Skip to main content

కడప జిల్లా పేరు మార్పు

ఆంధ్ర ప్రదేశ్ లో ఎంతో చారిత్రక ప్రాముఖ్యం కలిగిన జిల్లా కడప. రాయల సీమ ప్రాంతానింకి చెందిన ఈ ప్రాంతానికి ఎప్పటినుంచి గుర్తింపు ఉందో ఇదమిద్ధంగా తెలియక పోయినా రామాయణంలోని కిష్కింధ కాండ ఈ ప్రదేశం లోనే జరిగినట్లు చెపుతారు. 7వ శతాబ్దంలో చైనా చరిత్ర కారుడు హుయాన్ త్సాంగ్ ఇక్కడ పర్యటించి గ్రంథస్తం చేసినట్టు తెలుస్తుంది. కనీసం పదవ శతాబ్దం నుంచి ఈ పేరుతొ ప్రసిద్ధి చెందినట్లు చారిత్రక ఆధారాలున్నాయి.

పదకొండవ శతాబ్దం నుండి చోళుల ఆధీనం లో ఉన్న కడప పధ్నాలుగో శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం క్రిందికి వచ్చింది. దరిమిలా క్రీ శ 1565 లో నిజాం చేత ఆక్రమించుకో బడింది. క్రీ శ 1800 లో నిజాం నవాబు సీడెడ్ జిల్లాలలో భాగంగా దీన్ని బ్రిటిష్ వారికి సమర్పించాడు. 1820 నుండి 1829 వరకు జిల్లా కలెక్టరు గా ఉన్న సి.పి.బ్రౌన్ ఇక్కడి భాష, సంస్కృతుల పై విశేష కృషి జరిపాడు. బ్రిటిష్ వారి హయాం లో Cuddapah గా వ్యవహరించ బడిన జిల్లా పేరును 2005 ఆగస్టు 19 నుండి తిరిగి అధికారికంగా Kadapa గా మార్చారు.

ఈ ప్రాంతం యోగి వేమన, అన్నమా చార్యులు, పోతులూరి వీర బ్రహ్మం, కవయిత్రి మొల్ల మొదలైన గొప్ప కవులు, వాగ్గేయ కారులకు పుట్టినిల్లు. వీరే కాక అల్లసాని పెద్దన, అయ్యలరాజు రామ భద్రుడు, రామరాజ భూషణుడు, తాళ్ళ పాక తిమ్మక్క, నాచన సోముడు, కవి చౌడప్ప కూడా ఇక్కడి వారే అని చెప్ప బడుతుంది. వీరే కాక ఆధునిక కాలానికి చెందిన గడియారం వెంకట శేష శాస్త్రి, పుట్టపర్తి నారాయణాచార్యులు, రాచమల్లు రామచంద్రా రెడ్డి, మొదలైన వారు కూడా ఇక్కడి వారే.

కడప జిల్లాకి ఆపేరు 'గడప' అనే తెలుగు పదం నించి వచ్చిందని చెపుతారు. భారత దేశంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుమల దేవస్థానానికి ముఖ ద్వారం గా వుండడం వల్ల కడప అనే పేరు వచ్చినట్లుగా ప్రచారంలో వుంది.

ఇంతటి సంస్కృతి, చారిత్రక ప్రాశస్త్యం కలిగిన జిల్లా జిల్లా పేరును ఒక్క కలం పోటుతో Y.S.రాజ శేఖర్ రెడ్డి జిల్లా గా మార్చి వేసారు. దేశ సంస్కృతీ సంపదల ఆన వాళ్ళను రాజకీయ కారణాలతో నాశనం చేసే హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడి నుండి వచ్చింది? రాజ శేఖర రెడ్డి కన్నా ముందే గొప్ప నాయకులైన యన్. టి. రామా రావు, పి. వి. నరసింహా రావు ల పేర్ల పైన ఏ జిల్లాలకు పేర్లు పెట్టారు? అయినా ఇప్పుడు ఇంత అత్యవసరంగా పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది?

ఇప్పటికే తురుష్క దండ యాత్రల వల్ల కొన్ని, బ్రిటిష్ వారి హయాంలో మరిన్ని చారిత్రక అవశేషాలైన పట్టణాల, మండలాల పేర్లను కోల్పోయాం. ఇప్పుడిక ఈ రకమైన ఆనవాయితీ ఎక్కడి వరకు వెళ్తుందో మరి!

