Skip to main content

మనిషి దేవుడెలా అవుతున్నాడు?

మనిషి సంఘ జీవి. రాను రాను సంఘ జీవనానికి కొన్ని నియమాలు అవసరమయ్యాయి. అవే నియమాలు సమస్యలనూ సృష్టించాయి. ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కునే వారు కొందరు, ఇతరుల సహాయం కోరే వారు కొందరు. ఇలా ఉపదేశాలు తీసుకోవడం మొదలైంది.

మనుషులలో కొందరు తెలివైన వారు ఉంటారు. వీరు తమ విజ్ఞానంతోనో, అనుభవంతోనో, మాటకారితనంతోనో ఇతరులను ప్రభావితం చేయ గలరు. అలాంటి వారు ఇతరులకి ఉపదేశాలివ్వడం మొదలు పెట్టారు. ఇలాంటి గురువులు మనకు పురాణాల్లో కొల్లలుగా కనబడతారు.

మన పురాణాల్లో మహా మహిమాన్వితులు, గొప్పవారైన గురువులు లేదా ఋషుల గురించి చర్చించడం జరిగింది. చాలా సార్లు వారు దేవతలనే శపించగల శక్తివంతులుగా చిత్రింప బడ్డారు. కాని ఎక్కడా వారే దేవతలని చెప్పబడలేదు. వారు అలా ప్రకటించుకోలేదు కూడా.

కానీ ఈరోజుల్లో వీధికొక బాబా నేనే భగవంతున్నని ప్రకటించుకోవడం లేదా తన శిష్య బృందంతో అన్యాపదేశంగా అనిపించుకోవడం సర్వ సామాన్యంగా మారి, మనకందరికీ దాదాపుగా అలవాటై పోయింది. ఒకప్పటి సప్తర్షులు, వారి శిష్య ప్రశిష్యులు కూడా భగవస్వరూపులు కాలేనప్పుడు, మరి ఈనాటి వీధి బాబాలు ఎలా ప్రత్యక్ష దైవాలు కాగలుగు తున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం.

ఆలోచిస్తే ఈ పరంపరకు షిర్డీ సాయిబాబా ఆద్యుడు అనిపిస్తుంది. నాకు తెలిసి ఆయన కన్నా ముందు వచ్చిన గురువులు అందరూ గురువులు గానే మిగిలిపోయారు. బుద్ధుడు, మహావీరుడు లాంటి వారు కూడా వందల సంవత్సరాల వరకు  గురువులుగానే భావింప బడ్డారు. 

ఇప్పటి కాలంలో మాత్రం వందలకొద్దీ బాబాలు, అమ్మలు ప్రత్యక్ష దైవాలై మనముందు తిరుగాడుతుంటే, మనం నిజంగా కలియుగంలో ఉన్నామా, లేక సత్య యుగంలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతుంది. నిజంగా కలియుగంలోనే ఉంటే, ఇంతమంది దేవుళ్ళను ప్రత్యక్షంగా దర్శించుకోవడం ఎలా సాధ్య పడుతుంది?

ఆలోచిస్తే ఈ రకమైన ప్రత్యక్ష దైవాలు బయలు దేరడానికి చాలానే కారణాలున్నాయని పిస్తుంది. మొదటిది ప్రజల అమాయకత్వం. ఆలోచన లేకుండా దేన్ని పడితే దాన్ని దేవుడని నమ్మేయడం. కనీసం పురాణాల పరిజ్ఞానం కూడా లేని వారు ఇలాంటి చిల్లర దేవుళ్ళను పడి పడి పూజించడం రోజూ చూసే విషయం. వీరికి ఒక జాన్ పహాడ్ సైదులు, ఒక షేక్ షావలి, ఒక జహంగీర్ పీర్, ఒక మేరీ మాత కూడా దేవతలే, పూజకు అర్హులే. తమకు సంతానం, డబ్బు, దస్కం ప్రసాదించ గల దైవాలే. అంతటి సెక్యులరిజం (?) మన భారతీయ ప్రజలది! 

ఈ బాబాల విజృంభణకు మన పురాణాల్లోనే ఒక వెసులుబాటు ఉన్నట్టు కనిపిస్తుంది. భగవంతునికి పది అవతారాలున్నాయని పురాణాల్లో చెప్పబడినా,  బయట మాత్రం పది కన్నా ఎక్కువ రూపాలే ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, ఇలా రక రకాల వేరియేషన్లతో, కాంబినేషన్లతో మనకు భగవంతులు దర్శనమిస్తారు. పైగా కల్కి రూపంలో భవిష్యత్తులో వచ్చే అవతారానికి ఎప్పుడూ ఒక అవకాశం ఉండనే ఉంది. చివరికి NTR కి, లక్ష్మీ పార్వతికి పుట్టబోయే సంతానం కూడా కల్కిభగవానుడు అవుతాడని ప్రచారం జరిగిందంటే, మన తర్క విహీనమైన ఊహాజనితమైన ప్రచారాలు ఎంతవరకు వెళ్ళుతాయో సులభంగానే ఊహించు కోవచ్చు.

ప్రజలకు మార్గదర్శకులుగా ఉండవలసిన లీడర్లే చండీయాగాలు, సత్యసాయి ప్రదక్షిణాలు చేస్తున్న కాలంలో పరిస్థితుల్లో మార్పు ఆశించడం అత్యాశే అవుతుందేమో. ఎవరికీ వారు మేం భగవంతులం అని ప్రకటించుకోగానే పొలోమని పరిగెత్తే జనం మారనంత వరకూ పరిస్థితులలో పెద్దగా మార్పు ఉండదేమో.

Comments

  1. ఇంతమంది ప్రత్యక్షదేవుళ్ళు నడయాడే నేలమీద పుట్టడం, వారితో సమకాలీకులవడం మన అదృష్టమే. మన పూర్వీకులే పాపం గురువులతో అడ్జస్ట్ అయిపోయారు.

    ReplyDelete
  2. @మన్మధన్ చెంబు

    :)

    ReplyDelete
  3. బాగా చెప్పారు.
    ' పూజకు అర్హులే ' అని ఉండాలి. టైపింగ్ తప్పిదాన్ని సరిచేయగలరు.

    ReplyDelete
  4. Anonymous,

    Thanks for correction, made it.

    ReplyDelete
  5. :) baagumdi mee blog.

    ReplyDelete
  6. హరిగారూ!
    చాలా బాగా రాసారు.
    ఆర్.నారాయణమూర్తి గారి సినిమా "అమ్మ మీద ఒట్టు" సినిమాలోని ఓ పాట గుర్తుకోస్తోంది - " దేవుడా నీవున్నవా...లేక మనిషిలో భ్రమనన్నవా....అనే పల్లవితో సాగే ఆ పాటలో ఓ చరణం - "మనిషి ముందుగ పుట్టి, భయం తదుపరి బుట్టి, దేవుడనిపేరెట్టి ఇలపైన గుడికట్టి ఉన్మాద ముసుగులో ఉనికినే కోల్పోగ...అంటూ సాగే ఆ పాట మనిషి దేవుణ్ణి సృష్టించాడా, దేవుడు మనిషిని సృష్టించాడా అనే విషయంలో భలే క్లారిటీ ఇస్తుంది.
    అన్నట్టు మీరు పర్మిషన్ ఇస్తే మీ టపాను నా బ్లాగులో నారాయణమూర్తి గారి పాట సహితంగా పుణః ప్రచురిస్తాను.

    ReplyDelete
  7. రెడ్డి గారు,

    ధన్యవాదాలు.

    తప్పక ప్రచురించండి.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...