Skip to main content

మతం మంచిదా, చెడ్డదా?

మతం మంచిదా, చెడ్డదా అనే విషయం మీద రక రకాల చర్చలు జరుగుతున్నాయి. మంచి, చెడుల స్వభావం గూర్చి గతం లోనే ఒక వ్యాసం వ్రాసి ఉన్నాను. మంచి, లేదా చెడు అనేవి విశ్వంలో ముందే నిర్ణయించ బడి లేవు. అవి దేశ కాల పరిస్థితుల కనుగుణంగా మారుతుంటాయి. ఒక దృష్టి కోణం లోంచి మంచిగా కనపడిన విషయం మరో దృష్టి కోణం నుంచి చెడుగా కనపడేందుకు ఎంతైనా అవకాశం ఉంది.

ఇంతకీ మతమంటే ఏమిటి? మతమంటే ఒక మార్గం. ఒక జీవన విధానం. ఇప్పటి వరకు ఎన్నో మతాలు ఉద్భవించాయి, కొన్ని మతాలు స్థాపించ బడ్డాయి. చాలా మంది పుట్టుకతో మతాన్ని వారసత్వంగా పొందుతున్నారు. కొంతమంది ఇష్ట పడి మతాన్ని స్వీకరిస్తున్నారు.

దార్శనికులైన వ్యక్తులు తాము చూసిన ప్రపంచం లోని రకరకాల అవకరాల గురించి తీవ్రంగా ఆలోచించి కొన్ని నియమాలను ప్రతిపాదిస్తారు. ఈ నియమాలనే జనానికి ప్రభోధిస్తారు. ఎక్కువ మంది జనం ఈ నియమాలు నిజంగా తమ సమస్యలని పరిష్కరిస్తాయని భావించినప్పుడు వారంతా ఒక మతంగా మారటం మనం చరిత్ర ద్వారా తెలుసుకున్నాం. ఇలా ఏర్పడ్డ మతంలోని అనుయాయులు తరువాత తరంలో తమ మత సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేక దిశలో పయనించడం కూడా చూశాం. ఉదాహరణలు కోకొల్లలు. క్రీస్తు, 'తప్పు చేయని వాడు మొదటి రాయి విసరాల్సింది'గా తన అనుయాయులను కోరాడు. కాని తరువాత తరాల క్రిస్టియన్లు అన్య మతస్తులను రాళ్ళతో కొట్టి, సజీవ దహనాలకు పాల్పడి ఎలా హింసించారో మనం చూశాం.  

ఈవిధంగా మతం మహాపురుషుల సదాశాయాలతో ప్రారంభమైనప్పటికీ ఎలాంటి వికృత రూపలోకి మార్పు చెందగలదో చరిత్రను పరికిస్తే అర్థమౌతుంది. మతం సమూహశక్తిగా మారినప్పుడు, ఆ శక్తి అసాంఘిక శక్తుల నేత్రుత్వంలోకి వచ్చినప్పుడు దాని అసలు విధ్వంసక శక్తి బయట పడుతుంది. మతం అంటే మార్గంగా ముందే నిర్వచించు కున్నాం. నా దృష్టిలో ఆలోచనా రహిత సమూహశక్తిగా మారిన కమ్యూనిజం కూడా ఒక మతమే. సిద్ధాంతాలను తుంగలో తొక్కి అది పాల్పడిన దురాగతాలు కూడా మనం చరిత్రలో చూశాం.