Comments

  1. ఇంత పొడవైన పేర్లు మన జిల్లాలకి అవసరమా ? ఇలాంటి చర్యల వల్ల పేరుప్రతిష్ఠలు లేకుండా దెబ్బతినేది జిల్లాకేంద్రాలు. అసలే వాటికి ఏ ప్రాధాన్యమూ లేదు. ఇదివఱకు కడపజిల్లా అంటే దాని ముఖ్యపట్టణం కడప అని గుర్తుపట్టేవాళ్ళం. ఇప్పుడు డా|| (ఈ బిరుదు కూడా జిల్లాపేరులో కలిపేశారు) వై.ఎస్.(ఇంటిపేరు కూడా జిల్లాపేరులో కలిపేశారు) రాజశేఖరరెడ్డి (కులం పేరు కూడా జిల్లా పేరులో కలిపేశారు) జిల్లా అని పలకాలన్నా రాయాలన్నా ఎంత ఇబ్బంది ? చనిపోయిన వై.ఎస్. తప్ప కడపజిల్లాలో మహానుభావులెవరూ పుట్టలేదా ? అనే ప్రశ్నకూడా తలెత్తుతోంది ? అన్నమాచార్యులేమయ్యాడు ? వేమన ఏమయ్యాడు ? పండిత పుట్టపర్తి నారాయణాచార్యులేమయ్యారు ? (ఈ చివఱాయన విగ్రహాన్ని కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆ మధ్య ప్రొద్దుటూరులో కూలగొట్టారు)

    -- తాడేపల్లి

    ReplyDelete
  2. విజయనగరం జిల్లాకి ఫ్రెంచ్ సామ్రాజ్యవాదుల్ని ఎదిరించిన తాండ్ర పాపారాయుడు పేరు పెట్టలేదు. ఫ్రెంచ్ సామ్రాజ్యవాదులతో అవకాశవాద పేరు పెట్టుకున్న విజయరామ గజపతి పేరు విజయనగరం జిల్లాకి ఉంది. ఇప్పుడు కడప జిల్లాకి ఒక ఫాక్షనిస్ట్ పేరు పెట్టడం జరిగింది.

    ReplyDelete
  3. ఇలాంటి దురాచారాల్ని ఎదించలేని మన బలహీనత వికృత చేష్టలు చేసేవారికి బలం . ఆబలంతోనే కదా ఏడుకొండలనే మింగాలని చూసినది .

    ReplyDelete
  4. పొట్టి శ్రీరాములు గారి పేరు ఒక జిల్లాకు పెట్టటానికి యాభై సంవత్సరాలు పట్టింది, అదే రాజశేఖరుడి పేరెట్టటానికి యాభై రూజులు కూడా పట్టలేదు.

    ReplyDelete
  5. చరిత్రకెపుడో చెదలు పట్టాయి. బలవంతుడిదే రాజ్యం. కానీ ఎప్పుడో చలిచీమలు లేవవా !

    ReplyDelete
  6. బహుశ చరిత్ర, సంస్కృతులను 'నామ' రూపాల్లేకుండా నాశనం చేయడం అంటే ఇదే నేమో?

    తాడేపల్లి, ప్రవీణ్, దుర్గేశ్వర, కన్న గాడు, ఎస్. ఆర్. రావు గార్ల వ్యాఖ్యలకు ధన్య వాదాలు.

    ReplyDelete
  7. ఇది జోక్ కాకపోతే మరేమిటి? మా తాత మూడు సార్లు MLAగా, ఒక సారి MPగా పని చేశారు. అతని నియోజక వర్గంలో అతను పుట్టిన మండలానికి అతని పేరు పెట్టాలని డిమాండ్ చెయ్యగలను. ఆ మండలం నుంచి ఇంకొకాయన ఒక సారి MLA, ఒక సారి జిల్లా పరిషత్ చైర్మన్, ఒక సారి పార్టీ జిల్లా అధ్యక్షుడు అయ్యాడు. అతని కొడుకో, మనవడో ఆ మండలానికి అతని పేరు పెట్టాలని డిమాండ్ చేస్తారు. మండలాల పేర్లు సరిపోవంటే గ్రామాల పేర్లు కూడా మార్చాలి. గోపాలరావు అని పేరు ఉన్న MLA గారు చనిపోతే అతని మండలానికి గోపాల మండలం అని పేరు పెట్టారు. అతని తరువాత అదే మండలానికి చెందిన సుగ్రీవ రావు అనే పేరు ఉన్న అతను MLAగా పని చేసి చనిపోయారు. అప్పుడు ఆ మండలంలోని MLA స్వగ్రామానికి సుగ్రీవపురం అని పేరు పెట్టాలంటారు. ఆ MLA అవినీతిపరుడైనా ఫర్వాలేదు, చనిపోయిన మనిషిని స్మరించడం సంప్రదాయం అంటారు.

