాల వల్ల ప్రధానం గా మంచే జరిగింది (?). మీరు అన్నట్లు మతం నియమాలను చెపుతుంది, మూల సూత్ర fundamental ) నియమాలు అన్ని మతాల్లోనూ అవే ఉంటాయి.
    సామజిక జీవనం సాఫీ గా సాగడానికి ఇది ఇంతో ముఖ్యం. కాకపోతే .. మిగతా నియమాల తోటే సమస్య.

    ReplyDelete
  5. tana manugadaku,jeevanaaniki,santhosaaniki sahakarinche ye mathannina,evaraina sweekarinchavachhu.manusyulandaru samaaname ane bhavanaku oka siddanthamgaa chebite adi communism.aacharanalo konthamandi manusyulu thamaswardamto thappulucheste adi communism thappu kaadu.gajula

    ReplyDelete
  6. @RaPaLa
    ఇస్లాం మతం భార్యల సంఖ్యను ఆరో పదిహేడో నుండి నలుగురికి కుదించింది.జిహాదు చేస్తే 42 మంది కన్యలతో స్వర్గంలో గడపవచ్చు అని ఖురాన్ లో లేదు.యుద్ధాల వలన పురుషులు మహిళల కన్నా తక్కువవుతారు.స్త్రీల భద్రత కోసమే ఇది కల్పించారు.ఈనాడు 99% ముస్లిములు ఎవరూ బహు భార్యాత్వాన్ని పాటించటంలేదు.కారణం ముస్లిం స్త్రీలు తమ హక్కులకు భంగం కలగకూడదని జాగృతం అయ్యారు.రెండో పెళ్ళాన్ని తెస్తే తిరగబడి కొడతారు కూడా.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