Skip to main content

రాష్ట్ర విభజన తప్పదా?

శ్రీక్రిష్ణ కమిటీ రిపోర్టు రానే వచ్చింది.

మొదటి సూచనగా రాష్ట్రం యధాతథంగా కొనసాగడం సాధ్యం కాదని కుండ బద్దలు కొట్టింది. ఈవిషయం ఇప్పటికైనా సమైక్యవాదులు గుర్తిస్తే మంచిది.

శ్రీక్రిష్ణ కమిటీ ఆరు సూచనలు చేసింది. అందులో నాలుగు ఆచరణసాధ్యం కాదని చెప్పింది. అది ఈ ఆరు సూచనలే ఎందుకు చేసిందనేది అంతు పట్టని తర్కం. ప్రజల నుండి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుందనుకుందామంటే,  ప్రజల్లోంచి ఇంకా చాలా సూచనలు వచ్చాయి. ఉదాహరణకు ప్రత్యేకాంధ్ర, ప్రత్యేక ఉత్తరాంధ్ర, ప్రత్యేక రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ, వన్యసీమ మొదలైనవి. వాటిని కూడా చర్చించి సాధ్యాసాధ్యాలు వ్యాఖ్యానించాలి కదా! అందులో కూడా గ్రేటర్ రాయలసీమ, ప్రత్యెక రాయలసీమ, ప్రత్యేక ఆంధ్ర (సీమ లేకుండా) అనేవి బలంగా వినిపించాయి. మరి వీటిని కనీసం చర్చించనైనా లేదెందుకు? వాటిని కూడా చర్చించి సాధ్యం కాదని నిర్ణయం చేసి ఉండవచ్చు కదా?

పోనీ, ఈ ఆరు సూచనలు చేసిందా అంటే, ఆరింట్లో నాలుగు పనికిరానివని తానే చెప్పింది. మరి పనికి రాని సూచనలు కమిటీ ఎందుకు చేస్తుంది? ఎవరిని గందరగోళంలో పడేద్దామని? నివేదిక ఈవిధంగా రావడం అంతుబట్టని చిదంబర రహస్యంగానే మిగిలి పోయింది.

తానే సూచనలు చేసి, వాటిని కొట్టివేసి, చివరకు రెండు సూచనలు మాత్రం మిగిల్చింది. అందులో ఒకటి (ఐదో సూచన) హైదరాబాదు రాజధానిగా తెలంగాణా విభజన. ఇక ఆరోది 1956 నాటి పెద్దమనుషుల ఒప్పందం ప్రాతిపదికగా తెలంగాణాకి ఒక  ప్రాంతీయ అబివృద్ధి కౌన్సిల్ ఏర్పాటు చేసి, దానికి రాజ్యాంగ బద్ధత కల్పించి తెలంగాణాకి ప్రత్యేక రక్షణలు కల్పిస్తూ సమైక్యాంధ్రని కొనసాగించడం.

ఆరో సూచనకు కమిటీ ప్రాధాన్యత నిచ్చినప్పటికీ, దానిలో పెద్దగా పస లేదనే విషయం చిన్న పిల్లవాడు కూడా చెపుతాడు. ఎందుకంటే ఈ సూచనలు కొత్తవి కావు. 1956 లో పెద్దమనుషుల ఒప్పందం వ్రాసుకున్నప్పుడు అమలు చేయాలని నిర్ణయించు కున్నవే. కానీ గడిచిన యాభై సంవత్సరాల కాలంలో అవి అమలు కావడం అసాధ్యం అని తేలిపోయింది.

మరి అమలు కాని సూచనలు ఎందుకు చేసినట్టు? రాష్ట్రం సమైక్యంగా ఉండి, తెలంగాణా ప్రయోజనాలు వీగిపోకుండా ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఉంటే, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందనే ఆలోచన కమిటీ వారికి ఉన్నట్టు తెలుస్తుంది. నిజానికి ఇలాంటి ఆలోచనతోటే కదా 1956 లో ఆంధ్రా, తెలంగాణాల మధ్యన ఒప్పందాలతో కూడిన విలీనం జరిగింది? ఇప్పుడు ఆ ఒప్పందాలన్నీ ఎంతకీ అమలు కాని ఎండమావులుగా మిగిలి పోయాయనే కదా మళ్ళీ విభజన కోరుతున్నది? మరి అటువంటప్పుడు పాతచింతకాయ పచ్చడినే మళ్ళీ వడ్డించడంలో ఔచిత్యం ఏమిటి?

