Skip to main content

లోక్ పాల్ కమిటీ మరో తెలంగాణా కమిటీ అవుతుందా?

హజారే విజయంతో అవినీతిపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. లోక్ పాల్ బిల్లు ఎంతవరకు పాస్ అవుతుందో తెలియదు కాని అవినీతి పై దేశ ప్రజలు చర్చించేలా చేయగలిగినందుకు అన్నా ఎంతైనా అభినందనీయుడు.

అయితే హజారే దీక్షకు అంత సులభంగా కాంగ్రెస్ తలవొగ్గడం విచిత్రంగానే అనిపిస్తుంది. కాంగ్రెస్ స్వభావ సిద్ధంగా ఉద్యమాలకు, దీక్షలకు తలొగ్గే రకం కాదు. సమస్యలు నాన్చడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఇంతకన్నా పెద్ద ఉద్యమాలు ఎన్నో జరిగినా కూడా మిన్నకున్న చరిత్ర ఉంది ఈ ప్రభుత్వానికి. భవిష్యత్తులో ఉధృత రూపం దాల్చేదేమో కాని, సమస్యను పరిష్కరించే సమయానికి పట్టణాల్లో ప్రదర్శనలు తప్ప పెద్దగా ఉద్యమం కూడా ఏమీ కనిపించ లేదు. మరి హజారే నాలుగు రోజులు దీక్ష చేయగానే ప్రభుత్వం వారితో చర్చలు జరిపి ఒక అంగీకారానికి ఎలా వచ్చింది? 

సమస్యను పరిష్కరించడానికి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తారేమోనని అనుకున్నా కూడా అలాంటిదేమీ చేయలేదు.   తానొక్కటే మొత్తం క్రెడిట్ తీసుకోవాలనేమో, ఏక పక్షంగా ఆందోళన కారులతో చర్చలు జరిపింది. ఆ రెండువర్గాలు తప్ప మరే ఇతరులకు కూడా బిల్ డ్రాఫ్టు కమిటీలో ప్రాతినిధ్యం ఇవ్వలేదు.

2G, కామన్వెల్త్ మొదలైన కుంభకోణాలతో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట 'నానాటికి తీసికట్టు, నాగంభొట్లు' అన్నట్టుగా తయారయ్యింది. 2G పై, CVC ఎంపికపై ప్రధాన మంత్రిపైనే సుప్రీం అక్షింతలు పడ్డాయి. పులిమీద పుట్ర లాగా ఇప్పుడే ఐదు రాష్ట్రాల ఎన్నికలు వచ్చి పడ్డాయి. 

ఎటూ దిక్కు తోచకుండా ఉన్న కాంగ్రెస్ కు అన్నా దీక్ష అనుకోని వరంలా వచ్చి పడింది. అన్నాతో సంధి కుదుర్చుకోవడం ద్వారా తాము అవినీతి నిరోధకులమని ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారం చేసుకోవచ్చు. ఇక బిల్లు సంగతా, అది పార్లమెంటుకు వచ్చినప్పుడు చూసుకోవచ్చు. ఈ బిల్లు అమలు లోకి రావడం ఏ రాజకీయ పార్టీకి కూడా ఇష్టం ఉండదు. కాబట్టి అన్ని పార్టీలు కలిసి నానా కొర్రీలు పెట్టి ఎలాగూ అటకెక్కిస్తాయి. ఈలోపల క్రెడిట్ మనం కొట్టేయొచ్చు. ఇదే కాంగ్రెస్ ఆలోచనగా కనపడుతుంది.

కాంగ్రేస్ తెలివితేటలు లేటుగా తెలుసుకున్న బీజేపీ, వామపక్షాలు డ్రాఫ్టు కమిటీలో తమకు ప్రాతినిధ్యం లేకపోవడం పై ఇప్పుడు గుర్రుమంటున్నాయి. అయితే అవినీతిపై ఏనాడూ నిజాయితీగా ఉద్యమించని ఆ పార్టీలు గట్టిగా అడిగే నైతిక హక్కును కోల్పోయాయని చెప్పొచ్చు.

జన్ లోక్డ్ పాల్ బిల్లు డ్రాఫ్టు కమిటీ మెంబర్లు 
ప్రణభ్ ముఖర్జీ అధ్యక్షతలో ఈ కమిటీ మరో తెలంగాణా కమిటీ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. అలా జరిగినట్టయితే ఈ కళంకిత మీడియా ఇప్పుడు చేసినంత హడావుడి అప్పుడు కూడా చేస్తుందా అనేది అనుమానమే. ఏమైనప్పటికీ ఈ బిల్లు అమలులోకి వచ్చేదాకా దేశ ప్రజలు నిరంతర అప్రమత్తతతో మెలగాల్సి ఉంటుంది. లేకపోతే ఇంతే సంగతులు.            

Comments

  1. శ్రీకృష్ణ కమిటీ సభ్యులకి హొటెల్స్‌లో చాలా లగ్జరీ సౌకర్యాలు కల్పించారు. అందుకే శ్రీకృష్ణ కమిటీ ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక ఇచ్చింది. లోక్‌పాల్ పెట్టడం కంటే CBIకి ఉన్న అధికారాలు పెంచడం మేలు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చెయ్యలేక ట్రాన్స్‌ఫర్ చేసిన కేసులని మాత్రమే CBI దర్యాప్తు చేస్తుంది కానీ స్వతంత్రంగా కేసు నమోదు చేసే అధికారం CBIకి లేదు. CBIకి ఉన్న అధికారాలు పెంచితే కొత్త కమిటీలు వెయ్యాల్సిన ఖర్చు ఉండదు.

