Skip to main content

కసబ్ కి ఉరిశిక్ష తక్కువా?

కసబ్ కి ఉరిశిక్ష విధిస్తూ కోర్టులో తీర్పు వెలువడిన దరిమిలా రక రకాల వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు ఈ శిక్ష సరిపోదని, అసలు ఖండ ఖండాలుగా నరికి కాకులకు, గద్దలకు వేయాలని; మరికొందరు చావనీయ కుండా, బ్రతుకు అంటే అసహ్యం కలిగేలా చిత్ర హింసలు పెట్టాలని; ఇంకొందరు ముస్లిం ఆచారాల ప్రకారం అంతిమ క్రతువు నిర్వ హించక పోతే సరిపోతుందని ఇలా రక రకాలుగా చెప్తున్నారు.

అసలు కసబ్ ఎవరు? పాకిస్తాన్ లోని ఒక దరిద్రుల కుటుంబంలో జన్మించాడు. దారిద్ర్యం, అపరిమిత సంతానం అవిద్యకు, మూర్ఖత్వానికి దారి తీసాయి.  దుర్భర దారిద్ర్యం నేర ప్రవృత్తికి, దొంగ తనాలకు పురికొల్పింది. ఇలాంటి వారు టెర్రరిస్టులని తయారు చేసే ముష్కర మూకలకు శ్రేష్టమైన ముడిసరుకు అవుతారనేది జగమెగిన సత్యమే. చాలా సహజంగానే వారు ఇతన్ని తమ గుంపులోకి లాగారు. అందుకు ప్రతిఫలంగా ఇతని తండ్రికి డబ్బు ముట్టిందని కూడా వార్తలు ఉన్నాయి.

చదువు, సంస్కారం లేని యితడు ఇస్లామిక్ తీవ్రవాద సాహిత్యాన్ని ఔపోశన పట్టి కరడు గట్టిన టెర్రరిస్టుగా మారాడని అనుకోలేం. ఇన్ని రోజుల విచారణలో కూడా ఈ విషయం తెలుస్తుంది. కసబ్ ఎన్నోసార్లు రక రకాల అబద్ధాలు చెప్పాడు. తానూ టెర్రరిస్టు కాదని, టూరిస్టు అని బుకాయించ బోయాడు. శిక్ష ఖరారైన తర్వాత కూడా ఏడ్చాడని తెలుస్తోంది. కరడు గట్టిన టెర్రరిస్టు అయితే, నమ్మిన దానికోసం చావడాన్ని గర్వంగా భావిస్తాడు. జిహాద్ కు సంబధించిన నినాదాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. 

ఛత్రపతి శివాజీ టర్మినస్ లోపల ఇతను జరిపిన మారణ కాండకు తప్పకుండా ఉరిశిక్ష పడాల్సిందే. వేయడానికి మన శిక్షా స్మృతి లో అంతకన్నా పెద్ద శిక్ష కూడా లేదు. నిజానికి ఇతనికి శిక్ష విధించే విషయంలో ఇంతటి భావోద్వేగాలకు గురి కావాల్సిన అవసరం లేదు. నిజానికి మొత్తం వ్యవస్థలో కసబ్ ది ఒక పిపీలిక మాత్రమైన పాత్ర మాత్రమే.

మనం మన దేశం లోనే రహస్యంగా నడుపుతున్న తీవ్రవాద శిక్షణా వ్యవస్థని రూపు మాప లేక పోతున్నాం. POK  లో, సరిహద్దుల లో ఉన్న  తీవ్ర వాద స్థావరాలని నాశనం చేయడానికి అంతర్జాతీయ మద్దతును కూడగట్ట లేక పోతున్నాం. కనీసం అమెరికా వ్యతిరేక ఇస్లామిక్ టెర్రరిజం, ఇండియా వ్యతిరేక టెర్రరిజం ఒకటే అని అమెరికాని కన్విన్స్ చేయ లేక పోతున్నాం. ఇవన్నీ ఎవరి వైఫల్యాలు?

