Skip to main content

రాష్ట్ర విభజన తప్పదా?

శ్రీక్రిష్ణ కమిటీ రిపోర్టు రానే వచ్చింది.

మొదటి సూచనగా రాష్ట్రం యధాతథంగా కొనసాగడం సాధ్యం కాదని కుండ బద్దలు కొట్టింది. ఈవిషయం ఇప్పటికైనా సమైక్యవాదులు గుర్తిస్తే మంచిది.

శ్రీక్రిష్ణ కమిటీ ఆరు సూచనలు చేసింది. అందులో నాలుగు ఆచరణసాధ్యం కాదని చెప్పింది. అది ఈ ఆరు సూచనలే ఎందుకు చేసిందనేది అంతు పట్టని తర్కం. ప్రజల నుండి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుందనుకుందామంటే,  ప్రజల్లోంచి ఇంకా చాలా సూచనలు వచ్చాయి. ఉదాహరణకు ప్రత్యేకాంధ్ర, ప్రత్యేక ఉత్తరాంధ్ర, ప్రత్యేక రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ, వన్యసీమ మొదలైనవి. వాటిని కూడా చర్చించి సాధ్యాసాధ్యాలు వ్యాఖ్యానించాలి కదా! అందులో కూడా గ్రేటర్ రాయలసీమ, ప్రత్యెక రాయలసీమ, ప్రత్యేక ఆంధ్ర (సీమ లేకుండా) అనేవి బలంగా వినిపించాయి. మరి వీటిని కనీసం చర్చించనైనా లేదెందుకు? వాటిని కూడా చర్చించి సాధ్యం కాదని నిర్ణయం చేసి ఉండవచ్చు కదా?

పోనీ, ఈ ఆరు సూచనలు చేసిందా అంటే, ఆరింట్లో నాలుగు పనికిరానివని తానే చెప్పింది. మరి పనికి రాని సూచనలు కమిటీ ఎందుకు చేస్తుంది? ఎవరిని గందరగోళంలో పడేద్దామని? నివేదిక ఈవిధంగా రావడం అంతుబట్టని చిదంబర రహస్యంగానే మిగిలి పోయింది.

తానే సూచనలు చేసి, వాటిని కొట్టివేసి, చివరకు రెండు సూచనలు మాత్రం మిగిల్చింది. అందులో ఒకటి (ఐదో సూచన) హైదరాబాదు రాజధానిగా తెలంగాణా విభజన. ఇక ఆరోది 1956 నాటి పెద్దమనుషుల ఒప్పందం ప్రాతిపదికగా తెలంగాణాకి ఒక  ప్రాంతీయ అబివృద్ధి కౌన్సిల్ ఏర్పాటు చేసి, దానికి రాజ్యాంగ బద్ధత కల్పించి తెలంగాణాకి ప్రత్యేక రక్షణలు కల్పిస్తూ సమైక్యాంధ్రని కొనసాగించడం.

ఆరో సూచనకు కమిటీ ప్రాధాన్యత నిచ్చినప్పటికీ, దానిలో పెద్దగా పస లేదనే విషయం చిన్న పిల్లవాడు కూడా చెపుతాడు. ఎందుకంటే ఈ సూచనలు కొత్తవి కావు. 1956 లో పెద్దమనుషుల ఒప్పందం వ్రాసుకున్నప్పుడు అమలు చేయాలని నిర్ణయించు కున్నవే. కానీ గడిచిన యాభై సంవత్సరాల కాలంలో అవి అమలు కావడం అసాధ్యం అని తేలిపోయింది.

మరి అమలు కాని సూచనలు ఎందుకు చేసినట్టు? రాష్ట్రం సమైక్యంగా ఉండి, తెలంగాణా ప్రయోజనాలు వీగిపోకుండా ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఉంటే, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందనే ఆలోచన కమిటీ వారికి ఉన్నట్టు తెలుస్తుంది. నిజానికి ఇలాంటి ఆలోచనతోటే కదా 1956 లో ఆంధ్రా, తెలంగాణాల మధ్యన ఒప్పందాలతో కూడిన విలీనం జరిగింది? ఇప్పుడు ఆ ఒప్పందాలన్నీ ఎంతకీ అమలు కాని ఎండమావులుగా మిగిలి పోయాయనే కదా మళ్ళీ విభజన కోరుతున్నది? మరి అటువంటప్పుడు పాతచింతకాయ పచ్చడినే మళ్ళీ వడ్డించడంలో ఔచిత్యం ఏమిటి?

