Skip to main content

కాకరాపల్లిలో మానవమేధం

గంగవరం, ముదిగొండ మరపుకైనా రాలేదు. సోంపేట నెత్తురు తడి ఆరనైనా ఆరలేదు, మళ్ళీ కాకరా పల్లిలో మానవమేధం. ప్రభుత్వాలు ప్రజల అవసరాలను తాకట్టు పెట్టి పెట్టుబడి దారుల పాదాలకు మడుగులోత్తే క్రమంలో ఇంకా ఇలాంటి ఘటనలు ఎన్ని చూడాల్సి ఉందో ఆలోచిస్తేనే భయం గొల్పుతుంది.



ఆ ప్రాంతపు ప్రజలు ప్రాణాలొడ్డి థర్మల్ ప్లాంటు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారంటేనే అది వారికి ఎంత నష్టదాయకమో చెప్పకనే చెపుతుంది. మరి అలాంటప్పుడు ప్రాజెక్టు అక్కడే పెట్టాలనే యావ ఈ ప్రభుత్వానికెందుకు? సమాధానం జగద్విదితం. ఆ ప్రాంతం పెట్టుబడి దారులకు అనుకూలమైనది. నీటి లభ్యత ఉంటుంది. పోర్టు దగ్గరగా ఉంటుంది. అనగా పెట్టుబడి దారునికి అధిక లాభాలు వస్తాయి. లోపాయికారీగా తమకు ఎక్కువ కమీషన్లు ముడుతాయి. అటువంటి పరిస్థితిలో ప్రభుత్వం పెట్టుబడి దారుడు చెప్పిన దానికి గంగిరెద్దులా తలూపడం తప్ప ప్రజల గురించి ఏమాలోచిస్తుంది?

అసలు రక్షణలన్నీ పెట్టుబడి దారునికేనా? ప్రజల కేమీ లేవా? అన్న సందేహం కలుగుతుంది. పంట భూములను నాశనం చేసి ఫ్యాక్టరీలు నిర్మించడం ఏమిటి? అలా నిర్మించడానికి రాష్ట్రంలో బీడు భూములు చాలా ఉన్నాయి. అక్కడ పనులు లేక ఎంతోమంది కార్మికులు ఉన్నారు. అలాంటి ప్రదేశాల్లో ఇలాంటి ప్రాజెక్టులు కడితే ఎవరూ అభ్యంతరం చెప్పారు, పైగా స్వాగతిస్తారు. పెట్టుబడి దారునికి కొన్ని అనుకూలతలు ఉంటే ఉండవచ్చు, కాని ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టే హక్కు ఈ ప్రభుత్వాల కెవరిచ్చారు?  

ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల్సింది పోయి తానే భక్షించడం మొదలు పెట్టింది. పర్యావరణం, పంట భూములు ఎలా నాశనం అయినా ఫరవాలేదు, కొంతమంది గుట్ట పెట్టుబడి దారులకు కోట్లు సమకూర్చే మహాయజ్ఞం నిర్విఘ్నంగా సాగితే చాలు అన్న పద్ధతిలో వ్యవహరిస్తుంది. ఈనాడు పౌరునికి తన భూమి, తన ఇల్లు పై హక్కు లేకుండా పోతుంది. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ప్రజల భూములు, ఇల్లు పద్ధతీ పాడూ లేకుండా ఒక్క కలంపోటుతో ప్రభుత్వం లాగేసుకునే పరిస్థితి. ఎవరైనా అడ్డం చెపితే తుపాకులు పైకి లేస్తాయి. తూటాలు స్వైర విహారం చేస్తాయి.

అసలు ఈ ప్రభుత్వాలకు ఇంతటి నిరంకుశమైన అధికారాలు ఎలా వచ్చాయి? రాజ్యాంగ లోపమా? దాని అమలులో లోపమా? ఏదైనప్పటికీ అది ప్రజలకు శాపంగా మారింది. తమ న్యాయమైన కోరికలు సాధించడానికి న్యాయస్థానంలో పోరాటం సాయపడడం లేదు. ప్రతి చిన్న విషయం పైనా ప్రత్యక్ష కార్యాచరణకు దిగి రక్తం చిందించాల్సి వస్తుంది.

ప్రజల్లో ఇంతటి వ్యతిరేకత ఉంటే, ప్రధాన ప్రతిపక్షం ఉద్యమంలో పాలు పంచుకుని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నించక తూతూ మంత్రపు స్టేట్మెంట్లు ఇవ్వడం దాని దోపిడీ మనస్తత్వాన్ని చెప్పకనే చెప్పుతుంది. నిజానికి ఏ పక్షమైనా అధికారం లో ఉన్నప్పుడు అదే భాష మాట్లాడడం గత పదిహేను సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. ఇలా పాలక పక్షాలు, ప్రతిపక్షాలు కుమ్మక్కై దేశాన్ని పందేరం చేస్తుంటే ప్రజలు ఈజిప్టు తరహా ఉద్యమం చేసి వీరిని దేశం నుండి తరిమి కొట్టడం తప్ప వేరే మార్గం లేదేమో ననిపిస్తుంది. 

Comments

  1. చిత్తడి భూములు (బురద నేలలు) దగ్గర థర్మల్ విద్యుత్ కేంద్రం కడితే ఆ భూములు ఎండిపోతాయని తెలియదా? ఈ జిల్లాలో వ్యవసాయానికి అంతగా యోగ్యం కాని మెట్ట భూములు ఉన్నాయి. పక్క జిల్లాలో కూడా ఉన్నాయి. ఒరిస్సాలోని తాల్చేర్ బొగ్గు గనులకి ఈ జిల్లాయే దగ్గర. అందుకే ఇక్కడే భారీ విద్యుత్ కేంద్రాలు పెట్టాలనుకుంటున్నారు.

