Skip to main content

పద్యాలు: సమస్యా పూరణం

ఈ మధ్య నేను కంది శంకరయ్య గారి శంకరాభరణం బ్లాగులో పూరించిన సమస్యలు.

ఎరుపు వర్ణంలో చూపిన వరుస కంది శంకరయ్య గారిచే ఇవ్వబడిన సమస్యగా గుర్తించ గలరు.

కం.  మేలగు నాయకులెవ్వరు
చాలక డబ్బది యొసగెడి సైతానైనా
చాలను మన వోటరు పా
పాలే సజ్జనుల నెల్ల బతితుల జేయున్!

తే. గీ. చీమ పెరుగన్నమును తిని సేదదీరె
నంత లోపుగా జరిగెను వింత యొకటి
చీమ తుమ్మెను, బెదరెను సింహగణము
అదిరిపడి నిద్ర మేల్కొనెనంత చీమ!

తే. గీ. స్వర్ణ సింహాసనమ్మున శ్వాన మమరి
దేశమాతనే చేజార్చె దేహి యనుచు
తిరిగి స్వాతంత్ర్యమును తెచ్చె ధీరజనులు
స్వర్ణ సింహాసనమ్మున శ్వాన మమరె!

తే. గీ. బియ్యమును కొంద మనుకున్న భయ్యమయ్యె
కూరగాయల కొనుమాట నేరమయ్యె
ఉల్లిపాయల ధరజూడ ఉట్టి పైన
వచ్చె సంక్రాంతి లక్ష్మి యే మిచ్చె మనకు?

ఆ. వె. కాలు ముడిచి పట్టి కాసారమున నిల్చు
కొంగ కానుపించె కుంటివోలె
కుక్క వెంటపడగ కొంగ పరుగులెత్తె
కొంగ కైదు కాళ్ళు కోడికి వలె.

ఆ. వె. మకరజ్యోతి గాంచ సౌకర్యములులేని
శబరిమలకు వెడలి జనులు చావ
పన్నువేయు ప్రభుత పనితీరు మారదు
కస్తురి తిలకమ్ము గరళ మయ్యె!

తే. గీ. వందకోట్ల జనులు గూడి భరత భువిని
ఎన్నికల లోన గెలిపించి రెవరు వారు?
వారు మగ, ఆడ కానట్టి వారు; చూడ
భీష్ముఁడు శిఖండిని వరించి పెండ్లియాడె!

కం.  నవలోకపు అభిరుచులను
అవగాహన చేసికొమ్ము అతివా చూడన్
చవకే నైటీ; చీరయు
రవికెందుకు నీకు తరుణి రాతిరి వేళన్?

ఆ. వె. పగలు రాత్రి లేక ప్రాజెక్టు పనులంటు
మాట మంతి లేక మనసు గలిపి
అయిపు లేక వెడలె అంకోపరిని బట్టి
సాఫ్టువేరు మగని జాడఁ గనరె!

కం.  క్రొత్తల పండుగ కొరకై
దుత్తను బెట్టిన పలలము దొంగిలి తిని; మే
నత్తకు జెప్పెను మావటి
"మత్తెక్కిన భద్రగజము మాంసముఁ దినియెన్".

పై పద్యం అర్థం కానివారికోసం వివరణ:


రైతులు పంట నూర్పిళ్ళు జరిగినాక, ఇంటికి తెచ్చే ముందు పొలంలోనే చిన్న పండగ (క్రొత్తలు) చేస్తారు. క్రొత్త బియ్యంతొ పసుపన్నం వండి, మాంసంతొ గ్రామ దేవతకు ముందు నైవేద్యం పెడతారు. ఆ క్రమంలోనే ఒకావిడ నైవెద్యంకోసం మాంసం, అన్నం వండి, ఏదో పని రావడంతో పొలంలోకి వెళ్ళింది. ఈలోపు మావటిగా పని చేసే మేనల్లుడు ఏనుగెక్కి అటుగా వచ్చాడు. మాంసం వాసన చూసేసరికి తినాలనే ఆశ పుట్టి, మొత్తం తినేశాడు. ఇంతలో అత్త రానేవచ్చింది. సమాధానం ఏం చెప్పాలో తెలియని అల్లుడు చివరికి పై విధంగా తిక్క సమాధానం చెప్పాడు!

