Skip to main content

పద్యాలతో కుస్తీ


పదో తరగతి చదివేటప్పుడు తెలుగు టీచర్ అనంతాచార్యుల వారు చందస్సు నేర్పించారు. ఆ సందర్భంగా  ఆటవెలది పద్యాన్ని బోధిస్తూ, ఒక పద్య పాదాన్ని ఇచ్చి పూరించమని చెప్పారు. అది...

'ఆట వెలదు లెల్ల నాటాడు నప్పుడు'

చందస్సు నేర్చుకున్న ఆనందంతో సమధికోత్సాహంతో ఇలా పూరించాను.

 ఆ. వె.ఆట వెలదు లెల్ల నాటాడు నప్పుడు
పాడునపుడు మనము పరవశించి 
మేను పులకరించి మేఘ మధ్యంబునం
దాటలాడుచున్న యట్లు దోచు

తర్వాత ఇంగ్లీషు మీడియం చదువు, సాంకేతిక విద్య కావడంవల్ల పద్యాల గురించి పూర్తిగా మరిచే పోయాను. మళ్ళీ ఇలా బ్లాగులోకం లోకి వచ్చిన తర్వాతనే పద్యాలు రాయడానికి ప్రయత్నం చేశాను. చింతా రామకృష్ణా రావుగారి ఆశీర్వచనం, ఆచార్య ఫణీంద్ర గారి వద్ద శిష్యరికం, కండి శంకరయ్య గారి ప్రోత్సాహం లేకుంటే జీవితంలో మళ్ళీ ఎప్పుడూ పద్యం రాసి ఉండే వాడిని కాదంటే అతిశయోక్తి కాదేమో. ఈ సందర్భంగా వివిధ బ్లాగులలో నేను వ్రాసిన కొన్ని పద్యాలు.

ఆ. వె.ఆశ లేని బ్రతుకు అడవిలో వెన్నెల
ఆశ యందె కలుగు ఆశయములు
ఆశ యుండు టెల్ల అత్యాశ కాబోదు
ఆశ లోనె కలదు దేశ భవిత
చం.సరుకులు కొందమన్న మరి చాలవు జీతపు డబ్బు లేటికిన్
తిరుగుద మన్న రోడ్లపయి తిప్పలు తప్పవు పాటు హోల్సుతో
ఎరుగము నీటి పంపు ప్రతి యింటికి తప్పక వచ్చు రోజులన్
మరతుము వీటినన్నిటిని మానము వేతుము వోటువారికే
మ.జలమోయంచును చేయు పూజలకు కాస్తంతన్ దయే లేని ఆ
కలియే నాట్యము చేసెనా యనగ, పొంగారెన్ నదీ మాతలే !
కలలోనైనను గాంచ నోపుదుమె ’ హా ’ కారాల ఆర్త ధ్వనుల్ ?
జలమే రాక్షసియై ప్రజావళి నయో ! సంహారమున్ సల్పెనే !
తే. గీ. బియ్య మదిజూడ నింగితో నెయ్యమందు
కూరగాయలా అరపూట గూడరావు
ధరల గతిజూడ దడపుట్టు ధరణిలోన
పప్పు కొనబోవుటే పెద్ద తప్పు నేడు !
కం. అసమర్థు లాడు వాండ్రని
నసిగెడు వారెల్ల రింక నచ్చెరు వందే
దెస సోనియ ’ప్రతిభ’ను లో
క సభాధ్యక్షతను పొందె కాంతామణియే.
ఉ.'సీమ'ను క్షామ మెక్కువని చెప్పుచు కొందరు; కాదు కాదు మా
సీమన క్షామ మెక్కువని చెప్పెద రింకొక ప్రాంత నాయకుల్;
క్షామము తాండవించుటకు కారణ మౌచును, సిగ్గు లేకయున్
క్షామము బ్రోచుచుండుటనె గౌరవ మొందుట; సత్యమిద్ధరన్.
కం.బాధను విలవిల లాడె వి
రాధుడు గాయము లగుటను రాముని వలనన్
క్రోధము నంతట వీడి వి
రాధా! యిటు రమ్మటంచు రాముఁడు పిలిచెన్.
ఉ. తీయని మాటలాడుచును ధీమతి వోలెను పోజు బెట్టుచున్
మాయలు చేయువాడొకడు, మై నలుపై నొకడొప్పు తక్కువై
గాయపు మచ్చలుండినను గుణ్యత గల్గిన వాడు గావుటన్
రోయకఁ బెండ్లియాడెను కురూపిని చక్కని చుక్క ప్రేమతో.
ఆ. వె. పడకటింటగూడ ప్రాజెక్టు పనులాయె
తెల్లవారుదాక తీరదాయె
ఝాము పొద్దు కాగ జవరాలు నీవంటు
వేళ కాని వేళ బిలువ దగునె
కం.చూపెన్ పడతుల సొంపులు
ఆపయి వయలెన్సు నింపి ఔరా యనగన్
చూపెను దుబాయి లండన్
సూపరు హిట్ చిత్రము కయి సుతుడే కోరన్
తే. గీ. మాటి మాటికి ఫోనులో మంతనాలు
తప్పు కొనవలెనన్న యేదారి లేక
కాన్ఫరెన్సు యుందని చెప్పి కల్ల లాడ
సెల్లుఫోను లసత్యముల్ జెప్ప నేర్చె
ఆ. వె. జబ్బు చేసినంత డబ్బు సాయ మడుగ
ప్రాణ మిత్రుడొకడు పారి పోయె
వైరిగా తలచిన వాడు సాయ పడిన
ధనమె గొప్ప మంచితనము కంటె.
ఆ. వె.ఫాక్షనిజము సల్పి పలు నేరముల జేసి
పదవి వచ్చినంత ఫ్రాడు జేసి
తాను జచ్చినంత తనయుడు అరుదెంచి
పేరు లేనివాఁడు పేర్మిఁ గనెను.
తే. గీ.ధనము కలిగిన మనసుకు తృప్తి లేదు
కొంత యుండిన మరియింత కోర నగును
తనను మించిన కలుగును తామసంబు
కలిమి యెడబాసి నప్పుడే కలుగు సుఖము. 