    ReplyDelete
  2. లోక్‌పాల్ బిల్‌కి మద్దతు ఇస్తున్నామంటూ బ్లాగుల్లో హడావుడి చేసినవాళ్ళు నిజంగా ఆ బిల్‌లో ఏముందో చదవలేదేమోనని నాకు అనుమానం. CBI అధికారులైనా నిజాయితీగా పని చేస్తారంటే నమ్మొచ్చు కానీ అధికార పార్టీ నియమించిన లోక్‌పాల్ కమిటీ నిజాయితీగా పని చేస్తుందంటే నమ్మడానికి చెవిలో పువ్వులు పెట్టుకోవాలి.

    ReplyDelete
  3. ప్రవీణ్ గారు,

    తెలంగాణా కమిటీ అంటే నేనన్నది ప్రణభ్ కమిటీ గురించి. ప్రణభ్ కమిటీ అంటే ఎడతెగని కమిటీ అని పేరుకదా! దీనికి కూడా ప్రణభ్ ముఖర్జీ చైర్మన్ గా ఉన్నారు. అందుకని అనుమానం వస్తుంది.

    ఒకవేళ లోక్పాల్ ఏర్పడితే CBI లోని అవినీతి వ్యతిరేక విభాగాన్ని లోక్‌పాల్‌లో విలీనం చేయవచ్చు. దానికి ఏయే అధికారాలు ఉండాలో నిర్ణయించేందుకే ఈ కమిటీ వేసారు. అది బిల్లుగా వస్తే ఆ అధికారాలు వస్తాయి. కాని ఇదంతా జరిగేదాకా నమ్మలేం, గత అనుభవాల దృష్ట్యా.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

నల్ల జీవో

ప్రభుత్వం తాజాగా GO నెంబర్ 177 విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన తెలుపడానికి అనుసరించే పద్ధతులైన సమ్మె, టూల్ డౌన్, పెన్ డౌన్ తదితర ప్రక్రియల నిషేధిస్తూ నో వర్క్, నో పే అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక సందేహమేమిటంటే, ఇప్పటివరకూ పనిచేయక పోతే కూడా జీతాలిస్తున్నారా అని. పని చేయక పోటే ఎక్కడా జీతాలు ఉండవ్. అయితే సదరు ఉద్యోగి పనిచేయలేదని నిర్ధారించవలసి ఉంటుంది. దానికి కొంత ప్రక్రియ ఉంటుంది.  పని చేయకుండా వేతనం తీసుకోవాలని ఎవరూ అనుకోరు. అనుకున్నా అది ఇప్పటికే ఉన్న నిబంధనల వాళ్ళ సాధ్యం కాదు. కాని ప్రభుత్వం పై నిరసన తెలియజేయడానికి మాత్రం ఉద్యోగులు ఇలాంటి ప్రక్రియలను ఉపయోగించడం మామూలే. ఇలాంటి జీవోలవల్ల ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం  తీసుకోవచ్చు. ఉద్యోగుల జీతాలు ఆపి వేయవచ్చు. ఇదేమని ఎవరైనా అడిగితే జీవో కాపీలు చూపిస్తారు. ఇకపై ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, జీతాలు పెంచక పోయినా నిరసనలు తెలప కూడదన్న మాట. కేవలం విఙ్ఞప్తులు మాత్రమే చేసుకోవాలి. వింటే వింటారు, లేకపోతే లేదు. నిజమే, ప్రైవేటు ఉద్యోగాల్లో సమ్మెలకు ఎక్కువ వెసులు...

మనిషి దేవుడెలా అవుతున్నాడు?

మనిషి సంఘ జీవి. రాను రాను సంఘ జీవనానికి కొన్ని నియమాలు అవసరమయ్యాయి. అవే నియమాలు సమస్యలనూ సృష్టించాయి. ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కునే వారు కొందరు, ఇతరుల సహాయం కోరే వారు కొందరు. ఇలా ఉపదేశాలు తీసుకోవడం మొదలైంది. మనుషులలో కొందరు తెలివైన వారు ఉంటారు. వీరు తమ విజ్ఞానంతోనో, అనుభవంతోనో, మాటకారితనంతోనో ఇతరులను ప్రభావితం చేయ గలరు. అలాంటి వారు ఇతరులకి ఉపదేశాలివ్వడం మొదలు పెట్టారు. ఇలాంటి గురువులు మనకు పురాణాల్లో కొల్లలుగా కనబడతారు. మన పురాణాల్లో మహా మహిమాన్వితులు, గొప్పవారైన గురువులు లేదా ఋషుల గురించి చర్చించడం జరిగింది. చాలా సార్లు వారు దేవతలనే శపించగల శక్తివంతులుగా చిత్రింప బడ్డారు. కాని ఎక్కడా వారే దేవతలని చెప్పబడలేదు. వారు అలా ప్రకటించుకోలేదు కూడా. కానీ ఈరోజుల్లో వీధికొక బాబా నేనే భగవంతున్నని ప్రకటించుకోవడం లేదా తన శిష్య బృందంతో అన్యాపదేశంగా అనిపించుకోవడం సర్వ సామాన్యంగా మారి, మనకందరికీ దాదాపుగా అలవాటై పోయింది. ఒకప్పటి సప్తర్షులు, వారి శిష్య ప్రశిష్యులు కూడా భగవస్వరూపులు కాలేనప్పుడు, మరి ఈనాటి వీధి బాబాలు ఎలా ప్రత్యక్ష దైవాలు కాగలుగు తున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం. ఆలోచిస్తే...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...