శ్రీకృష్ణ కమిటీ వారు బంతిని మళ్ళీ కేంద్రం కోర్టులోకి తోసారని స్పష్టంగా తెలుస్తుంది. తెలంగాణా ప్రజలకు నమ్మకం కలిగించ గలిగిన రక్షణ వ్యవస్థ నెలకొల్ప గలిగినట్టైతే సమైఖ్యాంధ్ర కొనసాగించమని వారు సూచించారు. లేకపోతే వారు చెప్పిన రెండో ఆప్షను, విడిపోవడం ఎలాగూ ఉంది. అయితే ఇలాంటి రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయడాన్ని కూడా కొన్ని సీమాధ్ర శక్తులు వ్యతిరేకిస్తున్న విషయం గమనార్హం. అలాంటిది ఏర్పాటు చేస్తే, గతంలో అన్యాయాలు జరిగాయని ఒప్పుకున్నట్టు అవుతుందని వారు భావిస్తున్నారు.

యాభై ఏళ్ళుగా ఇలాంటి వ్యవస్థలు ఎలా పని చేస్తాయో స్పష్టంగా చూసిన తెలంగాణా వారు ఇలాంటి రక్షణ ఏర్పాట్లకు ఒప్పుకునే పరిస్థితిలో ఎలాగూ లేరు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి రెండు రాష్ట్రాలుగా విభజించడం తప్ప వేరే మార్గం లేదు. కాకపోతే కొత్త రాజధాని ఏర్పరచుకొనే వరకు కొన్ని సంవత్సరాలు హైదరాబాదుని ఆంధ్రా రాజధానిగా కూడా వాడుకునే వెసులుబాటు కల్పించ వచ్చు.

అలాగని ఏ చర్యా తీసుకోకుండా మిగతా మూడేళ్ళు గట్టెక్కే పరిస్థితి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఇంకా ఎక్కువగా నాన్చుడు ధోరణి అవలంబిస్తే తెలంగాణా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలకు దిగే అవకాశం ఉంది. ఆ పనే జరిగితే కేంద్ర ప్రభుత్వం సంగతెలా  ఉన్నా రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు జరిగితే, తెలంగాణలో kcr, ఆంధ్రాలో జగన్ clean sweep చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ అంత సులభంగా తనగొయ్యి తానే తొవ్వుకుంటుందని ఊహించడం కష్టం.

అయితే ఇప్పటిదాకా గోడమీదిపిల్లి ఆట రక్తి కట్టించిన కాంగ్రెస్ కి ఇక ముందు అంత సులభంగా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఫిబ్రవరిలో పార్లమెంటులో తెలంగాణా పై బిల్లు పెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తరువాత విభజన ప్రక్రియ ఎలాగూ రెండు మూడేళ్ళు పడుతుంది. తర్వాత ఎలక్షన్లు ఆధ్రాలో, తెలంగాణలో వేరువేరుగా జరిగేలా జాగ్రత్త పడితే సరి. తెలంగాణలో ఎలాగూ kcr తో జతగట్టి, తెలంగాణా ఇచ్చామని చెప్పుకొని కొన్ని సీట్లు గెలుస్తారు. ఇక చిరంజీవి సమైక్యవాదిగా ఆంధ్రాలో ఒక వెలుగు వెలిగేలా చేస్తారు. ఎలక్షన్లు దగ్గర పడ్డ తరువాత ప్రజారాజ్యాన్ని కాంగ్రేసులో విలీనం చేసుకునే అవకాశం ఎలాగూ ఉంది. చిరంజీవి సరిపోడేమో అనుకుంటే జగన్ ని సొంత గూటిలోకి ఆహ్వానించే అవకాశం కూడా కాదనలేం. విడిపోయిన రాష్ట్రంలో అధిష్టానాన్ని సవాలు చేసేంత శక్తి జగన్ కి ఉండదు.

ఒక వేళ సీమాంధ్ర ఎంపీలు రాజీనామా చేస్తే? అప్పుడు జగన్ ని అర్జంటుగా రంగంలోకి దింపాల్సి ఉంటుంది. జగన్ తెలంగాణా సమస్యపై ఇప్పటికీ తేల్చి చెప్పక పోవడం గమనించాల్సిన విషయం.

ఎలా చూసినా కూడా రాష్ట్రం విడిపోవడానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.

Comments

  1. మంచి విశ్లేషణ. ఎప్పుడయితే చిరును తిరుమల లో కలసి గంటల కొద్ది చర్చించి తనతో కాశయ్య, డిల్లీ పెద్దలు సమైక్యం అనిపించారో, అప్పుడే కాంగీ భవిష్యత్తు ఎత్తుగడలు బయట పడ్డాయి. కోస్తా, సీమల గొఱ్ఱెల కోసం మెగా జీరో గారు జెండా పీకి అయినా, పీకకుండానయినా కాంగీ కి మద్దతు కు రెడీ.

    ఇక తెలంగాణా వానిని కాక, కిరణ్ ను ముఖ్యమంత్రి ని చేసారో, అది ఇంకోసారి నిర్ధారణ అయ్యింది. ఇక దొర గారితో కె. శవరావు గారి మంతనాలు, దొరగారు కాంగీ ని బలపరుద్దాము అనే డవిలాగులు అన్నీ ఆ స్క్రిప్టు లో భాగమే అనిపిస్తుంది. తెలంగాణా గొఱ్ఱెలకోసం దొరగారు కాంగీ జత కట్టటం రెడీ.

