Skip to main content

జయహో అన్నా హజారే

మన దేశానికి అవినీతి ఒక మానని గాయంలా తయారై సలుపుతుంది. యాభై రూపాయలకు ఆశపడి వోటు వేసే సామాన్యుడి నుండి ఐదువేల కోట్లు తీసుకుని సంతకం పెట్టే మంత్రి వరకు ఇది ఒక మహా విషవృక్షంలా తయారైంది. విత్తు ముందా, చెట్టు ముందా అన్నట్టు డబ్బు తీసుకోకుండా మార్పు ఎక్కడ మొదలు కావాలి, సామాన్యుడి లోనా, రాజకీయ నాయకుల లోనా అనేది ఒక తెగని సమస్యగా మారి పోయింది.

ఈ రోజున దాదాపు డెబ్బై అయిదు లక్షల కోట్ల డబ్బు అవినీతి పరుల చేతుల్లో పడి స్విస్స్ బ్యాంకుల్లో మూలుగుతుంది. ఈ డబ్బు గనక వినియోగంలోకి వస్తే దాదాపు ఐదు సంవత్సరాలు దేశ ప్రజలు ఎలాంటి టాక్సులు కట్టాల్సిన అవసరం ఉండదు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అవినీతిని నిర్మూలించాల్సిన ఆవశ్యకత ఎంతో.

ప్రతి ఏడూ లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపేణా వసూలు చేయ బడుతుంది. ఆపైన ఎన్నో కోట్ల రూపాయల దేశంలోని సహజవనరులకు ప్రభుత్వం ఆధిపత్యం వహిస్తుంది. ఇంతటి సంపదపై ఆధిపత్యం వహిస్తున్నపుడు, సంబధిత పాలకవర్గం ప్రలోభాలకు గురికావడం సహజమైన విషయం. అందుకనే అవినీతిని రూపు మాపడానికి అత్యంత శక్తి వంతమైన నిఘా, విచారణ సంస్థను ఏర్పాటు చేసి, సంబంధిత వ్యక్తులను శిక్షించడం తప్ప వేరే మార్గం లేదు.

అలా వచ్చిన ఆలోచనే లోక్ పాల్ వ్యవస్థ. నలభై రెండు సంవత్సరాల క్రితమే 1968 లోనే ఆమోదం పొందినా 1969 లో లోక్ సభ రద్దు కావడంతో మొదటిసారి లోక్ పాల్ బిల్లు మూలకు పడింది. ఆ తర్వాత 1971, 1977, 1985, 1989, 1996, 1998, 2001, 2005 మరియు 2008 లలో పార్లమెంటు ముందుకు వచ్చినా బలమైన లాబీలు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ఎప్పటికప్పుడు మరిన్ని మార్పులు కోరడం, బిల్లు శీతలమాలిగలోకి వెళ్ళడం యధావిధిగా జరిగి పోతుంది.


బయటికి మాత్రం అన్ని పార్టీల రాజకీయ నాయకులు లోక్ పాల్ వ్యవస్థ ఆవశ్యకతను సమర్థించే వారే. కాని లోలోపల మాత్రం రాజకీయ నాయకులెవరికీ ఈ బిల్లు అమలు కావడం ఇష్టం ఉండదన్న విషయం బహిరంగ రహస్యం. ఎవరు మాత్రం తమపై తామే నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు? అందుకనే గత నలభై రెండు సంవత్సరాలుగా బిల్లు అమలుకు నోచుకోకుండా ఉండిపోతుంది.