    ReplyDelete
  8. భారత దేశాన్ని కూడా ఓ రోజు సోనియా దేశంగానో, రాజీవ్ దేశం గానో మారుస్తారు వీళ్ళు. ఇదివరకు ఓ కూడలికో, ఓ రోడ్డుకో పేర్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా ఊళ్ళకు పేర్లు పెడుతున్నారు. ఈ దేశాన్ని కాంగ్రెస్ నుండి దేవుడే రక్షించాలి.

    ReplyDelete
  9. గాంధీ రోడ్, నెహ్రూ చౌక్, అంబేద్కర్ జంక్షన్ లాంటి పేర్లు ఉన్న వీధులు చూశాను. వాళ్ళు జాతి నాయకులుగా భావించబడే వ్యక్తులు. వాళ్ళ సంగతి వేరు. హైదరాబాద్ లోనూ, శ్రీకాకుళం జిల్లాలోనూ జళగం వెంగళరావు పేరు ఉన్న వీధులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా జిల్లాలకే రాజకీయ నాయకుల పేర్లు పెడుతున్నారు.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

నల్ల జీవో

ప్రభుత్వం తాజాగా GO నెంబర్ 177 విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన తెలుపడానికి అనుసరించే పద్ధతులైన సమ్మె, టూల్ డౌన్, పెన్ డౌన్ తదితర ప్రక్రియల నిషేధిస్తూ నో వర్క్, నో పే అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక సందేహమేమిటంటే, ఇప్పటివరకూ పనిచేయక పోతే కూడా జీతాలిస్తున్నారా అని. పని చేయక పోటే ఎక్కడా జీతాలు ఉండవ్. అయితే సదరు ఉద్యోగి పనిచేయలేదని నిర్ధారించవలసి ఉంటుంది. దానికి కొంత ప్రక్రియ ఉంటుంది.  పని చేయకుండా వేతనం తీసుకోవాలని ఎవరూ అనుకోరు. అనుకున్నా అది ఇప్పటికే ఉన్న నిబంధనల వాళ్ళ సాధ్యం కాదు. కాని ప్రభుత్వం పై నిరసన తెలియజేయడానికి మాత్రం ఉద్యోగులు ఇలాంటి ప్రక్రియలను ఉపయోగించడం మామూలే. ఇలాంటి జీవోలవల్ల ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం  తీసుకోవచ్చు. ఉద్యోగుల జీతాలు ఆపి వేయవచ్చు. ఇదేమని ఎవరైనా అడిగితే జీవో కాపీలు చూపిస్తారు. ఇకపై ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, జీతాలు పెంచక పోయినా నిరసనలు తెలప కూడదన్న మాట. కేవలం విఙ్ఞప్తులు మాత్రమే చేసుకోవాలి. వింటే వింటారు, లేకపోతే లేదు. నిజమే, ప్రైవేటు ఉద్యోగాల్లో సమ్మెలకు ఎక్కువ వెసులు...

మనిషి దేవుడెలా అవుతున్నాడు?

మనిషి సంఘ జీవి. రాను రాను సంఘ జీవనానికి కొన్ని నియమాలు అవసరమయ్యాయి. అవే నియమాలు సమస్యలనూ సృష్టించాయి. ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కునే వారు కొందరు, ఇతరుల సహాయం కోరే వారు కొందరు. ఇలా ఉపదేశాలు తీసుకోవడం మొదలైంది. మనుషులలో కొందరు తెలివైన వారు ఉంటారు. వీరు తమ విజ్ఞానంతోనో, అనుభవంతోనో, మాటకారితనంతోనో ఇతరులను ప్రభావితం చేయ గలరు. అలాంటి వారు ఇతరులకి ఉపదేశాలివ్వడం మొదలు పెట్టారు. ఇలాంటి గురువులు మనకు పురాణాల్లో కొల్లలుగా కనబడతారు. మన పురాణాల్లో మహా మహిమాన్వితులు, గొప్పవారైన గురువులు లేదా ఋషుల గురించి చర్చించడం జరిగింది. చాలా సార్లు వారు దేవతలనే శపించగల శక్తివంతులుగా చిత్రింప బడ్డారు. కాని ఎక్కడా వారే దేవతలని చెప్పబడలేదు. వారు అలా ప్రకటించుకోలేదు కూడా. కానీ ఈరోజుల్లో వీధికొక బాబా నేనే భగవంతున్నని ప్రకటించుకోవడం లేదా తన శిష్య బృందంతో అన్యాపదేశంగా అనిపించుకోవడం సర్వ సామాన్యంగా మారి, మనకందరికీ దాదాపుగా అలవాటై పోయింది. ఒకప్పటి సప్తర్షులు, వారి శిష్య ప్రశిష్యులు కూడా భగవస్వరూపులు కాలేనప్పుడు, మరి ఈనాటి వీధి బాబాలు ఎలా ప్రత్యక్ష దైవాలు కాగలుగు తున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం. ఆలోచిస్తే...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...