    ReplyDelete
  2. ఇంకో సందేహం. బొగ్గు గనులకి దగ్గరగా ఉండడమే ముఖ్యం అనుకుంటే సింగరేణి బొగ్గు గనులు ఉన్న ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో థర్మల్ విద్యుత్ కేంద్రం పెట్టొచ్చు. తాల్చేర్ నుంచి దిగుమతి చేసే బొగ్గు కోసం ఉత్తరాంధ్రలో పెట్టడం ఎందుకు? ఒరిస్సాలో విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలు చాలా ఉన్నాయి. అక్కడ థర్మల్ విద్యుత్ కేంద్రాలు పెట్టకుండా అక్కడి బొగ్గుని ఇక్కడి థర్మల్ విద్యుత్ కేంద్రాలకి ఎలా అమ్ముతున్నారు?

    ReplyDelete
  3. సామాజిక నపుంసకులమై చూస్తున్నాం, ప్రజాస్వామ్యం అని చెబుతూ ప్రజల అనుమతి లేకుండా వారి ఆస్తుల్ని పక్కాగా లాగేసుకునే వెసులుబాటున్న ఆధునిక అద్భుతమైన వ్యవస్థని ఏమనాలో తెలియక ! ఈ రోజు కాకరాపల్లి. అది ఱేపు కూకట్‌పల్లే కావచ్చు. మన దాకా వస్తే గానీ తెలియదు. బేగం బజారులో ఒక గూండా పన్నెండు ఇళ్ళు కబ్జా చేశాడట. వాడికీ ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలకీ తేడా ఏంటో, మూడుసింహాల బొమ్మ తప్ప !

    విని చాలా బాధపడుతున్నాను, ఈ కార్పొరేటోక్రసీ గుఱించి !

    ReplyDelete
  4. ప్రవీణ్ శర్మ గారు,

    అలా పెట్టడం వెనుక వారి లెక్కలు వారికుంటాయి. వ్యాపారికి పైసా మిగలడమే ముఖ్యం. మిగతా విషయాలు పట్టవు. ఆ విషయం పట్టించుకోవలసింది ప్రభుత్వమే. అలాంటి ప్రభుత్వమే ఇప్పుడు దోషిగా నిలబడింది.

    తాడేపల్లి గారు,

    గూండా కబ్జా చేస్తే కనీసం ప్రభుత్వానికి మొర పెట్టుకోవచ్చు. ప్రభుత్వమే గూండాగా మారితే, ప్రజలు రోడ్లెక్కక తప్పదు.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

తెలుగును పునరుజ్జీవింప జేద్దాం

భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం. ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి క్లిష్టమైన సంస్కృత సమాసాలను వాడుతున్నారు. దీనివల్ల ఒక భాష నుండి వేరొక భాషకు దాసోహం చెప్పడం తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. సంస్కృతం తన సహజరూపం లోనే మన లేక హిందీగా మారి ఉత్తర భారతంలో బ్రతుకుతుంది. అలాంటి సంస్కృత పదాలను అరువుతెచ్చుకుని తెలుగులో వ్యాప్తిలోకి తీసుకు రావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అవసరం లేదు కూడా. మన భాష ప్రస్తుత పరిస్థితికి ప్రబంధ సాహిత్యం తప్ప, సాంకేతిక పరమైన సాహిత్యం మనకు లేకపొవడం కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. పైగా మన పూర్వ కవులకు సంస్కృతం పై ఉన్న ఎనలేని మోజు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణం. అర్జునుడికి వంద పేర్లు ఉంటాయి. irrigation అనే పదానికి ఒక్క తెలుగు ...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...

కడప ఎన్నికలతో రాష్ట్ర భవితం తేలనుందా?

కడప పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాలలో జరుగుతున్న ఎన్నికలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును తేల్చేవిగా కనబడుతున్నాయి. అందుకే ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్రులు సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నారు. ఒక వైపు రాజశేఖర్ రెడ్డికి పెట్టని కోట లాంటిదైన జిల్లా. పైగా జగన్ కున్న ధనబలం, అంగబలం. కాంగ్రెస్ ధనబలం, అధికారబలం. వీటి మధ్య ఎంత తీవ్రమైన పోరు జరిగినా కూడా, జగన్ కే విజయావాకాశాలు లభించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఎలక్షన్ లో ఓటమి గాని సంభవిస్తే జగన్ పార్టీకి అది సమాధిగా మారుతుంది. ప్రజారాజ్యం పార్టీలా ఇతర పార్టీల్లో కలవడం తప్ప, మళ్ళీ కుదురుకోవడం కష్టం కావచ్చు. ఆ పక్షంలో కాంగ్రెస్ జగన్ని మరింత అణగదొక్కడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి BJP లో కలవ వచ్చు. కడపలో గెలిస్తే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం 2014 వరకు తిరుగుండదు.  ఒక వేళ ఈ ఎన్నికల్లో జగన్ గనక గెలిచినట్టయితే అది రాష్ట్ర ప్రభుత్వానికే కాక, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కూడా గొడ్డలి పెట్టుగా మారుటింది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చడానికి జగన్ ఒక్క నిముషం కూడా వృధా చేయడు. కాంగ్రెస్, తెలుగుదేశాల నుండి జగన్ పార్టీకి జోరుగా వలసలు ప...