మరిన్ని ఇంకో టపాలో...

Comments

  1. మీరు చాల బాగా పద్యరచన గావిస్తున్నారు.
    శంకరాభరణం బ్లాగులో మీరుచెసిన కొన్ని పూరణలు నాకు అద్భుతంగా తోచాయి.
    పద్యలాతో కుస్తీ ల్లో పెద్ద వస్తాదు కావాలని అభిలషిస్తున్నాను

    ReplyDelete
  2. అసంఖ్య గారు,

    మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

    ReplyDelete
  3. బాగున్నాయి.
    చివరి తేటగీతి " ధనము గలిగిన" చాలా బాగుంది.

    ReplyDelete
  4. మందాకినీ గారు,

    ధన్యవాదాలు.

    ReplyDelete
  5. హరి గారూ,
    మంచిమంచి పద్యాలు రాస్తున్నారు. మీ పద్యాలు అర్థవంతంగాను, పాడుకోటానికి వీలుగానూ ఉంటాయి. పదాలను అతికించినట్టు ఎక్కడా కనబడదు. అభినందనలు!

    ReplyDelete
  6. మీ బ్లాగు కూడళ్ళలో కనబడుతున్నట్టు లేదేంటి సార్?

    ReplyDelete
  7. చదువరి గారు,

    మే అభినందనలకు ధన్యవాదాలు.

    నా బ్లాగు కూడలి, హారం, మాలికలలో ఇండెక్స్ అవుతుందండి.

    ReplyDelete
  8. చదువరి గారు,

    మీ పద్యాలు ఇంకా బాగుంటాయి.

    ReplyDelete
  9. పద్యాలు చాలా బాగున్నాయి. అభినందనలు.

    ReplyDelete
  10. నచికేత్ గారు

    దన్యవాదాలు

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ

కాకరాపల్లిలో మానవమేధం

గంగవరం, ముదిగొండ మరపుకైనా రాలేదు. సోంపేట నెత్తురు తడి ఆరనైనా ఆరలేదు, మళ్ళీ కాకరా పల్లిలో మానవమేధం. ప్రభుత్వాలు ప్రజల అవసరాలను తాకట్టు పెట్టి పెట్టుబడి దారుల పాదాలకు మడుగులోత్తే క్రమంలో ఇంకా ఇలాంటి ఘటనలు ఎన్ని చూడాల్సి ఉందో ఆలోచిస్తేనే భయం గొల్పుతుంది. ఆ ప్రాంతపు ప్రజలు ప్రాణాలొడ్డి థర్మల్ ప్లాంటు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారంటేనే అది వారికి ఎంత నష్టదాయకమో చెప్పకనే చెపుతుంది. మరి అలాంటప్పుడు ప్రాజెక్టు అక్కడే పెట్టాలనే యావ ఈ ప్రభుత్వానికెందుకు? సమాధానం జగద్విదితం. ఆ ప్రాంతం పెట్టుబడి దారులకు అనుకూలమైనది. నీటి లభ్యత ఉంటుంది. పోర్టు దగ్గరగా ఉంటుంది. అనగా పెట్టుబడి దారునికి అధిక లాభాలు వస్తాయి. లోపాయికారీగా తమకు ఎక్కువ కమీషన్లు ముడుతాయి. అటువంటి పరిస్థితిలో ప్రభుత్వం పెట్టుబడి దారుడు చెప్పిన దానికి గంగిరెద్దులా తలూపడం తప్ప ప్రజల గురించి ఏమాలోచిస్తుంది? అసలు రక్షణలన్నీ పెట్టుబడి దారునికేనా? ప్రజల కేమీ లేవా? అన్న సందేహం కలుగుతుంది. పంట భూములను నాశనం చేసి ఫ్యాక్టరీలు నిర్మించడం ఏమిటి? అలా నిర్మించడానికి రాష్ట్రంలో బీడు భూములు చాలా ఉన్నాయి. అక్కడ పనులు లేక ఎంతోమంది కార్మికులు ఉన్నారు. అలాం