ఇంతెందుకు? కనీసం టెర్రరిస్టులపై ప్రాణాలర్పించి పోరాడుతున్న పోలీసులకు సప్లయ్ చేసే బుల్లెట్ ప్రూఫ్ ల విషయం లో కూడా లాలూచీ పడుతున్నాం. సాక్షాత్తూ పార్లమెంటు పై దాడి చేసి అయిదు వందల నలభై మంది ఎంపీలను అదుపులోనికి తీసుకోవాలని ప్రయత్నిచినవారిని ఐదు సంవత్సరాలుగా ఉరి తీయకుండా ఉపేక్షిస్తున్న వారిని ఏం చేయాలి? లుంబినీ పార్కు, గోకుల్ చాట్లో జరిగిన మారణ కాండకు ఇప్పటివరకు విచారణలో పురోగతి లేక పోవడానికి కారకు లెవ్వరు? 

మన దేశంలో అనేక దారుణాలకు పాల్పడుతున్న దావూద్ ఇబ్రహీం దగ్గరుకు వెళ్లి బహిరంగంగా విందులు చేసి వచ్చే బడా బాబులను ఏం చేయాలి?

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. కేవలం కసబ్ ని అత్యంత దారుణంగా చంపి రాక్షసానందం పొందడం అనేది, తాత్కాలికంగా ఉపశమనం కలిగించ వచ్చు, కాని ఆ ఆనందం అసలు విషయాలన్నీ మరుగున పడి పోవడానికి మాత్రమే ఉపయోగ పడుతుంది. ఇలా ఎప్పటికప్పుడు జరిగిన విషయాలని మరిచి పోయి మళ్ళీ మళ్ళీ మోసపోవడం, తిరిగి ఏదో ఒక దాడి జరగ్గానే భావోద్వేగాలకు లోను కావడం మనకేమీ కొత్త కాదుగా.

Comments

  1. ఇస్లాం దృష్టిలోఉగ్రవాదం నిషిద్ధం
    ఇస్లాం దృష్టిలో ఇది హరామ్ (నిషిద్ధం). ఇస్లామ్ లో ఈ హరామ్ పనికి చోటులేదని, ఇస్లాం మానవత్వానికి కట్టుబడి ఉందని జమీయతుల్ ఉలమాయె హింద్ ఫత్వా జారీచేసింది.
    * ఉగ్రవాదుల మృతదేహాలను ముక్కలు, ముక్కలుగా కోసి సముద్రంలో పారేయాలని ముస్లిం పెద్దలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. ప్రజల రక్తాన్ని మలినం చేసిన వారికిదే సమాధానమని వారు పిలుపునిచ్చారు.ఇస్లాంలో హింసకు, ఉగ్రవాదానికి తావు లేదని ఉగ్రవాదుల మృత దేహాలను పూడ్చిపెట్టడానికి స్థలాన్ని నిరాకరించాలని ,ఉగ్రవాదులు నిజమైన ముస్లింలు కాదని, పంజాబ్‌లోని పాటియాలా జిల్లా సమనాలో జరిగిన కాన్ఫరెన్స్‌లో ముస్లిం మత పెద్దలు, ఇతర ముస్లిం ప్రముఖులు ,హర్యానా గవర్నర్ ఎకే కిద్వాయ్ అన్నారు.ఆంధ్రజ్యోతి 4.12.2008.
    * ఇలాంటి మంచిని కోరే ముస్లిములు ఉగ్రవాదాన్ని తిరస్కరిస్తున్నారు.ఉగ్రవాదులు ఏ మతంలో ఉన్నా వారికి నరకమే వస్తుంది.హింసను ప్రోత్సహించే మతలేఖనాలను లెక్క చెయ్యవద్దు.సర్వేజనా సుఖినోభవ తో ముస్లిములూ గొంతుకలుపుతారు.
    * హింసను బోధించే కురాన్ వాక్యాలు నాకు అక్కరలేదు.ఇలాంటి వాక్యాలు ఏ మతగ్రంధాలలో ఉన్నాపట్టించుకోకుండా మానవత్వాన్ని చూపటమే మంచి భక్తి. ఇస్లాం మతం తీవ్రవాదాన్నిఉగ్రవాద చర్యలను ఖండిస్తుంది . ఒక వ్యక్తిని చంపితే సర్వ మానవాళిని చంపినట్లే భావించాలి. చంపడమే తీవ్రవాదమైతే 17 లక్షల మందిని చంపిన మాజీ అమెరికా అధ్యక్షుడు బుష్ ప్రపంచంలోనే అతి పెద్ద తీవ్రవాది.ఇస్లాం ప్రపంచంలోని సర్వ మానవాళి సౌభ్రాతృత్వాన్ని కోరుతుంది.---ఇస్లామిక్ అకడమిక్ కంపారిటివ్ రిలీజియన్ (ఐఏసీఆర్) అధ్యక్షుడు ఆసిఫుద్దీన్ ముహమ్మద్ (ఈనాడు కర్నూలు 16.2.2009).
    *ఇస్లాం ఉగ్రవాదానికి వ్యతిరేకం- రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ రహ్మెత్‌ఖాన్ (ఈనాడు హైదరాబాదు 16.2.2009)
    *బంగ్లాదేశ్ లో ఉగ్రవాదులకు ఉరిశిక్ష
    ఉగ్రవాదులకు మరణశిక్ష విధించే ఆర్డినెన్సును బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమోదించింది.ఉగ్రవాదులకు మరణశిక్ష, యావజ్జీవం, మూడేళ్ల నుంచి 20ఏళ్ల వరకు కఠిన కారాగారంలాంటి శిక్షలలో ఏదైనా విధించే అవకాశముంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చేవారికి సైతం మూడేళ్ల నుంచి 20ఏళ్ల వరకు కఠిన కారాగారం విధించే అవకాశం ఉంది.
    *ఉగ్రవాదం అన్ని మతాలకూ శత్రువే.క్షమను పెంచడానికి, ఉగ్రవాదాన్ని తుంచడానికి సమైక్యంగా కూడిరావాలి.---- ఐక్యరాజ్యసమితి సదస్సులో సౌదీరాజు అబ్దుల్లా