శ్రీకృష్ణ కమిటీ వారు బంతిని మళ్ళీ కేంద్రం కోర్టులోకి తోసారని స్పష్టంగా తెలుస్తుంది. తెలంగాణా ప్రజలకు నమ్మకం కలిగించ గలిగిన రక్షణ వ్యవస్థ నెలకొల్ప గలిగినట్టైతే సమైఖ్యాంధ్ర కొనసాగించమని వారు సూచించారు. లేకపోతే వారు చెప్పిన రెండో ఆప్షను, విడిపోవడం ఎలాగూ ఉంది. అయితే ఇలాంటి రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయడాన్ని కూడా కొన్ని సీమాధ్ర శక్తులు వ్యతిరేకిస్తున్న విషయం గమనార్హం. అలాంటిది ఏర్పాటు చేస్తే, గతంలో అన్యాయాలు జరిగాయని ఒప్పుకున్నట్టు అవుతుందని వారు భావిస్తున్నారు.

యాభై ఏళ్ళుగా ఇలాంటి వ్యవస్థలు ఎలా పని చేస్తాయో స్పష్టంగా చూసిన తెలంగాణా వారు ఇలాంటి రక్షణ ఏర్పాట్లకు ఒప్పుకునే పరిస్థితిలో ఎలాగూ లేరు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి రెండు రాష్ట్రాలుగా విభజించడం తప్ప వేరే మార్గం లేదు. కాకపోతే కొత్త రాజధాని ఏర్పరచుకొనే వరకు కొన్ని సంవత్సరాలు హైదరాబాదుని ఆంధ్రా రాజధానిగా కూడా వాడుకునే వెసులుబాటు కల్పించ వచ్చు.

అలాగని ఏ చర్యా తీసుకోకుండా మిగతా మూడేళ్ళు గట్టెక్కే పరిస్థితి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఇంకా ఎక్కువగా నాన్చుడు ధోరణి అవలంబిస్తే తెలంగాణా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలకు దిగే అవకాశం ఉంది. ఆ పనే జరిగితే కేంద్ర ప్రభుత్వం సంగతెలా  ఉన్నా రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు జరిగితే, తెలంగాణలో kcr, ఆంధ్రాలో జగన్ clean sweep చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ అంత సులభంగా తనగొయ్యి తానే తొవ్వుకుంటుందని ఊహించడం కష్టం.

అయితే ఇప్పటిదాకా గోడమీదిపిల్లి ఆట రక్తి కట్టించిన కాంగ్రెస్ కి ఇక ముందు అంత సులభంగా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఫిబ్రవరిలో పార్లమెంటులో తెలంగాణా పై బిల్లు పెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తరువాత విభజన ప్రక్రియ ఎలాగూ రెండు మూడేళ్ళు పడుతుంది. తర్వాత ఎలక్షన్లు ఆధ్రాలో, తెలంగాణలో వేరువేరుగా జరిగేలా జాగ్రత్త పడితే సరి. తెలంగాణలో ఎలాగూ kcr తో జతగట్టి, తెలంగాణా ఇచ్చామని చెప్పుకొని కొన్ని సీట్లు గెలుస్తారు. ఇక చిరంజీవి సమైక్యవాదిగా ఆంధ్రాలో ఒక వెలుగు వెలిగేలా చేస్తారు. ఎలక్షన్లు దగ్గర పడ్డ తరువాత ప్రజారాజ్యాన్ని కాంగ్రేసులో విలీనం చేసుకునే అవకాశం ఎలాగూ ఉంది. చిరంజీవి సరిపోడేమో అనుకుంటే జగన్ ని సొంత గూటిలోకి ఆహ్వానించే అవకాశం కూడా కాదనలేం. విడిపోయిన రాష్ట్రంలో అధిష్టానాన్ని సవాలు చేసేంత శక్తి జగన్ కి ఉండదు.

ఒక వేళ సీమాంధ్ర ఎంపీలు రాజీనామా చేస్తే? అప్పుడు జగన్ ని అర్జంటుగా రంగంలోకి దింపాల్సి ఉంటుంది. జగన్ తెలంగాణా సమస్యపై ఇప్పటికీ తేల్చి చెప్పక పోవడం గమనించాల్సిన విషయం.

ఎలా చూసినా కూడా రాష్ట్రం విడిపోవడానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.

Comments

  1. మంచి విశ్లేషణ. ఎప్పుడయితే చిరును తిరుమల లో కలసి గంటల కొద్ది చర్చించి తనతో కాశయ్య, డిల్లీ పెద్దలు సమైక్యం అనిపించారో, అప్పుడే కాంగీ భవిష్యత్తు ఎత్తుగడలు బయట పడ్డాయి. కోస్తా, సీమల గొఱ్ఱెల కోసం మెగా జీరో గారు జెండా పీకి అయినా, పీకకుండానయినా కాంగీ కి మద్దతు కు రెడీ.

