Skip to main content

లోక్ పాల్ కమిటీ మరో తెలంగాణా కమిటీ అవుతుందా?

హజారే విజయంతో అవినీతిపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. లోక్ పాల్ బిల్లు ఎంతవరకు పాస్ అవుతుందో తెలియదు కాని అవినీతి పై దేశ ప్రజలు చర్చించేలా చేయగలిగినందుకు అన్నా ఎంతైనా అభినందనీయుడు.

అయితే హజారే దీక్షకు అంత సులభంగా కాంగ్రెస్ తలవొగ్గడం విచిత్రంగానే అనిపిస్తుంది. కాంగ్రెస్ స్వభావ సిద్ధంగా ఉద్యమాలకు, దీక్షలకు తలొగ్గే రకం కాదు. సమస్యలు నాన్చడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఇంతకన్నా పెద్ద ఉద్యమాలు ఎన్నో జరిగినా కూడా మిన్నకున్న చరిత్ర ఉంది ఈ ప్రభుత్వానికి. భవిష్యత్తులో ఉధృత రూపం దాల్చేదేమో కాని, సమస్యను పరిష్కరించే సమయానికి పట్టణాల్లో ప్రదర్శనలు తప్ప పెద్దగా ఉద్యమం కూడా ఏమీ కనిపించ లేదు. మరి హజారే నాలుగు రోజులు దీక్ష చేయగానే ప్రభుత్వం వారితో చర్చలు జరిపి ఒక అంగీకారానికి ఎలా వచ్చింది? 

సమస్యను పరిష్కరించడానికి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తారేమోనని అనుకున్నా కూడా అలాంటిదేమీ చేయలేదు.   తానొక్కటే మొత్తం క్రెడిట్ తీసుకోవాలనేమో, ఏక పక్షంగా ఆందోళన కారులతో చర్చలు జరిపింది. ఆ రెండువర్గాలు తప్ప మరే ఇతరులకు కూడా బిల్ డ్రాఫ్టు కమిటీలో ప్రాతినిధ్యం ఇవ్వలేదు.

2G, కామన్వెల్త్ మొదలైన కుంభకోణాలతో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట 'నానాటికి తీసికట్టు, నాగంభొట్లు' అన్నట్టుగా తయారయ్యింది. 2G పై, CVC ఎంపికపై ప్రధాన మంత్రిపైనే సుప్రీం అక్షింతలు పడ్డాయి. పులిమీద పుట్ర లాగా ఇప్పుడే ఐదు రాష్ట్రాల ఎన్నికలు వచ్చి పడ్డాయి. 

ఎటూ దిక్కు తోచకుండా ఉన్న కాంగ్రెస్ కు అన్నా దీక్ష అనుకోని వరంలా వచ్చి పడింది. అన్నాతో సంధి కుదుర్చుకోవడం ద్వారా తాము అవినీతి నిరోధకులమని ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారం చేసుకోవచ్చు. ఇక బిల్లు సంగతా, అది పార్లమెంటుకు వచ్చినప్పుడు చూసుకోవచ్చు. ఈ బిల్లు అమలు లోకి రావడం ఏ రాజకీయ పార్టీకి కూడా ఇష్టం ఉండదు. కాబట్టి అన్ని పార్టీలు కలిసి నానా కొర్రీలు పెట్టి ఎలాగూ అటకెక్కిస్తాయి. ఈలోపల క్రెడిట్ మనం కొట్టేయొచ్చు. ఇదే కాంగ్రెస్ ఆలోచనగా కనపడుతుంది.

కాంగ్రేస్ తెలివితేటలు లేటుగా తెలుసుకున్న బీజేపీ, వామపక్షాలు డ్రాఫ్టు కమిటీలో తమకు ప్రాతినిధ్యం లేకపోవడం పై ఇప్పుడు గుర్రుమంటున్నాయి. అయితే అవినీతిపై ఏనాడూ నిజాయితీగా ఉద్యమించని ఆ పార్టీలు గట్టిగా అడిగే నైతిక హక్కును కోల్పోయాయని చెప్పొచ్చు.

జన్ లోక్డ్ పాల్ బిల్లు డ్రాఫ్టు కమిటీ మెంబర్లు 
ప్రణభ్ ముఖర్జీ అధ్యక్షతలో ఈ కమిటీ మరో తెలంగాణా కమిటీ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. అలా జరిగినట్టయితే ఈ కళంకిత మీడియా ఇప్పుడు చేసినంత హడావుడి అప్పుడు కూడా చేస్తుందా అనేది అనుమానమే. ఏమైనప్పటికీ ఈ బిల్లు అమలులోకి వచ్చేదాకా దేశ ప్రజలు నిరంతర అప్రమత్తతతో మెలగాల్సి ఉంటుంది. లేకపోతే ఇంతే సంగతులు.            