ఉ. ఉత్పలమాల లల్లమని ఊరక జెప్పరు శంకరార్యు లా
ఉత్పలమాల కుండవలె నో యతి నాల్గవ యక్షరమ్ముతో;
ఉత్పతనమ్ము నోపుదును, ఉత్పలమాలను ఎట్లు రాతు? నే
యుత్పలమాల యందు యతి యొప్పును నాల్గవ యక్షరమ్ముతో?

కం.  ఇలనష్టా వకృండట
తలలైదు కరంబులారు తనువది యొకటే!
తెలుపగ వైద్యులు వివరము
తలచితి నది జన్యులోప దైహికమనుచున్

కం.  చూడగ మనసున దోచును
గాడిదలకుఁ దెలియు కుసుమ గంధపు విలువల్;
గోడకు వేసిన పోస్టరు
వీడదు కత్రినది యైన బిరబిర దినగన్!

కం.  అడుగగ ఫీజుల కిచ్చితి
కొడుకునకున్ వేనవేలు; కూఁతున కొకటే
బిడియము, అడగదు ఏమీ;
వెడలెద నేనే బడికిని వివరము లడుగన్.

కం.  ఒద్దని వారంటున్నను
మద్దతు నిచ్చెద నటంచు మరిమరి యనుచున్
ప్రొద్దులు పుచ్చుచు గడిపెడు
దద్దమ్మల కీజగత్తు దండుగ కాదా?

ఉ. కోరరు డబ్బు దస్కములు కోరరు ఇంపగు విందు బోనముల్
కోరరు రాజ్య సంపదలు కోరరు మెత్తని పట్టు వస్త్రముల్
కోరరు మద్య మాంసములు కోరెద రొక్కటి మెచ్చుకోలు కై
బారులు; లేనిచో కవులు బావురు మందురు లోకమందునన్.

తే. గీ. విద్య నేర్చినవాఁడె పో వింతపశువు
అన్న పశువు బాధ పడుచు విన్నవించె
తాను సేవించు నీతిని తప్పకుండ
నేటి ఆస్థాన సచివుల నీతి గనరె!

కం.  చర్యకు తప్పక దగు ప్రతి
చర్య గలుగు; కావలసిన సంతకమునకై
కార్యార్థి మంత్రి వర్యుని
భార్యకు బ్రణ మిల్లె భక్తి భావము గుదురన్!

కం.  నరుడైనను కరియైనను
ఖరమైనను జీవులెల్ల కాటికి వెడలన్
హరి గలియు నంచు నొక్కడు
ఖర నామము సుతున కొసఁగెఁ గడు మోదమునన్.

కం.  ప్రతిదినము వరుస దప్పక
వ్రతములు జరిపించు వాడు వర్జ్యము రాగా
క్రతువు ముగించి చివరి హా
రతికై సోదరిని వేగ రమ్మని పిలిచెన్.

ఆ. వె. దున్న ఒకటి వచ్చి తిన్నదనుచు గడ్డి
పార్కు గార్డు వచ్చి బాదుచుండ
పద్యకవిత నాపి వచ్చి కాపాడగ
దున్న 'హరి'ని జూచి సన్నుతించె.

Comments

  1. పద్యాలు బాగున్నాయండి. ముఖ్యంగా చీర రవిక పద్యం అదిరిందండి.

    ReplyDelete
  2. వేదుల బాలకృష్ణమూర్తి గారు,

    ధన్యవాదాలు.

    ReplyDelete
  3. చర్చికి సందె వార్చుతకు సాయేబు వెళ్ళెను సత్వరమ్ము గన్!

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...