    ఇక తెలంగాణా వానిని కాక, కిరణ్ ను ముఖ్యమంత్రి ని చేసారో, అది ఇంకోసారి నిర్ధారణ అయ్యింది. ఇక దొర గారితో కె. శవరావు గారి మంతనాలు, దొరగారు కాంగీ ని బలపరుద్దాము అనే డవిలాగులు అన్నీ ఆ స్క్రిప్టు లో భాగమే అనిపిస్తుంది. తెలంగాణా గొఱ్ఱెలకోసం దొరగారు కాంగీ జత కట్టటం రెడీ.

    యువరాజా గారిదేముంది, అక్కడక్కడా ఇంకా కాస్త మిగిలి ఉన్న భూములన్నీ అమ్ముకోమని, బయ్యారం, సరస్వతి, ఓబులాపురాలకు అనుమతులు ఇస్తే చాలు. మరో లక్ష కోట్లు పైనే సంపాదించుకొని, వాటా మూటలు హాయిగా డిల్లీ పంపటానికి రెడీ.

    ఇక మిగిలింది డిల్లీ రాణి గారి execution మాత్రమే. వాటికన్ ను సంప్రదిస్తా ఉండి ఉంటారు, మంచి మహూర్తం కోసం :)

    ReplyDelete
  2. ధన్యవాదాలు కృష్ణ గారు,

    జగన్ స్పీడు చూస్తుంటే, రాష్ట్రంలో అతితొందరలో పెను మార్పులు సంభవిస్తాయనిపిస్తుంది.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

తెలుగును పునరుజ్జీవింప జేద్దాం

భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం. ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి క్లిష్టమైన సంస్కృత సమాసాలను వాడుతున్నారు. దీనివల్ల ఒక భాష నుండి వేరొక భాషకు దాసోహం చెప్పడం తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. సంస్కృతం తన సహజరూపం లోనే మన లేక హిందీగా మారి ఉత్తర భారతంలో బ్రతుకుతుంది. అలాంటి సంస్కృత పదాలను అరువుతెచ్చుకుని తెలుగులో వ్యాప్తిలోకి తీసుకు రావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అవసరం లేదు కూడా. మన భాష ప్రస్తుత పరిస్థితికి ప్రబంధ సాహిత్యం తప్ప, సాంకేతిక పరమైన సాహిత్యం మనకు లేకపొవడం కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. పైగా మన పూర్వ కవులకు సంస్కృతం పై ఉన్న ఎనలేని మోజు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణం. అర్జునుడికి వంద పేర్లు ఉంటాయి. irrigation అనే పదానికి ఒక్క తెలుగు ...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...

కడప ఎన్నికలతో రాష్ట్ర భవితం తేలనుందా?

కడప పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాలలో జరుగుతున్న ఎన్నికలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును తేల్చేవిగా కనబడుతున్నాయి. అందుకే ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్రులు సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నారు. ఒక వైపు రాజశేఖర్ రెడ్డికి పెట్టని కోట లాంటిదైన జిల్లా. పైగా జగన్ కున్న ధనబలం, అంగబలం. కాంగ్రెస్ ధనబలం, అధికారబలం. వీటి మధ్య ఎంత తీవ్రమైన పోరు జరిగినా కూడా, జగన్ కే విజయావాకాశాలు లభించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఎలక్షన్ లో ఓటమి గాని సంభవిస్తే జగన్ పార్టీకి అది సమాధిగా మారుతుంది. ప్రజారాజ్యం పార్టీలా ఇతర పార్టీల్లో కలవడం తప్ప, మళ్ళీ కుదురుకోవడం కష్టం కావచ్చు. ఆ పక్షంలో కాంగ్రెస్ జగన్ని మరింత అణగదొక్కడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి BJP లో కలవ వచ్చు. కడపలో గెలిస్తే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం 2014 వరకు తిరుగుండదు.  ఒక వేళ ఈ ఎన్నికల్లో జగన్ గనక గెలిచినట్టయితే అది రాష్ట్ర ప్రభుత్వానికే కాక, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కూడా గొడ్డలి పెట్టుగా మారుటింది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చడానికి జగన్ ఒక్క నిముషం కూడా వృధా చేయడు. కాంగ్రెస్, తెలుగుదేశాల నుండి జగన్ పార్టీకి జోరుగా వలసలు ప...