Skip to main content

కాకరాపల్లిలో మానవమేధం

గంగవరం, ముదిగొండ మరపుకైనా రాలేదు. సోంపేట నెత్తురు తడి ఆరనైనా ఆరలేదు, మళ్ళీ కాకరా పల్లిలో మానవమేధం. ప్రభుత్వాలు ప్రజల అవసరాలను తాకట్టు పెట్టి పెట్టుబడి దారుల పాదాలకు మడుగులోత్తే క్రమంలో ఇంకా ఇలాంటి ఘటనలు ఎన్ని చూడాల్సి ఉందో ఆలోచిస్తేనే భయం గొల్పుతుంది.



ఆ ప్రాంతపు ప్రజలు ప్రాణాలొడ్డి థర్మల్ ప్లాంటు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారంటేనే అది వారికి ఎంత నష్టదాయకమో చెప్పకనే చెపుతుంది. మరి అలాంటప్పుడు ప్రాజెక్టు అక్కడే పెట్టాలనే యావ ఈ ప్రభుత్వానికెందుకు? సమాధానం జగద్విదితం. ఆ ప్రాంతం పెట్టుబడి దారులకు అనుకూలమైనది. నీటి లభ్యత ఉంటుంది. పోర్టు దగ్గరగా ఉంటుంది. అనగా పెట్టుబడి దారునికి అధిక లాభాలు వస్తాయి. లోపాయికారీగా తమకు ఎక్కువ కమీషన్లు ముడుతాయి. అటువంటి పరిస్థితిలో ప్రభుత్వం పెట్టుబడి దారుడు చెప్పిన దానికి గంగిరెద్దులా తలూపడం తప్ప ప్రజల గురించి ఏమాలోచిస్తుంది?

అసలు రక్షణలన్నీ పెట్టుబడి దారునికేనా? ప్రజల కేమీ లేవా? అన్న సందేహం కలుగుతుంది. పంట భూములను నాశనం చేసి ఫ్యాక్టరీలు నిర్మించడం ఏమిటి? అలా నిర్మించడానికి రాష్ట్రంలో బీడు భూములు చాలా ఉన్నాయి. అక్కడ పనులు లేక ఎంతోమంది కార్మికులు ఉన్నారు. అలాంటి ప్రదేశాల్లో ఇలాంటి ప్రాజెక్టులు కడితే ఎవరూ అభ్యంతరం చెప్పారు, పైగా స్వాగతిస్తారు. పెట్టుబడి దారునికి కొన్ని అనుకూలతలు ఉంటే ఉండవచ్చు, కాని ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టే హక్కు ఈ ప్రభుత్వాల కెవరిచ్చారు?  

ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల్సింది పోయి తానే భక్షించడం మొదలు పెట్టింది. పర్యావరణం, పంట భూములు ఎలా నాశనం అయినా ఫరవాలేదు, కొంతమంది గుట్ట పెట్టుబడి దారులకు కోట్లు సమకూర్చే మహాయజ్ఞం నిర్విఘ్నంగా సాగితే చాలు అన్న పద్ధతిలో వ్యవహరిస్తుంది. ఈనాడు పౌరునికి తన భూమి, తన ఇల్లు పై హక్కు లేకుండా పోతుంది. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ప్రజల భూములు, ఇల్లు పద్ధతీ పాడూ లేకుండా ఒక్క కలంపోటుతో ప్రభుత్వం లాగేసుకునే పరిస్థితి. ఎవరైనా అడ్డం చెపితే తుపాకులు పైకి లేస్తాయి. తూటాలు స్వైర విహారం చేస్తాయి.

అసలు ఈ ప్రభుత్వాలకు ఇంతటి నిరంకుశమైన అధికారాలు ఎలా వచ్చాయి? రాజ్యాంగ లోపమా? దాని అమలులో లోపమా? ఏదైనప్పటికీ అది ప్రజలకు శాపంగా మారింది. తమ న్యాయమైన కోరికలు సాధించడానికి న్యాయస్థానంలో పోరాటం సాయపడడం లేదు. ప్రతి చిన్న విషయం పైనా ప్రత్యక్ష కార్యాచరణకు దిగి రక్తం చిందించాల్సి వస్తుంది.