    ReplyDelete
  2. కసబ్ కంటే ముందు అఫ్జల్ ని ఉరి తీయాలి,పార్లమెంటు మీద దాడి చేసినందుకు కాదు,వాడి గురి తప్పిననదుకు.వాడి ఆపరేషన్ సక్సెస్ అయ్యి ఉంటే(కనీసం కొంతమంది ఎంపీల ప్రాణాలు తీసి ఉంటే) హాయిగా దేశానికి పట్టిన సగం దరిద్రం వదిలేది.

    ReplyDelete
  3. ఒకరి ప్రాణము తీసె హక్కు వెరొకరికి లెదు.

    ReplyDelete
  4. చ౦పడ౦ కాదు, వాడిని క్షమి౦చాలి.
    అత్య౦త గౌరవ౦గా, మరణి౦చిన వారి కుటు౦బాలన్నీ కలగలసి, సైనిక లా౦చనాలతో వాణ్ణి వాఘా సరిహద్దుల దగ్గర ది౦పేయాలి. ఎ౦తో మ౦దిని చ౦పి, తానూ చావాలని వచ్చినవాడికి, బతకటమ౦టే ఏమిటో తెలియజెప్పాలి.

    ReplyDelete
  5. రహమతుల్లా గారు,
    సమాచారానికి ధన్యవాదాలు. ఇప్పుడు తీవ్ర వాదం వాళ్ళ ఇస్లామిక్ దేశాలే ఎక్కువ నష్ట పోతున్నయండి.

    రుషి గారు,
    కాల్చడానికి ప్రయత్నించి నందుకే ఉరి తీయలేదు. కాల్చకుండా దొరికిపోయి నందుకు ఉరి తీస్తారా మన ప్రభువులు?

    ప్రతిభ గారు,
    ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదు. మరి వందల ప్రాణాలు హరించి, ఆ హక్కును చేతిలోకి తీసుకున్న వారినేం చేయాలి?

    పెదరాయుడు గారు,
    గాంధీ మార్గానికి రోజులు లేవండి. మీరు చెప్పినట్టు చేస్తే అది మన చేతగాని తనం కింద భావిస్తారేమో.

    అందరికీ ధన్యవాదాలు.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...