Skip to main content

లోక్ పాల్ కమిటీ మరో తెలంగాణా కమిటీ అవుతుందా?

హజారే విజయంతో అవినీతిపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. లోక్ పాల్ బిల్లు ఎంతవరకు పాస్ అవుతుందో తెలియదు కాని అవినీతి పై దేశ ప్రజలు చర్చించేలా చేయగలిగినందుకు అన్నా ఎంతైనా అభినందనీయుడు.

అయితే హజారే దీక్షకు అంత సులభంగా కాంగ్రెస్ తలవొగ్గడం విచిత్రంగానే అనిపిస్తుంది. కాంగ్రెస్ స్వభావ సిద్ధంగా ఉద్యమాలకు, దీక్షలకు తలొగ్గే రకం కాదు. సమస్యలు నాన్చడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఇంతకన్నా పెద్ద ఉద్యమాలు ఎన్నో జరిగినా కూడా మిన్నకున్న చరిత్ర ఉంది ఈ ప్రభుత్వానికి. భవిష్యత్తులో ఉధృత రూపం దాల్చేదేమో కాని, సమస్యను పరిష్కరించే సమయానికి పట్టణాల్లో ప్రదర్శనలు తప్ప పెద్దగా ఉద్యమం కూడా ఏమీ కనిపించ లేదు. మరి హజారే నాలుగు రోజులు దీక్ష చేయగానే ప్రభుత్వం వారితో చర్చలు జరిపి ఒక అంగీకారానికి ఎలా వచ్చింది? 

సమస్యను పరిష్కరించడానికి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తారేమోనని అనుకున్నా కూడా అలాంటిదేమీ చేయలేదు.   తానొక్కటే మొత్తం క్రెడిట్ తీసుకోవాలనేమో, ఏక పక్షంగా ఆందోళన కారులతో చర్చలు జరిపింది. ఆ రెండువర్గాలు తప్ప మరే ఇతరులకు కూడా బిల్ డ్రాఫ్టు కమిటీలో ప్రాతినిధ్యం ఇవ్వలేదు.

2G, కామన్వెల్త్ మొదలైన కుంభకోణాలతో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట 'నానాటికి తీసికట్టు, నాగంభొట్లు' అన్నట్టుగా తయారయ్యింది. 2G పై, CVC ఎంపికపై ప్రధాన మంత్రిపైనే సుప్రీం అక్షింతలు పడ్డాయి. పులిమీద పుట్ర లాగా ఇప్పుడే ఐదు రాష్ట్రాల ఎన్నికలు వచ్చి పడ్డాయి. 

ఎటూ దిక్కు తోచకుండా ఉన్న కాంగ్రెస్ కు అన్నా దీక్ష అనుకోని వరంలా వచ్చి పడింది. అన్నాతో సంధి కుదుర్చుకోవడం ద్వారా తాము అవినీతి నిరోధకులమని ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారం చేసుకోవచ్చు. ఇక బిల్లు సంగతా, అది పార్లమెంటుకు వచ్చినప్పుడు చూసుకోవచ్చు. ఈ బిల్లు అమలు లోకి రావడం ఏ రాజకీయ పార్టీకి కూడా ఇష్టం ఉండదు. కాబట్టి అన్ని పార్టీలు కలిసి నానా కొర్రీలు పెట్టి ఎలాగూ అటకెక్కిస్తాయి. ఈలోపల క్రెడిట్ మనం కొట్టేయొచ్చు. ఇదే కాంగ్రెస్ ఆలోచనగా కనపడుతుంది.

కాంగ్రేస్ తెలివితేటలు లేటుగా తెలుసుకున్న బీజేపీ, వామపక్షాలు డ్రాఫ్టు కమిటీలో తమకు ప్రాతినిధ్యం లేకపోవడం పై ఇప్పుడు గుర్రుమంటున్నాయి. అయితే అవినీతిపై ఏనాడూ నిజాయితీగా ఉద్యమించని ఆ పార్టీలు గట్టిగా అడిగే నైతిక హక్కును కోల్పోయాయని చెప్పొచ్చు.

జన్ లోక్డ్ పాల్ బిల్లు డ్రాఫ్టు కమిటీ మెంబర్లు 
ప్రణభ్ ముఖర్జీ అధ్యక్షతలో ఈ కమిటీ మరో తెలంగాణా కమిటీ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. అలా జరిగినట్టయితే ఈ కళంకిత మీడియా ఇప్పుడు చేసినంత హడావుడి అప్పుడు కూడా చేస్తుందా అనేది అనుమానమే. ఏమైనప్పటికీ ఈ బిల్లు అమలులోకి వచ్చేదాకా దేశ ప్రజలు నిరంతర అప్రమత్తతతో మెలగాల్సి ఉంటుంది. లేకపోతే ఇంతే సంగతులు.            

Comments

  1. శ్రీకృష్ణ కమిటీ సభ్యులకి హొటెల్స్‌లో చాలా లగ్జరీ సౌకర్యాలు కల్పించారు. అందుకే శ్రీకృష్ణ కమిటీ ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక ఇచ్చింది. లోక్‌పాల్ పెట్టడం కంటే CBIకి ఉన్న అధికారాలు పెంచడం మేలు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చెయ్యలేక ట్రాన్స్‌ఫర్ చేసిన కేసులని మాత్రమే CBI దర్యాప్తు చేస్తుంది కానీ స్వతంత్రంగా కేసు నమోదు చేసే అధికారం CBIకి లేదు. CBIకి ఉన్న అధికారాలు పెంచితే కొత్త కమిటీలు వెయ్యాల్సిన ఖర్చు ఉండదు.

    ReplyDelete
  2. లోక్‌పాల్ బిల్‌కి మద్దతు ఇస్తున్నామంటూ బ్లాగుల్లో హడావుడి చేసినవాళ్ళు నిజంగా ఆ బిల్‌లో ఏముందో చదవలేదేమోనని నాకు అనుమానం. CBI అధికారులైనా నిజాయితీగా పని చేస్తారంటే నమ్మొచ్చు కానీ అధికార పార్టీ నియమించిన లోక్‌పాల్ కమిటీ నిజాయితీగా పని చేస్తుందంటే నమ్మడానికి చెవిలో పువ్వులు పెట్టుకోవాలి.

    ReplyDelete
  3. ప్రవీణ్ గారు,

    తెలంగాణా కమిటీ అంటే నేనన్నది ప్రణభ్ కమిటీ గురించి. ప్రణభ్ కమిటీ అంటే ఎడతెగని కమిటీ అని పేరుకదా! దీనికి కూడా ప్రణభ్ ముఖర్జీ చైర్మన్ గా ఉన్నారు. అందుకని అనుమానం వస్తుంది.

    ఒకవేళ లోక్పాల్ ఏర్పడితే CBI లోని అవినీతి వ్యతిరేక విభాగాన్ని లోక్‌పాల్‌లో విలీనం చేయవచ్చు. దానికి ఏయే అధికారాలు ఉండాలో నిర్ణయించేందుకే ఈ కమిటీ వేసారు. అది బిల్లుగా వస్తే ఆ అధికారాలు వస్తాయి. కాని ఇదంతా జరిగేదాకా నమ్మలేం, గత అనుభవాల దృష్ట్యా.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