ప్రజల్లో ఇంతటి వ్యతిరేకత ఉంటే, ప్రధాన ప్రతిపక్షం ఉద్యమంలో పాలు పంచుకుని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నించక తూతూ మంత్రపు స్టేట్మెంట్లు ఇవ్వడం దాని దోపిడీ మనస్తత్వాన్ని చెప్పకనే చెప్పుతుంది. నిజానికి ఏ పక్షమైనా అధికారం లో ఉన్నప్పుడు అదే భాష మాట్లాడడం గత పదిహేను సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. ఇలా పాలక పక్షాలు, ప్రతిపక్షాలు కుమ్మక్కై దేశాన్ని పందేరం చేస్తుంటే ప్రజలు ఈజిప్టు తరహా ఉద్యమం చేసి వీరిని దేశం నుండి తరిమి కొట్టడం తప్ప వేరే మార్గం లేదేమో ననిపిస్తుంది. 

Comments

  1. చిత్తడి భూములు (బురద నేలలు) దగ్గర థర్మల్ విద్యుత్ కేంద్రం కడితే ఆ భూములు ఎండిపోతాయని తెలియదా? ఈ జిల్లాలో వ్యవసాయానికి అంతగా యోగ్యం కాని మెట్ట భూములు ఉన్నాయి. పక్క జిల్లాలో కూడా ఉన్నాయి. ఒరిస్సాలోని తాల్చేర్ బొగ్గు గనులకి ఈ జిల్లాయే దగ్గర. అందుకే ఇక్కడే భారీ విద్యుత్ కేంద్రాలు పెట్టాలనుకుంటున్నారు.

    ReplyDelete
  2. ఇంకో సందేహం. బొగ్గు గనులకి దగ్గరగా ఉండడమే ముఖ్యం అనుకుంటే సింగరేణి బొగ్గు గనులు ఉన్న ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో థర్మల్ విద్యుత్ కేంద్రం పెట్టొచ్చు. తాల్చేర్ నుంచి దిగుమతి చేసే బొగ్గు కోసం ఉత్తరాంధ్రలో పెట్టడం ఎందుకు? ఒరిస్సాలో విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలు చాలా ఉన్నాయి. అక్కడ థర్మల్ విద్యుత్ కేంద్రాలు పెట్టకుండా అక్కడి బొగ్గుని ఇక్కడి థర్మల్ విద్యుత్ కేంద్రాలకి ఎలా అమ్ముతున్నారు?

    ReplyDelete
  3. సామాజిక నపుంసకులమై చూస్తున్నాం, ప్రజాస్వామ్యం అని చెబుతూ ప్రజల అనుమతి లేకుండా వారి ఆస్తుల్ని పక్కాగా లాగేసుకునే వెసులుబాటున్న ఆధునిక అద్భుతమైన వ్యవస్థని ఏమనాలో తెలియక ! ఈ రోజు కాకరాపల్లి. అది ఱేపు కూకట్‌పల్లే కావచ్చు. మన దాకా వస్తే గానీ తెలియదు. బేగం బజారులో ఒక గూండా పన్నెండు ఇళ్ళు కబ్జా చేశాడట. వాడికీ ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలకీ తేడా ఏంటో, మూడుసింహాల బొమ్మ తప్ప !

    విని చాలా బాధపడుతున్నాను, ఈ కార్పొరేటోక్రసీ గుఱించి !

    ReplyDelete
  4. ప్రవీణ్ శర్మ గారు,

    అలా పెట్టడం వెనుక వారి లెక్కలు వారికుంటాయి. వ్యాపారికి పైసా మిగలడమే ముఖ్యం. మిగతా విషయాలు పట్టవు. ఆ విషయం పట్టించుకోవలసింది ప్రభుత్వమే. అలాంటి ప్రభుత్వమే ఇప్పుడు దోషిగా నిలబడింది.