    యువరాజా గారిదేముంది, అక్కడక్కడా ఇంకా కాస్త మిగిలి ఉన్న భూములన్నీ అమ్ముకోమని, బయ్యారం, సరస్వతి, ఓబులాపురాలకు అనుమతులు ఇస్తే చాలు. మరో లక్ష కోట్లు పైనే సంపాదించుకొని, వాటా మూటలు హాయిగా డిల్లీ పంపటానికి రెడీ.

    ఇక మిగిలింది డిల్లీ రాణి గారి execution మాత్రమే. వాటికన్ ను సంప్రదిస్తా ఉండి ఉంటారు, మంచి మహూర్తం కోసం :)

    ReplyDelete
  2. ధన్యవాదాలు కృష్ణ గారు,

    జగన్ స్పీడు చూస్తుంటే, రాష్ట్రంలో అతితొందరలో పెను మార్పులు సంభవిస్తాయనిపిస్తుంది.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

నల్ల జీవో

ప్రభుత్వం తాజాగా GO నెంబర్ 177 విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన తెలుపడానికి అనుసరించే పద్ధతులైన సమ్మె, టూల్ డౌన్, పెన్ డౌన్ తదితర ప్రక్రియల నిషేధిస్తూ నో వర్క్, నో పే అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక సందేహమేమిటంటే, ఇప్పటివరకూ పనిచేయక పోతే కూడా జీతాలిస్తున్నారా అని. పని చేయక పోటే ఎక్కడా జీతాలు ఉండవ్. అయితే సదరు ఉద్యోగి పనిచేయలేదని నిర్ధారించవలసి ఉంటుంది. దానికి కొంత ప్రక్రియ ఉంటుంది.  పని చేయకుండా వేతనం తీసుకోవాలని ఎవరూ అనుకోరు. అనుకున్నా అది ఇప్పటికే ఉన్న నిబంధనల వాళ్ళ సాధ్యం కాదు. కాని ప్రభుత్వం పై నిరసన తెలియజేయడానికి మాత్రం ఉద్యోగులు ఇలాంటి ప్రక్రియలను ఉపయోగించడం మామూలే. ఇలాంటి జీవోలవల్ల ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం  తీసుకోవచ్చు. ఉద్యోగుల జీతాలు ఆపి వేయవచ్చు. ఇదేమని ఎవరైనా అడిగితే జీవో కాపీలు చూపిస్తారు. ఇకపై ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, జీతాలు పెంచక పోయినా నిరసనలు తెలప కూడదన్న మాట. కేవలం విఙ్ఞప్తులు మాత్రమే చేసుకోవాలి. వింటే వింటారు, లేకపోతే లేదు. నిజమే, ప్రైవేటు ఉద్యోగాల్లో సమ్మెలకు ఎక్కువ వెసులు...

మనిషి దేవుడెలా అవుతున్నాడు?

మనిషి సంఘ జీవి. రాను రాను సంఘ జీవనానికి కొన్ని నియమాలు అవసరమయ్యాయి. అవే నియమాలు సమస్యలనూ సృష్టించాయి. ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కునే వారు కొందరు, ఇతరుల సహాయం కోరే వారు కొందరు. ఇలా ఉపదేశాలు తీసుకోవడం మొదలైంది. మనుషులలో కొందరు తెలివైన వారు ఉంటారు. వీరు తమ విజ్ఞానంతోనో, అనుభవంతోనో, మాటకారితనంతోనో ఇతరులను ప్రభావితం చేయ గలరు. అలాంటి వారు ఇతరులకి ఉపదేశాలివ్వడం మొదలు పెట్టారు. ఇలాంటి గురువులు మనకు పురాణాల్లో కొల్లలుగా కనబడతారు. మన పురాణాల్లో మహా మహిమాన్వితులు, గొప్పవారైన గురువులు లేదా ఋషుల గురించి చర్చించడం జరిగింది. చాలా సార్లు వారు దేవతలనే శపించగల శక్తివంతులుగా చిత్రింప బడ్డారు. కాని ఎక్కడా వారే దేవతలని చెప్పబడలేదు. వారు అలా ప్రకటించుకోలేదు కూడా. కానీ ఈరోజుల్లో వీధికొక బాబా నేనే భగవంతున్నని ప్రకటించుకోవడం లేదా తన శిష్య బృందంతో అన్యాపదేశంగా అనిపించుకోవడం సర్వ సామాన్యంగా మారి, మనకందరికీ దాదాపుగా అలవాటై పోయింది. ఒకప్పటి సప్తర్షులు, వారి శిష్య ప్రశిష్యులు కూడా భగవస్వరూపులు కాలేనప్పుడు, మరి ఈనాటి వీధి బాబాలు ఎలా ప్రత్యక్ష దైవాలు కాగలుగు తున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం. ఆలోచిస్తే...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...