ఇక పోతే ప్రతి మతం లోనూ కొన్ని నియమాలు ఉంటాయి. ఈ నియమాలు మతం పుట్టిన కాలంలో ఉన్న పరిస్థితుల వలన అప్పటి మేదావులైన ప్రవక్తలు హేతుబద్ధంగా ఆలోచించి నిర్ణయించినవిగా ఉంటాయి. ఆ కాలంలో ఆయా నిర్ణయాలు, నియమాలు మంచివి గా భావించి ఉండవచ్చు. అంత మాత్రాన అవి సార్వకాలీన సత్యాలుగా భావించ వలసిన అవసరం కనిపించదు. ఉదాహరణకి ఇస్లాం మతం లో నలుగురు భార్యలను పెళ్లి చెసుకోవడానికి అనుమతి ఉంది. బహుశా ఆ కాలంలో విపరీతమైన యుద్ధాల వలన పురుషులు మహిళల కన్నా తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు, సామాజిక సంబంధాలను కాపాడడానికి ఇలాంటి వెసులు బాటు కల్పించి ఉంటారు. ఆ కాలంలో మహిళలకు వెసులుబాటుగా ఉన్న ఈ అవకాశం, ఈనాడు వారి హక్కులకు భంగకరం కావడం చూస్తున్నాం. అలాగే పూర్వ కాలంలో మన దేశంలోని రాజులు, పరపతి గలవారు అధిక సంఖ్యలో భార్యలు కలిగి ఉండడం, ఆ కారణంగా కొందరికి వధువులు దొరక్క పోవడం వలన, దాన్ని కట్టడి చేయడానికి హిందూ మతంలో ఏక పత్నీవ్రతం విధించి ఉంటారు.   

అలాగే మనం అన్ని  మతాల లోనూ ఎన్నో రకాలైన ఆచారాలను చూస్తుంటాం. ఇవన్నీ సంబధిత కాలంలో ఎంతో అవసరమైనవీ, హేతుబద్ధంగా అలోచించి నిర్ణయించినవీ కావచ్చు. కానీ ప్రస్తుత కాలంలో ఆ ఆచారాలు కాని, సాంప్రదాయాలు కాని యదాతధంగా అనుసరించడం మంచిది కాక పోవచ్చు. ఎందుకంటే ముందే అనుకున్నాం మంచి లేదా సత్యం అనేది కాలాన్ని, పరిస్థితులను బట్టి మారుతుందని.

నా ఉద్దేశంలో పైన చెప్పిన అవకరాలన్నిటికీ కారణం ఒక్కటే. సత్యం లేదా మంచి అచంచల మైనదిగా (immutable) నమ్మడం. తమ ప్రవక్త, లేదా నాయకుడు చెప్పిందే సత్యమని నమ్మడం. తమ నమ్మకాలకు, విశ్వాసాలకు అతీతంగా కూడా సత్యం ఉండే అవకాశం ఉంటుందని ఒప్పుకో లేక పోవడం. తమ విశ్వాసాలకు విరుద్ధంగా ఆలోచించడం తమ పైన దాడిగా భావించడం. ఇలా నమ్మడం వలన తాము సత్యం అనుకున్న దాన్ని రక్షించ డానికి ఎంతకైనా తెగిస్తారు.

ఏ మతాధిపతి కూడా తమ 'ప్రవక్త, లేదా ఆది గురువు చెప్పింది పూర్తిగా సత్యం కాకపోవచ్చని, కేవలం సమకాలికంగానే సత్యం కావచ్చు' అనే విషయాన్ని ఒప్పుకోడు. అలా ఒప్పుకుంటే ప్రవక్తపై విశ్వాసం సన్నగిల్లి మతం మొత్తం కకావికలం అయిపోయే ప్రమాదం ఉంది.

సత్యం అచంచలమైనదిగా నమ్మడం వలన మన దృష్టిలో డానికి ఒక రకమైన పవిత్రత ఏర్పడు తుంది. అచంచల మైన దానికి విరుద్ధంగా తర్కించడం, దాన్ని ప్రశ్నించడం కూడా  దుస్సాహసంగా కనబడుతుంది. తమ విశ్వాసాలకు విరుద్ధంగా ఇతరులు  అభిప్రాయాలను వ్యక్తీకరించి నపుడు వారిపై శతృత్వ భావం కలుగు తుంది. 

ఎప్పుడైతే సత్యం జడపదార్థంగా కాక నిరంతరం మార్పు చెందే విషయంగా గుర్తిస్తామో, అప్పుడు దాని గురించి ఆలోచించగల, తర్కించ గల వెసులుబాటు కలగుతుంది. చర్చించడానికి సుహృద్భావ పూరితమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాంటి వాతావరణం అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది.   