    తాడేపల్లి గారు,

    గూండా కబ్జా చేస్తే కనీసం ప్రభుత్వానికి మొర పెట్టుకోవచ్చు. ప్రభుత్వమే గూండాగా మారితే, ప్రజలు రోడ్లెక్కక తప్పదు.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

నల్ల జీవో

ప్రభుత్వం తాజాగా GO నెంబర్ 177 విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన తెలుపడానికి అనుసరించే పద్ధతులైన సమ్మె, టూల్ డౌన్, పెన్ డౌన్ తదితర ప్రక్రియల నిషేధిస్తూ నో వర్క్, నో పే అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక సందేహమేమిటంటే, ఇప్పటివరకూ పనిచేయక పోతే కూడా జీతాలిస్తున్నారా అని. పని చేయక పోటే ఎక్కడా జీతాలు ఉండవ్. అయితే సదరు ఉద్యోగి పనిచేయలేదని నిర్ధారించవలసి ఉంటుంది. దానికి కొంత ప్రక్రియ ఉంటుంది.  పని చేయకుండా వేతనం తీసుకోవాలని ఎవరూ అనుకోరు. అనుకున్నా అది ఇప్పటికే ఉన్న నిబంధనల వాళ్ళ సాధ్యం కాదు. కాని ప్రభుత్వం పై నిరసన తెలియజేయడానికి మాత్రం ఉద్యోగులు ఇలాంటి ప్రక్రియలను ఉపయోగించడం మామూలే. ఇలాంటి జీవోలవల్ల ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం  తీసుకోవచ్చు. ఉద్యోగుల జీతాలు ఆపి వేయవచ్చు. ఇదేమని ఎవరైనా అడిగితే జీవో కాపీలు చూపిస్తారు. ఇకపై ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, జీతాలు పెంచక పోయినా నిరసనలు తెలప కూడదన్న మాట. కేవలం విఙ్ఞప్తులు మాత్రమే చేసుకోవాలి. వింటే వింటారు, లేకపోతే లేదు. నిజమే, ప్రైవేటు ఉద్యోగాల్లో సమ్మెలకు ఎక్కువ వెసులు...

మనిషి దేవుడెలా అవుతున్నాడు?

మనిషి సంఘ జీవి. రాను రాను సంఘ జీవనానికి కొన్ని నియమాలు అవసరమయ్యాయి. అవే నియమాలు సమస్యలనూ సృష్టించాయి. ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కునే వారు కొందరు, ఇతరుల సహాయం కోరే వారు కొందరు. ఇలా ఉపదేశాలు తీసుకోవడం మొదలైంది. మనుషులలో కొందరు తెలివైన వారు ఉంటారు. వీరు తమ విజ్ఞానంతోనో, అనుభవంతోనో, మాటకారితనంతోనో ఇతరులను ప్రభావితం చేయ గలరు. అలాంటి వారు ఇతరులకి ఉపదేశాలివ్వడం మొదలు పెట్టారు. ఇలాంటి గురువులు మనకు పురాణాల్లో కొల్లలుగా కనబడతారు. మన పురాణాల్లో మహా మహిమాన్వితులు, గొప్పవారైన గురువులు లేదా ఋషుల గురించి చర్చించడం జరిగింది. చాలా సార్లు వారు దేవతలనే శపించగల శక్తివంతులుగా చిత్రింప బడ్డారు. కాని ఎక్కడా వారే దేవతలని చెప్పబడలేదు. వారు అలా ప్రకటించుకోలేదు కూడా. కానీ ఈరోజుల్లో వీధికొక బాబా నేనే భగవంతున్నని ప్రకటించుకోవడం లేదా తన శిష్య బృందంతో అన్యాపదేశంగా అనిపించుకోవడం సర్వ సామాన్యంగా మారి, మనకందరికీ దాదాపుగా అలవాటై పోయింది. ఒకప్పటి సప్తర్షులు, వారి శిష్య ప్రశిష్యులు కూడా భగవస్వరూపులు కాలేనప్పుడు, మరి ఈనాటి వీధి బాబాలు ఎలా ప్రత్యక్ష దైవాలు కాగలుగు తున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం. ఆలోచిస్తే...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...