అసలు ఈ బిల్లు అమలు లోకి వస్తే మాత్రం ఎంతమేరకు అవినీతి అరికట్ట బడుతుంది అనేది మరో కోణం. ఇప్పుడు మన రాష్ట్రం లో ఉన్న లోకాయుక్త ఎంతమేరకు పనిచేస్తుందో చూస్తూనే ఉన్నాం. అధికారాలు లేని వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల దానిలోని సిబ్బందికి జీత భత్యాలు ఇవ్వడం తప్ప మరో ఉపయోగం ఉండదు. ఒక వేళ ప్రజల వత్తిడి ఎక్కువై బిల్లు ప్రవేశ పెట్టినా దాని కోరలు, పళ్ళూ కూడా ఊడబెరికి మన రాజకీయ నాయకులు బిల్లు ఆమోదిస్తారనే విషయంలో ఎవరికీ సందేహం అవసరం లేదు. 

కాబట్టి ఇప్పటికైనా బిల్లు విషయంలో ప్రజలంతా అప్రమత్తం అయి ఉద్యమించవలసిన అవసరం ఉంది. ఇందుకోసం ముందడుగు వేసిన అన్నాహజారే ఎంతైనా అభినంద నీయులు.  ఆయన నిన్నటినుండి లోక్ పాల్ బిల్లు అమలు కోసం ఆమరణ నిరాహార దీక్షకు కూచున్నారు.

అన్నాహజారేతో మొదలైన స్ఫూర్తి దేశం మొత్తం పాకి పోయి ఒక దావానలంగా మారిపోయి అవినీతి భూతాన్ని దహించి వేయాలని ఆశించడం ప్రస్తుతానికి అత్యాశే అయినా, దీని వల్ల దేశంలో అవినీతి పై చర్చ జరిగి ప్రజలు కొంత మేరకైనా చైతన్యవంతం కావాలని ఆశిద్దాం.


Comments

  1. very thoughtful post, and need of the hour.
    I hope citizens realizet he importance of this hunger strike and extend their support in what ever way they can.

    Thanks for the thought provoking write-up, Hari!

    ReplyDelete
  2. >>>>>>అధికారాలు లేని వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల దానిలోని సిబ్బందికి జీత భత్యాలు ఇవ్వడం తప్ప మరో ఉపయోగం ఉండదు. ఒక వేళ ప్రజల వత్తిడి ఎక్కువై బిల్లు ప్రవేశ పెట్టినా దాని కోరలు, పళ్ళూ కూడా ఊడబెరికి మన రాజకీయ నాయకులు బిల్లు ఆమోదిస్తారనే విషయంలో ఎవరికీ సందేహం అవసరం లేదు.>>>>

    నూటికి నూరుపాళ్ళు నిజం. చాలా మంచి టపా. ఆయన ప్రయత్నం సఫలం కావాలని ఆశిద్దాం.

    ReplyDelete
  3. శిశిర గారు, ధన్యవాదాలు.

    ReplyDelete
  4. అన్నా హజారే లాంటి యువ శక్తి ఆవశ్యకత మన దేశానికి ఎంతైనా ఉంది .......

    ReplyDelete
  5. ప్రవీణ్ శర్మగారూ మీ బ్లాగులో కొన్ని పోస్ట్ లు చదివాను. ఏవో నాలుగు ఆకతాయి మాటలు, అభిప్రాయాలు రాసి బ్లాగుల్ని కూడా ఫోరమ్స్ లా మార్చేస్తున్నారు కొందరు. బ్లాగ్ సాహిత్యాన్ని నిత్యం చూస్తానే కానీ మరీ డీప్ గా తీసుకునేంత అర్హత ఇంకా వాటికి రాలేదనే అభిప్రాయం నాకుంది. కానీ మీ బ్లాగుల్లాంటివి చూసినప్పుడు నా అభిప్రాయం మార్చుకుంటున్నాను. మీ శైలి, రాయడానికి మీరు ఎంచుకుంటున్న దృక్కోణం, రాతలో నిజాయతీ ... అన్నీ బాగున్నాయి. అన్ని పోస్టులూ చదవలేదు గానీ... స్థాలీపులాకంగా చదవగానే నాకు అనిపించింది ఇదీ... మీ కృషి అభినందనీయం.
    వక్కలంక కిషోర్

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...