Comments

  1. మీరు వ్రాసిన ప్రధానాంశంతో సంబంధం లేని ఒక అవాంతర విషయం గురించి నావీ రెండు పైసలు :

    హిందూ పురుషుడు ఎంతమంది స్త్రీలని చేసుకోవాలనే విషయమై హిందూ ధర్మశాస్త్రాలలో ఏ విధమైన నిర్దేశాలూ లేవు. కొద్దిమంది రామభక్తులు ఏకపత్నీవ్రతాన్ని ఒక ఆదర్శంగా ప్రచారంలోకి తెచ్చారు. కానీ రాములవారి అనంతరం చాలా యుగాలపాటు మన సమాజంలో బహుపత్నీకత్వం కొనసాగుతూనే ఉంది. మన ప్రస్తుత ఏకపత్నీవ్రత చట్టాలకు కారణం క్రైస్తవ రాజ్యాంగాల అనుసరణే తప్ప రామభక్తి కాదు. అయితే ఇప్పుడు కూడా మన హిందూసమాజంలో ఇద్దరు భార్యలతో కాపరం చేసేవాళ్ళు లక్షలాదిగా ఉన్నారు, చట్టం సంగతెలా ఉన్నా !

    ReplyDelete
  2. మతం గురించి రాసుకుంటూ మద్యలో కమ్యూనిజంపై అక్కసు వెళ్ళగక్కడం దేనికి. సమాజానికి శాస్త్రీయమైన ఆలోచననిచ్చింది కమ్యూనిజం. సమసమాజం గురించి ఆలోచించలేని వాళ్ళకు అలానే కనిపించవచ్చు.

    ReplyDelete
  3. ఓబుల్ రెడ్డి గారు,

    బహు భార్యత్వం పై మీరిచ్చిన సమాచారానికి ధన్యవాదాలు. సమకాలీన పరిస్థితుల కనుగుణంగానే మాట నియమాలు ఉంటాయి అని చెప్పడమే నా ఉద్దేశం.


    కేక్యూబ్ వర్మ గారు,

    కమ్యూనిజం పై నా కెలాంటి ద్వేషం లేదు. ఆలోచనారహిత సమూహశక్తిగా మారిన కమ్యూనిజంపై మాత్రమే నా అభ్యంతరం. కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చిన కొన్ని దేశాలలో జరిగిన మితిమీరిన వ్యక్తిపూజ, సామూహిక జనహననం వాస్తవాలు కాదంటారా?

    ReplyDelete
  4. ఇస్లాము నలుగురు భార్యలు అనుమతించడం పై నాకో సందేహం.
    నాలుగే ఎందుకు, ఆరో పదిహేడో ఎందుకు కాకూడదు? ఇస్లాము కొంత గమ్మతు గా చాలా సార్లు అంకెను quantify చేస్తుంది. జిహాదు చేస్తే 42 మంది కన్యలతో స్వర్గం లో గడపవచ్చు అని .
    ఈ అంకెలు బేరం జరిగి ఒక ఒప్పందానికి వచ్చినట్లు అనిపిస్తుంది.

    మతాల వల్ల ప్రధానం గా మంచే జరిగింది (?). మీరు అన్నట్లు మతం నియమాలను చెపుతుంది, మూల సూత్ర fundamental ) నియమాలు అన్ని మతాల్లోనూ అవే ఉంటాయి.
    సామజిక జీవనం సాఫీ గా సాగడానికి ఇది ఇంతో ముఖ్యం. కాకపోతే .. మిగతా నియమాల తోటే సమస్య.

    ReplyDelete
  5. tana manugadaku,jeevanaaniki,santhosaaniki sahakarinche ye mathannina,evaraina sweekarinchavachhu.manusyulandaru samaaname ane bhavanaku oka siddanthamgaa chebite adi communism.aacharanalo konthamandi manusyulu thamaswardamto thappulucheste adi communism thappu kaadu.gajula

    ReplyDelete
  6. @RaPaLa
    ఇస్లాం మతం భార్యల సంఖ్యను ఆరో పదిహేడో నుండి నలుగురికి కుదించింది.జిహాదు చేస్తే 42 మంది కన్యలతో స్వర్గంలో గడపవచ్చు అని ఖురాన్ లో లేదు.యుద్ధాల వలన పురుషులు మహిళల కన్నా తక్కువవుతారు.స్త్రీల భద్రత కోసమే ఇది కల్పించారు.ఈనాడు 99% ముస్లిములు ఎవరూ బహు భార్యాత్వాన్ని పాటించటంలేదు.కారణం ముస్లిం స్త్రీలు తమ హక్కులకు భంగం కలగకూడదని జాగృతం అయ్యారు.రెండో పెళ్ళాన్ని తెస్తే తిరగబడి కొడతారు కూడా.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