Comments

  1. శ్రీకృష్ణ కమిటీ సభ్యులకి హొటెల్స్‌లో చాలా లగ్జరీ సౌకర్యాలు కల్పించారు. అందుకే శ్రీకృష్ణ కమిటీ ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక ఇచ్చింది. లోక్‌పాల్ పెట్టడం కంటే CBIకి ఉన్న అధికారాలు పెంచడం మేలు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చెయ్యలేక ట్రాన్స్‌ఫర్ చేసిన కేసులని మాత్రమే CBI దర్యాప్తు చేస్తుంది కానీ స్వతంత్రంగా కేసు నమోదు చేసే అధికారం CBIకి లేదు. CBIకి ఉన్న అధికారాలు పెంచితే కొత్త కమిటీలు వెయ్యాల్సిన ఖర్చు ఉండదు.

    ReplyDelete
  2. లోక్‌పాల్ బిల్‌కి మద్దతు ఇస్తున్నామంటూ బ్లాగుల్లో హడావుడి చేసినవాళ్ళు నిజంగా ఆ బిల్‌లో ఏముందో చదవలేదేమోనని నాకు అనుమానం. CBI అధికారులైనా నిజాయితీగా పని చేస్తారంటే నమ్మొచ్చు కానీ అధికార పార్టీ నియమించిన లోక్‌పాల్ కమిటీ నిజాయితీగా పని చేస్తుందంటే నమ్మడానికి చెవిలో పువ్వులు పెట్టుకోవాలి.

    ReplyDelete
  3. ప్రవీణ్ గారు,

    తెలంగాణా కమిటీ అంటే నేనన్నది ప్రణభ్ కమిటీ గురించి. ప్రణభ్ కమిటీ అంటే ఎడతెగని కమిటీ అని పేరుకదా! దీనికి కూడా ప్రణభ్ ముఖర్జీ చైర్మన్ గా ఉన్నారు. అందుకని అనుమానం వస్తుంది.

    ఒకవేళ లోక్పాల్ ఏర్పడితే CBI లోని అవినీతి వ్యతిరేక విభాగాన్ని లోక్‌పాల్‌లో విలీనం చేయవచ్చు. దానికి ఏయే అధికారాలు ఉండాలో నిర్ణయించేందుకే ఈ కమిటీ వేసారు. అది బిల్లుగా వస్తే ఆ అధికారాలు వస్తాయి. కాని ఇదంతా జరిగేదాకా నమ్మలేం, గత అనుభవాల దృష్ట్యా.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

తెలుగును పునరుజ్జీవింప జేద్దాం

భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం. ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి క్లిష్టమైన సంస్కృత సమాసాలను వాడుతున్నారు. దీనివల్ల ఒక భాష నుండి వేరొక భాషకు దాసోహం చెప్పడం తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. సంస్కృతం తన సహజరూపం లోనే మన లేక హిందీగా మారి ఉత్తర భారతంలో బ్రతుకుతుంది. అలాంటి సంస్కృత పదాలను అరువుతెచ్చుకుని తెలుగులో వ్యాప్తిలోకి తీసుకు రావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అవసరం లేదు కూడా. మన భాష ప్రస్తుత పరిస్థితికి ప్రబంధ సాహిత్యం తప్ప, సాంకేతిక పరమైన సాహిత్యం మనకు లేకపొవడం కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. పైగా మన పూర్వ కవులకు సంస్కృతం పై ఉన్న ఎనలేని మోజు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణం. అర్జునుడికి వంద పేర్లు ఉంటాయి. irrigation అనే పదానికి ఒక్క తెలుగు ...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...

కడప ఎన్నికలతో రాష్ట్ర భవితం తేలనుందా?

కడప పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాలలో జరుగుతున్న ఎన్నికలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును తేల్చేవిగా కనబడుతున్నాయి. అందుకే ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్రులు సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నారు. ఒక వైపు రాజశేఖర్ రెడ్డికి పెట్టని కోట లాంటిదైన జిల్లా. పైగా జగన్ కున్న ధనబలం, అంగబలం. కాంగ్రెస్ ధనబలం, అధికారబలం. వీటి మధ్య ఎంత తీవ్రమైన పోరు జరిగినా కూడా, జగన్ కే విజయావాకాశాలు లభించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఎలక్షన్ లో ఓటమి గాని సంభవిస్తే జగన్ పార్టీకి అది సమాధిగా మారుతుంది. ప్రజారాజ్యం పార్టీలా ఇతర పార్టీల్లో కలవడం తప్ప, మళ్ళీ కుదురుకోవడం కష్టం కావచ్చు. ఆ పక్షంలో కాంగ్రెస్ జగన్ని మరింత అణగదొక్కడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి BJP లో కలవ వచ్చు. కడపలో గెలిస్తే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం 2014 వరకు తిరుగుండదు.  ఒక వేళ ఈ ఎన్నికల్లో జగన్ గనక గెలిచినట్టయితే అది రాష్ట్ర ప్రభుత్వానికే కాక, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కూడా గొడ్డలి పెట్టుగా మారుటింది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చడానికి జగన్ ఒక్క నిముషం కూడా వృధా చేయడు. కాంగ్రెస్, తెలుగుదేశాల నుండి జగన్ పార్టీకి జోరుగా వలసలు ప...