నల్ల జీవో

ప్రభుత్వం తాజాగా GO నెంబర్ 177 విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన తెలుపడానికి అనుసరించే పద్ధతులైన సమ్మె, టూల్ డౌన్, పెన్ డౌన్ తదితర ప్రక్రియల నిషేధిస్తూ నో వర్క్, నో పే అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక సందేహమేమిటంటే, ఇప్పటివరకూ పనిచేయక పోతే కూడా జీతాలిస్తున్నారా అని. పని చేయక పోటే ఎక్కడా జీతాలు ఉండవ్. అయితే సదరు ఉద్యోగి పనిచేయలేదని నిర్ధారించవలసి ఉంటుంది. దానికి కొంత ప్రక్రియ ఉంటుంది.  పని చేయకుండా వేతనం తీసుకోవాలని ఎవరూ అనుకోరు. అనుకున్నా అది ఇప్పటికే ఉన్న నిబంధనల వాళ్ళ సాధ్యం కాదు. కాని ప్రభుత్వం పై నిరసన తెలియజేయడానికి మాత్రం ఉద్యోగులు ఇలాంటి ప్రక్రియలను ఉపయోగించడం మామూలే. ఇలాంటి జీవోలవల్ల ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం  తీసుకోవచ్చు. ఉద్యోగుల జీతాలు ఆపి వేయవచ్చు. ఇదేమని ఎవరైనా అడిగితే జీవో కాపీలు చూపిస్తారు. ఇకపై ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, జీతాలు పెంచక పోయినా నిరసనలు తెలప కూడదన్న మాట. కేవలం విఙ్ఞప్తులు మాత్రమే చేసుకోవాలి. వింటే వింటారు, లేకపోతే లేదు. నిజమే, ప్రైవేటు ఉద్యోగాల్లో సమ్మెలకు ఎక్కువ వెసులు...

మనిషి దేవుడెలా అవుతున్నాడు?

మనిషి సంఘ జీవి. రాను రాను సంఘ జీవనానికి కొన్ని నియమాలు అవసరమయ్యాయి. అవే నియమాలు సమస్యలనూ సృష్టించాయి. ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కునే వారు కొందరు, ఇతరుల సహాయం కోరే వారు కొందరు. ఇలా ఉపదేశాలు తీసుకోవడం మొదలైంది. మనుషులలో కొందరు తెలివైన వారు ఉంటారు. వీరు తమ విజ్ఞానంతోనో, అనుభవంతోనో, మాటకారితనంతోనో ఇతరులను ప్రభావితం చేయ గలరు. అలాంటి వారు ఇతరులకి ఉపదేశాలివ్వడం మొదలు పెట్టారు. ఇలాంటి గురువులు మనకు పురాణాల్లో కొల్లలుగా కనబడతారు. మన పురాణాల్లో మహా మహిమాన్వితులు, గొప్పవారైన గురువులు లేదా ఋషుల గురించి చర్చించడం జరిగింది. చాలా సార్లు వారు దేవతలనే శపించగల శక్తివంతులుగా చిత్రింప బడ్డారు. కాని ఎక్కడా వారే దేవతలని చెప్పబడలేదు. వారు అలా ప్రకటించుకోలేదు కూడా. కానీ ఈరోజుల్లో వీధికొక బాబా నేనే భగవంతున్నని ప్రకటించుకోవడం లేదా తన శిష్య బృందంతో అన్యాపదేశంగా అనిపించుకోవడం సర్వ సామాన్యంగా మారి, మనకందరికీ దాదాపుగా అలవాటై పోయింది. ఒకప్పటి సప్తర్షులు, వారి శిష్య ప్రశిష్యులు కూడా భగవస్వరూపులు కాలేనప్పుడు, మరి ఈనాటి వీధి బాబాలు ఎలా ప్రత్యక్ష దైవాలు కాగలుగు తున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం. ఆలోచిస్తే...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...